-
నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ
సాక్షి, అమరావతి/పామర్రు : రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణాజిల్లా పామర్రులో బటన్నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను జమచేయనున్నారు. దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేస్తోంది. పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్లాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తోంది. వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బందిపడకుండా జగనన్న వసతి దీవెనను అందిస్తోంది. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున రెండు విడతల్లో జమచేస్తోంది. ఇలా విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చుచేసింది. నేడు పామర్రుకు సీఎం వైఎస్ జగన్ రాక.. జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రజలకు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కృష్ణాజిల్లా పామర్రు రానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కనే ఉన్న సభాస్థలిని గురువారం మంత్రి జోగి రమేష్ స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్తో కలిసి పరిశీలించారు. శుక్రవారం ఉ.10 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయల్దేరి 10.30 గంటలకు పామర్రుకు చేరుకుంటారు. 10.50 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేస్తారు. సభానంతరం స్థానిక పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మ.1.55కు తాడేపల్లి చేరుకుంటారు. -
నేడు జగనన్న విద్యా దీవెన
సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు. ముందెన్నడూ లేనివిధంగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ విద్యావసతి కింద తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసిన, తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే మే 2023–ఆగస్ట్ 2023లలో 2,00,648 మంది విద్యార్థులకు మేలు చేస్తూ రూ.185.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యారంగంపై అక్షరాలా రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. -
అక్షరానికి అగ్రపీఠం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగాన్ని అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించారు. టీడీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ విద్యా రంగాన్ని విప్లవాత్మక సంస్కరణలతో ప్రక్షాళన చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంచలనాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు విద్యా రంగానికి పెద్దపీట వేసి ప్రభుత్వ విద్యను భ్రష్టు పట్టించగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ విద్యా రంగానికి తనదైన శైలిలో ఊపిరిలూది ప్రగతి బాట పట్టించారు. ఇంటాబయటా వెల్లువెత్తుతున్న ప్రశంసలే దీనికి నిదర్శనం. దాదాపు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో విద్యా సంస్కరణలకే ఏకంగా రూ. 66,722.36 కోట్లు వ్యయం చేశారు. నాడు–నేడుతో పాఠశాలల్లో కొత్త భవనాలు, తరగతి గదులు, అదనపు తరగతి గదులు, ప్రహరీ, డిజిటల్ బోర్డులు, ఫర్నిచర్, తాగునీటి సౌకర్యం, రన్నింగ్ వాటర్ సదుపాయంతో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు, తదితరాలను ఏర్పాటు చేశారు. నవశకానికి నాంది.. ♦ 2020 జనవరి 1న ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం. ♦ ఏటా సగటున రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.6,995.34 బడ్జెట్ కేటాయింపు ♦ టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం ఏటా చేసిన ఖర్చు రూ.450 కోట్లు మాత్రమే. ♦ 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి. ♦ ఈ ఏడాది ముగిసిన ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) పరీక్షల్లో 91.33 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. ♦ నాడు నేడులో తొలి విడత కింద 2019–20 విద్యా సంవత్సరంలో 15,713 పాఠశాలలను రూ.3,669 కోట్లతో సంపూర్ణంగా అభివృద్ధి చేశారు. రెండో విడత కింద రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ♦ 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జగనన్న అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేల చొప్పున జమ. ♦ పది, ఇంటర్ బోర్డు పరీక్షల్లో ప్రతిభ చాటినవారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సత్కారం. ♦ 10 మంది పేద ప్రతిభావంతులైన విద్యార్థులను అమెరికా సందర్శించే అవకాశం. ♦ 2019 జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు దాదాపు 47 లక్షల మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం రూ.15,762 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో జగనన్న విద్యాదీవెన కింద రూ. 11,317 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద మరో రూ. 4,267 కోట్లు చెల్లించింది. ♦ ప్రైవేటు వర్సిటీల్లో రూ.5 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సిన ఇంజనీరింగ్ కోర్సుల్లో 35 శాతం సీట్లలో రిజర్వేషన్ కోటా అమలు. ♦ గత నాలుగున్నరేళ్లల్లో 1,925 మంది విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థికంగా అండ. ♦ నైపుణ్య వర్సిటీ, ప్రత్యేక శిక్షణ సంస్థల ఏర్పాటుతోపాటు ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలను మరింత అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకు 2021–22 బడ్జెట్లో రూ.774.01 కోట్లు ఖర్చుచేయగా 2022–23 బడ్జెట్లో రూ.969.91 కోట్లు కేటాయించారు. మైక్రోసాఫ్ట్తో ఒప్పందం.. ఎడ్యుస్కిల్, సేల్స్ఫోర్స్తో కుదుర్చుకున్న ఒప్పందంతో మరో 1.45 లక్షల మంది విద్యార్థులు నైపుణ్య కోర్సులు పూర్తి చేశారు. ఒక రాష్ట్రంలో 1.64 లక్షల మంది విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి ప్రభుత్వం ఏపీనే కావడం విశేషం. దీంతో 2018–19లో క్యాంపస్ ఎంపికల్లో 37 వేల మంది ఉద్యోగాలు పొందితే, 2019–20లో 52 వేల మంది, 2020–21లో 69 వేల మంది, 2021–22లో 85 వేల మంది ఉద్యోగాలు పొందారు. ఇక 2022–23లో 1.20 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. దేశ సగటు కంటే మెరుగ్గా జీఈఆర్.. ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుండడంతో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో మన రాష్ట్రం దేశ సగటుకంటే చాలా ముందుంది. 2019–20లో ఇండియా సగటు 27.1 శాతం ఉంటే.. రాష్ట్రంలో 35.2 శాతం, 2020–21లో దేశ సగటు 27.3 శాతం ఉంటే రాష్ట్రంలో 37.2 శాతం జీఈఆర్ నమోదు కావడం విశేషం. మరోవైపు కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల నిబంధనలు కూడా విద్యా అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆడపిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. -
‘దీవెన’తో దిమ్మతిరిగి..
సాక్షి, అమరావతి : ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు దుష్ప్రచారం చేయడంలో గోబెల్ను సైతం రాజగురువు రామోజీరావు మించిపోయారు. సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలనే లక్ష్యంగా చేసుకుని తన విషపుత్రిక ఈనాడులో అబద్ధాలను అదేపనిగా అబద్ధాలను ప్రజలపై రుద్దేందుకు ఎల్లో మీడియా గత ఐదేళ్లుగా తెగ ప్రయాసపడుతోంది. ఇప్పుడు ఎంతో సమున్నతంగా ఉన్న ప్రభుత్వ విద్యా రంగంపై నిస్సిగ్గుగా తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా అసత్యాలను వండివారుస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ‘దీవెనే శాపమైన వేళ..’ అంటూ విద్యాదీవెన పథకంపై తన అక్కసునంతా రంగరించి ప్రదర్శించింది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న ఉన్నతాశయంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజును క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే ప్రస్తుత ప్రభుత్వం జమచేస్తోంది. గత ప్రభుత్వంతో పోలిస్తే.. అమల్లోగాని, నిధుల విడుదలలో గాని, లబ్ధిపొందుతున్న విద్యార్థుల సంఖ్యలోగాని ఈ ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు నూటికి నూరుశాతం విద్యాదీవెన ద్వారా మేలు జరుగుతోంది. అపరిమితంగా ఫీజు రీయింబర్స్మెంట్.. ఇక పేద విద్యార్థుల ఉన్నత చదువులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు ఎలాంటి పరిమితీలేదు. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందినీ చదివించవచ్చు. ఫీజు ఎంతైనా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందులో గరిష్టంగా రూ.3.05 లక్షల వరకూ రీయింబర్స్మెంట్ చేస్తోంది. గత ప్రభుత్వం ఏడాదికి ఇంజినీరింగ్ కోర్సులకు గరిష్టంగా రూ.35 వేలు, ఫార్మాకు రూ.68 వేలు మాత్రమే చెల్లించింది. అలాగే, గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలోనే కాదు, ఎందులోనూ సంతృప్తస్థాయి అన్నమాటే లేదు. ఇక ప్రభుత్వం ఫీజులు ఇచ్చేవరకూ వేచి చూడకుండా పిల్లల తల్లులు కట్టాలంటూ కొన్ని కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయంటూ ఈనాడు వక్రీకరణకు దిగింది. ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో డబ్బును జమచేసిన తర్వాత వారంలోగా ఆ మొత్తాన్ని కాలేజీలకు చెల్లించాలి. మూడు వారాల్లోగా చెల్లించకుంటే కాలేజీలు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాయి. దాంతో తదుపరి విడత ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బును నేరుగా కాలేజీ ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తోంది. దీంతో తల్లితండ్రులపై కాలేజీలు ఒత్తిడి తీసుకువచ్చే ఆస్కారమే లేదు. అలాగే, ఫీజు చెల్లించేంత వరకూ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని ఈనాడు చెప్పిందీ అబద్ధమే. ఇలా చేయడానికి కాలేజీలకు ఎలాంటి అధికారంలేదు. వివక్ష లేకుండా వసతి దీవెన.. ఇదేకాక.. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం అందిస్తోంది. గత ప్రభుత్వంలో అయితే కుల ప్రాతిపదికన, కోర్సు ప్రాతిపదికన కేవలం రూ.4 వేల నుంచి గరిష్టంగా రూ.10 మాత్రమే ఇచ్చేవారు. అలాగే, ఎస్సీ, ఎస్టీలకు వార్షికాదాయాన్ని రూ.2 లక్షలు, ఇతర వర్గాలకు రూ.లక్ష పరిమితి పెడితే, ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపకుండా అర్హులైన అందరికీ వసతి దీవెన అమలుచేస్తోంది. వసతి దీవెన డబ్బులు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకే జమచేస్తోంది. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం చెల్లింపు.. గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజు చెల్లించేందుకు తల్లిదండ్రులు అప్పులు పాలైనా, ఇవ్వాల్సిన అరకొర ఫీజులను ఇవ్వకుండా బకాయి పెట్టినా.. ఫీజులు కట్టలేక, సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఏనాడూ రామోజీ తన ఈనాడులో ఒక్క కథనాన్ని కూడా ప్రచురించలేదు. కానీ, ఈ ప్రభుత్వం ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ఫీజులు చెల్లించడంతో పాటు, 2017 నుంచి ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సైతం చెల్లించింది. అంతేకాక.. సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేస్తూ పేద విద్యార్థులకు అండగా నిలిచింది. పైగా దేశంలో నూరుశాతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేస్తోంది సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఒక్కటే. అయినా, ఇదేమీ పట్టని రామోజీ మాత్రం ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. నిజానికి.. టీడీపీ పాలన ఐదేళ్లలో చెల్లించిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి ఖర్చులు సగటున ఏడాదికి రూ.2,428 కోట్లు అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఏటా చెల్లిస్తున్న సగటు మొత్తం రూ.4,044 కోట్లు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.10,332 కోట్లు వెచ్చిస్తే.. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.15,592.87 కోట్లు ఖర్చుచేసింది. 26.98 లక్షల మందికి విద్యాదీవెన కింద రూ.11,317.11 కోట్లు.. 25.17 లక్షల మందికి వసతి దీవెన కింద మరో రూ.4,275.76 కోట్లు చెల్లించింది. ♦ 2022 అక్టోబరు–డిసెంబరు కాలానికి చెల్లించాల్సిన రూ.698.68 కోట్లను ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే చెల్లించింది. ♦ జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి రూ.702.99 కోట్లను ఈ ఏడాది మే 24న చెల్లించింది. ♦ ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికం మొత్తాన్ని ఆగస్టులో చెల్లించింది. ♦ ఇప్పుడు జూలై–సెప్టెంబరు త్రైమాసికం సొమ్ము చెల్లింపు తుపాను కారణంగా వాయిదాపడింది. ఇది ఈనెల 29న భీమవరంలో జరిగే కార్యక్రమంలో 26.98 లక్షల మందికి జగనన్న విద్యాదీవెన, 25.17 లక్షల మందికి జగనన్న వసతి దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఇంత ఠంఛనుగా ఎప్పటికప్పుడు విద్యార్థులకు చెల్లింపులు చేస్తుంటే రామోజీకి దిమ్మతిరిగిపోతోంది. దీంతో విద్యార్థులకు నష్టం జరిగిపోతోందంటూ ఈనాడు పెడబొబ్బలు పెడుతోంది. -
నత్తనడకన ఉపకార దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియకు స్పందన కరువైంది. ఈ పథకాల కింద దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి రెండు నెలలు దాటినా ఇప్పటివరకు కనీసం పావువంతు మంది విద్యార్థులు కూడా ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలుస్తోంది. కోర్సు పూర్తయ్యే వరకు విద్యార్థులు ఏటా క్రమం తప్పకుండా ఈ దరఖాస్తులు సమర్పించడం తప్పనిసరి.. కాలేజీ యాజమాన్యం సైతం చొరవ తీసుకుని ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేయించాలి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి 12.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. కానీ ఇప్పటివరకు 2.5 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అధికారిక అంచనాతో పోలిస్తే 20 శాతం మాత్రమే దరఖాస్తులు సమర్పించడం గమనార్హం. వచ్చే నెలాఖరుతో ముగియనున్న గడువు..: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు డిసెంబర్ నెలాఖరుతో ముగియనుంది. దరఖాస్తు ప్రారంభ సమయంలోనే నాలుగు నెలల పాటు గడువు ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. గడువు పెంపు ఉండదని స్పష్టం చేసింది. ఈమేరకు కాలేజీ యాజమాన్యాలకు సర్క్యులర్లు సైతం జారీ చేసింది. విద్యార్థులు ఈపాస్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చొరవ తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాలకు సూచించింది. కానీ క్షేత్రస్థాయిలో కాలేజీ యాజమాన్యాలు కనీసం పట్టించుకోవడం లేదు. ఒక విద్యార్థి కోర్సు ముగిసే వరకు ప్రతి సంవత్సరం ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొత్తగా కోర్సులో చేరే విద్యార్థి ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తుకు సంబంధించిన వివరాలను సమర్పించాలి. ఇప్పటికే కోర్సులో చేరి తదుపరి సంవత్సరం చదివే విద్యార్థి రెన్యువల్ కేటగిరీలో దరఖాస్తు సమర్పించాలి. విద్యార్థి వివరాలు కాలేజీ యాజమాన్యం వద్ద అందుబాటులో ఉండడంతో యాజమాన్యమే ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించి దరఖాస్తు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయవచ్చు. కానీ యాజమాన్యాలు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో దరఖాస్తు ప్రక్రి య నెమ్మదిగా సాగుతోంది. గతేడాది దరఖాస్తు ప్రక్రియను దాదాపు ఏడు నెలల పాటు కొనసాగించారు. గడువు ముగిసినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘా ల కోరిక మేరకు ప్రభుత్వం గత ఏడాది మూడు సార్లు గడువును పొడిగించింది. కానీ ఈ ఏడాది పొడిగింపు ప్రక్రియ ఉండదని, నిర్దేశించిన సమయానికి దరఖాస్తు సమర్పించాలని సూచించినప్పటికీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది. మరో నెలన్నరలో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియను గడువులోగా పూర్తి చే యాలంటూ తాజాగా జిల్లాస్థాయిలో సంక్షేమ శాఖల అధికారులు కాలేజీ యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నారు. -
సీఎం జగన్ కలలు సాకారమవుతున్న వేళ..
అగనంపూడి (గాజువాక): ప్రతీ పేదింటి బిడ్డ ఉన్నత చదువుల్లో రాణించాలని..ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని సీఎం జగన్ తపన..ఆరాటం సఫలీకృతమవుతుండటం సంతోషంగా ఉందని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు కృష్ణదేవరాయలు అన్నారు. అమెజాన్ ప్రాంగణ ఎంపిక ప్రక్రియలో ఎంపికైన 13 మందిలో 9 మంది విద్యార్థులు ఫీజ్ రీయింబర్స్మెంట్తో చదువుకున్నట్లు తెలిపారు. వీరికి వార్షిక వేతనం రూ.26 లక్షలు అని చెప్పారు. వీరితోపాటు మరో 13 మంది కూడా 3 సంస్థల్లో ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. ఒకరు రూ.12 లక్షల వార్షిక వేతనం, 12 మందికి రూ.10 లక్షల ప్యాకేజీతో దేవరెవ క్లౌడ్ ఇండియా, ఇన్సిర్క్స్, ఎటర్నల్ రోబోటిక్స్ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు వివరించారు. కళాశాలలో చేరిన తొలి ఏడాది నుంచి విలువలతో కూడిన విద్యతో పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం ప్రత్యేక శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్తోపాటు విద్యార్థులను మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంచడటంతోపాటు నైతిక విలువలూ పెంపొందిస్తున్నామని చెప్పారు. విజ్ఞాన్ సీఈవో ఎన్.శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ఉచితాలన్నీ.. అనుచితమేం కాదు
మేకల కల్యాణ్ చక్రవర్తి : ఎన్నికలు, రాజకీయాలు ఆర్థికాంశాలతోనే ముడిపడి ఉంటాయని.. ప్రజల ఆర్థిక ప్రయోనాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ఎజెండాలు అవుతాయని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ అందె సత్యం స్పష్టం చేశారు. అయితే రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలన్నీ అనుచితమేమీ కావని.. కొన్ని పైకి ఉచితంగానే కనిపిస్తున్నా ఉత్పత్తిని పెంచే సాధకాలుగా ఉపయోగపడతాయనే అభిప్రాయపడ్డారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం కన్నా.. ప్రజలను కొనుగోలు చేయడంపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికలు, ప్రజల ఎజెండా, ఆర్థిక ప్రయోజనాలు, వాటి ప్రభావం, రాజకీయాల్లో వచ్చిన మౌలిక మార్పులపై అందె సత్యం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ.. ఎన్నికలకు, ఆర్థిక ప్రయోజనాలకు అసలు సంబంధమేంటి? ఎన్నికల్లో ఒక భాగం రాజకీయాలైతే, మరోభాగం ఆర్థికఅంశాలు. ఎత్తుగడలు, పొత్తులు, విధానాలు రాజకీయ అంశాలైతే.. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి నవి ఆర్థికాంశాలు. ఎన్నికల ప్రణాళికల్లో సంక్షేమం, ఉచితాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. సంక్షేమంతోపాటు ఉత్పత్తిని పెంచే విధానాలూ ఉంటాయి. ఓట్ల కోసం ఉచిత హామీలు ఉంటాయి. ఉచితాలు సరికాదనే చర్చపై మీ అభిప్రాయం? తమిళనాడులో మాదిరిగా మిక్సీలు, టీవీలు ఇస్తే అవి ఉచితాల కిందకు వస్తాయి. మన రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ దిశలో ఆలోచించడం లేదు. వారి ప్రణాళికల్లో అనుచితాలు లేవు. టీవీ ఇస్తే ప్రజలకు సంక్షేమమేమీ లేదు. ఉత్పత్తి రాదు. కేవలం వినోదం మాత్రమే వస్తుంది. అలాంటివి అనుచితం. అదే పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేయడం వారు అప్పుల బారినపడకుండా చూడటమే. వీటిని ఉచితాలుగా చూడొద్దు. ఇవి సాంఘిక సంక్షోభానికి పరిష్కార మార్గాల్లాంటివి. వ్యవసాయానికి ఆర్థిక సాయం మంచి అంశమేనా? ఏ దేశంలోనైనా వ్యవసాయం గిట్టుబాటుగా లేదు. చాలా దేశాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికాలో దశాబ్దకాలంగా రైతులకు అయ్యే ఖర్చులో సగ భాగం సబ్సిడీ ద్వారా ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. అయినా రైతుల సంఖ్య 60 లక్షల నుంచి 20 లక్షలకు తగ్గిందన్న విషయాన్ని గుర్తించాలి. వ్యవసాయానికి అన్నివిధాలా సాయం చేసి నిలబెట్టుకోవడం అవసరం. వ్యవసాయ సబ్సిడీలు, పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, రుణమాఫీ కచ్చితంగా ఉత్పత్తి కోవలోకే వస్తాయి. ఆ ప్రణాళికల ఫలితం తెలంగాణలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆసరా పెన్షన్లు ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆరోగ్యశ్రీ పథకాలను విస్తృతం చేయడం ద్వారా మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. విద్య, వైద్య రంగాల్లో ఖర్చుతో ప్రయోజనమేనా? విద్య, వైద్య రంగాల్లో ఖర్చు సమంజసమైనది. వైద్యంపై ఖర్చు జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతుంది. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పార్టీలు మాట్లాడకపోవడం నిరుత్సాహాన్ని కలిగించేదే. ఉన్నత విద్యా రంగంలో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. నేటికీ దేశంలో 30శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కాబట్టి విద్యపై ఖర్చు అవసరం. కేరళలో ఆరోగ్య, విద్యా వనరుల కారణంగానే పేదరికం 0.7 శాతానికి తగ్గింది. పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టడం.. ఎన్నికల సమయంలో అభ్యర్థులు పెట్టే ఖర్చు కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. తెలంగాణలోనూ అసెంబ్లీ సెగ్మెంట్కు రూ.25 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందన్న అంచనాలున్నాయి. ఇది ప్రజాభిప్రాయాన్ని హైజాక్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై మీ స్పందన? వ్యవస్థ పూర్తిగా వాణిజ్యపరమైనప్పుడు రాజకీయాలు కూడా వాణిజ్యపరం అవుతాయి. రాజకీయ పార్టీల నాయకులు గతంలో వ్యాపారుల దగ్గర ఆర్థిక సాయం తీసుకునేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులే వ్యాపారులయ్యారు. ఈ లక్షణాన్నే ఎన్నికల్లోనూ ఉపయోగిస్తున్నారు. జమిలి ఎన్నికలతో... భారత్లో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మధ్యంతరంగా కూలిపోయినప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. జమిలి ఎన్నికల ప్రతిపాదన భవిష్యత్లో అధ్యక్ష తరహా పాలనకు దారితీయొచ్చు. ప్రజలు ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలా ఎదురుచూడాల్సిందేనా? ఎప్పుడూ ప్రభుత్వాల వద్ద అడుక్కుని లబ్ధి పొందడమే ప్రజల పనిగా మారింది. భూపంపిణీతోపాటు సామాజిక సమస్యలను పరిష్కరించని కారణంగానే ఈ దుస్థితి. ప్రజల కొనుగోలు శక్తిని నిరంతరం పెంచే విధంగా కాకుండా ప్రజలను కొను గోలు చేసి రాజకీయ నాయకులు కుంభకోణాలకు పాల్పడుతున్నారు. అందుకే ఆర్థిక ప్రయోజనాల కోసం ఎన్నికల సమయంలో ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. నగదు బదిలీ పథకాలతో నష్టమా.. లాభమా? దేశంలో ఆకలి సూచీలు దిగజారిపోతున్నాయి. అంటే కింది స్థాయి పేదలకు ప్రభుత్వాల సాయం అవసరమే. పేదల కొనుగోలు శక్తి కారణంగా ప్రభుత్వానికి పన్నులు వస్తాయి. డిమాండ్, ఉత్పత్తి పెరుగుతాయి. ఇక మన దేశంలో ఉద్యోగులు, కార్మి కుల వాటా ఎక్కువ. పాత పింఛన్ ప్రభుత్వాలకు భారమనేది అభివృద్ధి నిరోధక ఆలోచన. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా పాత పింఛన్ విధానాన్నే అమలు చేస్తున్నాయి. -
టోకెన్లతోనే సరి
సాక్షి, హైదరాబాద్: టోకెన్లు ఇచ్చి ఏడాది అవుతున్నా..పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు మాత్రం విడుదల కాలేదు. గతే డాది అక్టోబర్లో ఆయా బిల్లులకు సంబంధించి ఆర్థికశాఖ పోర్టల్లో జనరేట్ అయ్యి టోకెన్ నంబర్లు కూడా జారీ అయ్యాయి. నిధులు విడుదల కాకపోవడంతో ఇటు విద్యార్థులు..అటు ప్రైవేట్ కాలేజీ యాజమన్యాలు లబోదిబోమంటున్నాయి. దరఖాస్తు నుంచి ట్రెజరీ వరకు ఇలా... పోస్టుమెట్రిక్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన, కోర్సు కొనసాగిస్తున్న విద్యార్థులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయడం..వాటిని కాలేజీస్థాయిలో యాజమాన్యాలు పరిశీలించి సంక్షేమశాఖలకు సమర్పించడం... సంక్షేమశాఖల అధికా రులు ఆయా దరఖాస్తులను మరోమారు పరిశీలించి ఆమోదం తెలపడం.. ఆ తర్వాత అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు ఖజానా శాఖకు సిఫార్సు చేయడం అంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. కాలేజీ యాజమాన్యాలు ఒక్కో విద్యార్థికి సంబంధించిన ఫైలు కాకుండా ఒక కోర్సు చదువుతున్న విద్యార్థులందరి ఫైళ్లు కలిపి ఒక బిల్లుగా తయారు చేసి ఖజానాశాఖకు సమర్పిస్తాయి. అవన్నీ రెండేళ్ల కిందటివే... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్నాయి. 2019–20, 2020–21 విద్యా సంవత్సరాలకు సంబంధించి పలు బిల్లులు గతేడాది అక్టోబర్ నాటికి ఖజానా శాఖకు సమర్పించాయి. నాలుగు సంక్షేమ శాఖలకు సంబంధించి రూ.1115 కోట్లు వరకు బిల్లులున్నాయి. ఇందులో సాగానికిపైగా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినవే. సంక్షేమ శాఖలు సమర్పించిన బిల్లులను ఖజానా అధికారులు పరిశీలించి టోకెన్లు జనరేట్ చేస్తారు. అయితే ఇప్పటివరకు ఆర్థిఖశాఖ పోర్టల్లో ఆ బిల్లులకు ఆమోదం దక్కలేదు. ఏడాది కాలంగా ఇవన్నీ పెండింగ్లో ఉండడంతో ఒకవైపు విద్యార్థులు, మరోవైపు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉపకారవేతన నిధులు విద్యార్థి బ్యాంకు ఖాతాలో, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక జాప్యం జరుగుతుండడంతో కాలేజీ యాజమాన్యాలు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు రాష్ట్ర సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, ఆర్థికశాఖ అధికారులను ప్రత్యేకంగా కలిసి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా, నిధుల విడుదలపై ప్రభుత్వం స్పందించలేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో కాలేజీల నిర్వహణపై చేతులెత్తేయాల్సి వస్తోందంటూ తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్ ‘సాక్షి’తో అన్నారు. -
ఓట్ల కోసం కేసీఆర్ కపట నాటకం
మధిర: పదేళ్లు అధికారంలో ఉండి చేయలేని పనులను పదిరోజుల్లో చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం ప్రజలను మోగించడమేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా మధిరలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తశుద్ధితో పనిచేసే సీఎం కావాలా, ఫామ్హౌస్లో పడుకునే సీఎం కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు క్యాంప్ ఆఫీసులో ప్రజల సమస్యలు తెలుసుకుని, వినతిపత్రాలు స్వీకరించడమే కాక అన్ని పారీ్టల ఎమ్మెల్యేల సమస్యలు వినేవారని, సచివాలయంలో అధికారులతో సమీక్షలు చేసేవారని గుర్తుచేశారు. ఇందులో ఏ ఒక్కటీ చేయలేని కేసీఆర్, ఆరు నెలలకోసారి అసెంబ్లీని మూడు రోజులు తూతూమంత్రంగా నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు సీఎం అయితే ఏంటీ? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎవరు సీఎం అయితే ఏంటీ.. రాజీవ్ ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్లు, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలవుతాయా, లేదా అన్నదే ముఖ్యమని భట్టి అన్నారు. కేసీఆర్ అనవసరంగా సీఎం గోల ఎత్తుకున్నారని మండిపడ్డారు. దోపిడీ, కమీషన్లు లేకుండా ప్రతీపైసా ప్రజల కోసం ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు నిధుల సమస్య రాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో పారీ్టపరంగానే తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని భట్టివిక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. -
పేద బిడ్డల చదువులకు పెన్నిధి
సాక్షి, అమరావతి: ఆర్థికంగా ఉన్నవారికే ఉన్నత విద్య అన్నట్టున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ సంక్షేమ చదువుల విప్లవాన్ని సృష్టించారు. దేశ చరిత్రలోనే లేని ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి కులమతాలతో సంబంధం లేకుండా ఉన్నత విద్య పేదలందరికీ ఉచితమే అని ప్రకటించారు. 2005–08 మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులైన 26.67 లక్షల మందికి ఈ పథకం కింద రూ.2 వేల కోట్లను ఖర్చుచేశారు. ఇక 2009ని సంక్షేమ నామ సంవత్సరంగా ప్రకటించి.. 7 లక్షల మంది అగ్రవర్ణ పేదలను కూడా ఈ పథకంలో భాగం చేశారు. వారి ఉచిత చదువుల కోసం రూ.350 కోట్లు కేటాయించారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టని ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో 33.67 లక్షల మంది పేద విద్యార్థుల చదువులకు పెన్నిధిలా నిలిచారు. 18 యూనివర్సిటీల స్థాపన.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యకు 2003–04లో కేవలం రూ.4,468 కోట్లు మాత్రమే కేటాయించారు. అదే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008–09లో రూ.11 వేల కోట్లు కేటాయించి దేశంలోనే ఈ రంగానికి అధిక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలని నిర్ణయించి కొత్తగా 18 విశ్వవిద్యాలయాలను స్థాపించారు. పేద విద్యార్థులకు సైతం ఖరీదైన ఐటీ శిక్షణ అందించాలని నిర్ణయించి నూజివీడు, ఇడుపులపాయ, బాసరలో ట్రిపుల్ ఐటీలను అందుబాటులోకి తెచ్చారు. ఆయన బాటలోనే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి ప్రారంభించిన ప్రజా సంక్షేమ పథకాలను, ఫీజు రీయింబర్స్మెంట్ను నూరు శాతం అమలు చేస్తున్నారు. అంపశయ్యపై ఉన్న ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు: మన బడి కింద పది రకాల సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. పేదింటి పిల్లలు అంతర్జాతీయ పౌరులుగా ఎదగాలని, ప్రపంచ స్థాయిలో పోటీపడాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ను ప్రవేశపెట్టారు. జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారు. అంతేకాకుండా విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న ప్రతిభావంతులకు రూ.1.25 కోట్ల ఫీజును సైతం చెల్లించడం ఆయనకే చెల్లింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఈ నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్ విద్యా రంగానికి రూ.69,289 కోట్లు ఖర్చు చేశారు. -
సమున్నతం!
సాక్షి, అమరావతి: పునాది బాగుంటేనే ఓ భవనమైనా, చదువులైనా పది కాలాల పాటు పటిష్టంగా ఉంటాయి! ప్రాథమిక స్థాయి నుంచి విద్యారంగ సంస్కరణలను చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇందుకోసం నాలుగేళ్లలో రూ.65 వేల కోట్లకుపైగా వెచ్చించడం చదువులకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. ఉన్నత విద్యలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తూ తల్లిదండ్రులపై ఫీజుల భారం పడకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పాటు భోజన, వసతి ఖర్చులను సైతం ప్రభుత్వమే భరిస్తోంది. ఇంటర్ తర్వాత ఏ విద్యార్థి చదువుకూ ఆటంకం కలుగకుండా 2019 జూన్ నుంచి ఈ ఏడాది జూలై వరకు దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు మొత్తం రూ.14,912.43 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో జగనన్న విద్యాదీవెన కింద రూ.10,636.67 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేయగా విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన కింద మరో రూ.4275.76 కోట్లు అందించింది. ఇక జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా మరో రూ.132.41 కోట్లను 1,858 మంది విద్యార్థులకు అందచేసి ఉన్నత చదువులకు అండగా నిలిచింది. మరోవైపు ఇంజనీరింగ్తో పాటు సంప్రదాయ డిగ్రీ కోర్సులు చదివిన వారికి చక్కటి ఉపాధి, ఉద్యోగాలు లభించేలా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, సర్టిఫికేషన్ కోర్సులను ప్రవేశపెట్టింది. తొలిసారిగా ప్రైవేట్ వర్సిటీల్లో 35 శాతం సీట్ల కోటా ప్రైవేట్ వర్సిటీల్లో రూ.5 లక్షల వరకు ఫీజులు చెల్లించాల్సిన ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు సంబంధించి దేశంలోనే తొలిసారిగా ఆ వర్సిటీల్లో 35 శాతం సీట్ల కోటాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తద్వారా పేద మెరిట్ విద్యార్థులకు వాటిల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించింది. 27 వేల సంస్థల్లో ఇంటర్న్షిప్ గతంలో డిగ్రీ చేతికొచ్చినా తగినన్ని నైపుణ్యాలు లేకపోవడంతో ఉద్యోగం, ఉపాధి లభిస్తుందన్న నమ్మకం లేదు. దీన్ని సరిదిద్ది నూతన బోధనా విధానాలపై శిక్షణ కార్యక్రమాలతోపాటు ఎడెక్స్ లాంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థల ద్వారా సర్టిఫికేషన్ కోర్సులను అందుబాటులోకి తెస్తోంది. ఇంటర్న్షిను తప్పనిసరి చేసింది. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు ఏడాది పాటు ఇంటర్న్షి అమలు చేస్తుండగా నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ (ఆనర్స్) కోర్సులు చదివే వారికి ఏడాది ఇంటర్న్షి ప్రవేశపెట్టారు. మూడేళ్లలో డిగ్రీ కోర్సు నుంచి బయటకు వచ్చేవారికి 10 నెలల ఇంటర్న్షి తప్పనిసరి చేసింది. జిల్లాకు ఒక డిగ్రీ కాలేజీని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా తీర్చిదిద్దుతోంది. ఇంటర్న్షి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని 27,119 సంస్థలను గుర్తించారు. వీటిలో ఏపీ జెన్కో, హ్యుందాయ్, కియా మోటార్స్, విప్రో, అమర్రాజా బ్యాటరీస్, కోల్గేట్ పామోలివ్ (ఇండియా) లిమిటెడ్, హీరో మోటోకార్ప్ లిమిటెడ్, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్, రా్రïÙ్టయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, సెంబ్కార్ప్ ఎనర్జీ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, ఫైజర్ హెల్త్కేర్ ఇండియా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, మైలాన్ లేబోరేటరీస్ లిమిటెడ్ లాంటి ప్రముఖ సంస్థలున్నాయి. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ లాంటి కోర్సులు చదివిన 2,91,022 మంది విద్యార్థులు తమ సర్టిఫికేషన్ను పూర్తి చేయడం విశేషం. కమ్యూనిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో ఇంటర్న్షిప్ కోసం యునిసెఫ్కు అనుబంధంగా ఐదు లక్షల మంది విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేశారు. భారీగా ప్లేస్మెంట్స్ విద్యార్థులకు సాంకేతిక శిక్షణ అందించేందుకు నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో లక్ష మంది విద్యార్థులు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, సేల్స్ఫోర్స్ వంటి కంపెనీల్లో వర్చువల్ ఇంటర్న్షిప్ పూర్తిచేసి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. ఎడ్యుస్కిల్, సేల్స్ఫోర్స్తో కుదుర్చుకున్న ఒప్పందంతో మరో 1.45 లక్షల మంది విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి కోర్సులు పూర్తి చేశారు. లక్షల మంది విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. వీటివల్ల ప్లేస్మెంట్స్ గణనీయంగా పెరిగాయి. క్యాంపస్ ఎంపికల్లో 2019–20లో 52 వేల మంది, 2020–21లో 69 వేల మంది, 2021–22లో 85 వేల మంది ఉద్యోగాలు పొందగా 2022–23లో ఈ సంఖ్య 1.20 లక్షలకు పెరగడం విశేషం. నైపుణ్యాలకు పదును విద్యార్థులను ఉత్తమ రీతిలో తీర్చిదిద్దాలంటే అధ్యాపకులకు నైపుణ్యాలపై శిక్షణ అవసరం. ఇందుకోసం 400 మంది అధ్యాపకులకు వరంగల్లోని ఎన్ఐటీలో మరో వెయ్యి మంది అధ్యాపకులకు ఆన్లైన్ ద్వారా ఈ–కంటెంట్పై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు నచ్చిన సమయంలో కోరుకున్న సబ్జెక్టును చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. వీడియో పాఠాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సమస్యలకు పరిష్కారాలు, ప్రశ్నాబ్యాంకు లాంటి వనరులను అందుబాటులో ఉంచుతున్నారు. 3,146 వీడియోలను సిద్ధం చేసి ఎల్ఎంఎస్కు జోడించారు. న్యాక్ అక్రిడిటేషన్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల ద్వారా కళాశాలల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు డిపార్ట్మెంట్ అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్ను ప్రభుత్వం చేపట్టింది. బడ్జెట్లో భారీగా నిధులు యువత నైపుణ్యాలను పెంపొందించేందుకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ప్రత్యేక శిక్షణ సంస్థలనూ నెలకొల్పుతున్నారు. ఇందుకోసం 2022–23 బడ్జెట్లో రూ.969.91 కోట్లు కేటాయించడం గమనార్హం. 2035 నాటికి అన్ని కాలేజీలు స్వయం ప్రతిపత్తితో డిగ్రీలను ప్రదానం చేసే సంస్థలుగా ఎదగాలన్న యూజీసీ లక్ష్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాలేజీల్లో విద్యలో సంస్కరణలను అమలు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డ్యూయల్ మేజర్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఆనర్స్) ప్రవేశపెట్టింది. 144 కాలేజీల్లో వర్చువల్ క్లాస్ రూములను ఏర్పాటు చేసి అధునాతన విధానాల్లో బోధించేలా చర్యలు తీసుకుంది. ఐసీటీ ఆధారిత బోధన, అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు 56 కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూములను నెలకొల్పారు. ఉపాధికి ఊతమిచ్చేలా కోర్సులు రాష్ట్రంలో 152 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 111 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, 1,022 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో మొత్తం 3,65,563 సీట్లుండగా 2 లక్షల నుంచి 2.5 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. కాలేజీ విద్యను పటిష్టం చేయడంలో భాగంగా ప్రమాణాలు పాటించని విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 30 మంది కన్నా తక్కువ చేరికలున్న కాలేజీలకు ముందుగా నోటీసులిచ్చి ఆ తర్వాత మూసివేతకు, కోర్సుల రద్దుకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే ఇతర కాలేజీలకు తరలించేలా ఏర్పాట్లు చేసింది. అన్ని డిగ్రీ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలని నిర్ణయించి అమల్లోకి తెచ్చింది. యూజీసీ కంటే ముందే ఉమ్మడి పీజీసెట్ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష ఉండాలని సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు (సీయూఈటీ)ని యూజీసీ అమల్లోకి తెచ్చింది. దీనిద్వారా విద్యార్థులకు బహుళ పరీక్షలు రాసే ఇబ్బంది తప్పడంతో పాటు ఫీజుల వ్యయమూ తగ్గుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం యూజీసీ కంటే ముందే అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సులకు 2021లోనే కామన్ ఎంట్రెన్స్ టెస్టును అమల్లోకి తెచ్చింది. యూజీసీ ఆలోచనలను ఏడాది ముందుగానే అమల్లోకి తెచ్చింది. విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ అందరి కంటే ఒక అడుగు ముందే ఉంది. జాతీయ సగటుకు మించి జీఈఆర్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తుండడంతో మన రాష్ట్రంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరిగింది. 2020–21లో దేశంలో సగటు జీఈఆర్ 27.3 శాతం ఉండగా రాష్ట్రంలో 37.2 శాతంగా నమోదైంది. కాలేజీల్లో ఎస్సీ విద్యార్థుల చేరికల పెరుగుదలలో జాతీయ స్థాయిలో కంటే మన రాష్ట్రం మెరుగ్గా ఉంది. చదువుల వ్యయంతోపాటు ఇంటర్న్షిప్, స్కిల్ కోర్సులను అందిస్తుండటంతో జీఈఆర్ గణనీయంగా పెరిగింది. కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు యువతుల వివాహ వయసు 18 ఏళ్లు నిండడంతో పాటు 10వ తరగతి చదవడం తప్పనిసరి అనే నిబంధన విధించడంతో బాలికల విద్యా రేటు పెరిగింది. ఈ పథకాలతో ప్రయోజనం పొందిన 50 శాతానికి పైగా యువతులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారే కావడం గమనార్హం. -
ముందే ఫీ‘జులుం’
పాలిసెట్ ద్వారా ధనుంజయ్ రంగారెడ్డి జిల్లా మీర్పేట్లోని ఓ కాలేజీలో సీటు సాధించాడు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి అర్హత ఉంది. ట్యూషన్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదని అనుకున్నాడు. సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన తర్వాత అడ్మిషన్కు కాలేజీకి వెళ్లాడు. అయితే పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామని కాలేజీ యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో ఒక్కసారిగా రూ.18వేలు చెల్లించే పరిస్థితి లేక ధనుంజయ్ సతమతమయ్యాడు. సీటు కోల్పోతాననే ఆందోళనతో తండ్రికి అసలు విషయం చెప్పగా, అప్పు చేసి వెంటనే ఫీజు చెల్లించి కాలేజీలో చేరాడు. ఫీజురీయింబర్స్మెంట్ పథకానికి అర్హత ఉన్న ధనుంజయ్ ఒక్కడే కాదు..ఆ కాలేజీలో కన్వినర్ కోటాలో వివిధ బ్రాంచ్ల్లో సీటు దక్కించుకున్న దాదాపు 500 మందికి పైగా విద్యార్థులంతా ఇదే తరహాలో ట్యూషన్ ఫీజు సొంతంగా చెల్లించి అడ్మిషన్లు తీసుకున్నారు. పలు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర వృత్తివిద్యా కాలేజీలన్నీ ఇదే తరహాల్లో విద్యార్థుల నుంచి ముందస్తుగా ఫీజు చెల్లిస్తేనే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఆయా కోర్సులు అందించే కాలేజీలు ఇలా... సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తోంది. వృత్తివిద్యా కోర్సుల అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఆదాయపరిమితికి లోబడిన, కన్వినర్ కోటాలో సీటు దక్కించుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇంటర్లో చేరే విద్యార్థులు, దోస్త్ ద్వారా జనరల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి కూడా ఈ పథకం అమలవుతోంది. వాస్తవానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద సీటు సాధిస్తే నిబంధనలకు లోబడి ఎలాంటి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. నేరుగా కాలేజీలో అడ్మిషన్ తీసుకొని కోర్సు పూర్తిచేసే వరకు ఉచితంగా చదువుకోవచ్చు. కానీ మెజారిటీ కాలేజీలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. అడ్మిషన్ సమయంలోనే కొన్ని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థి నుంచి ముందస్తుగా ట్యూషన్ ఫీజు వసూలు చేస్తున్నాయి. అలా ఫీజును చెల్లించిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు చెల్లిస్తే.. అప్పుడు రికవరీ రాష్ట్రంలో పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 12.65లక్షలు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అర్హత ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు నిధులు విడుదల చేస్తుంది. నేరుగా కాలేజీ యాజమాన్యం ఖాతాలో అవి జమ అవుతాయి. పాలిటెక్నిక్ కోర్సు మూడు సంవత్సరాలు, ఇంజనీరింగ్ కోర్సు నాలుగేళ్లు... ఇలా ఆయా కోర్సు కాలపరిమితి ఉండగా, విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత ఆ సంవత్సరానికి సంబంధించిన నిధులను తదుపరి అకడమిక్ ఈయర్ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం కాలేజీ ఖాతాలో జమ చేస్తుంది. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యం విద్యార్థి చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెక్కు రూపంలో అతనికే చెల్లిస్తుంది. వాస్తవానికి విద్యార్థి నుంచి ఫీజు వసూలు చేసుకోవడం, తర్వాత అతడికి తిరిగి చెల్లించడం నిబంధనలకు విరుద్ధం. లిఖిత పూర్వక ఫిర్యాదులు నిల్ రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు అదే కాలేజీలో చదవాల్సి ఉండడంతో ముందస్తు ఫీజు వసూళ్లపై విద్యార్థులు ఎలాంటి ఫిర్యాదులు చేయడం లేదు. ఇలా ఫిర్యాదు చేస్తే కాలేజీల్లో ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందనే భావన మెజారిటీ విద్యార్థుల్లో ఉంది. ఫీజుల చెల్లింపులపై సంక్షేమ శాఖలకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు. -
పైసా ఇవ్వలే...
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ ప్రముఖ కాలేజీలో డి.సాయికిరణ్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఎంసెట్లో ఉత్తమర్యాంకు సాధించి కన్వినర్ కోటాలో సీటు దక్కించుకున్న సాయికిరణ్ ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హుడు. కానీ రెండేళ్లుగా వ్యక్తిగతంగా ఫీజు చెల్లిస్తున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్కు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ నిధులు జమ కాగానే చెక్కు రూపంలో ఫీజు వెనక్కి ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెప్పడంతో ధైర్యం చేశాడు. సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్కు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయడం లేదు. కోవిడ్ తర్వాత నిధుల విడుదలలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. దాని ప్రభావం విద్యార్థుల చదువులు, ఇతర అంశాలపై పడుతోంది. బకాయిలు రూ.4,043.19 కోట్లు మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోతున్నాయి. రూ.4043.19 కోట్ల మేర విద్యార్థులకు ఫీజులు, ఉపకార వేతనాలు రూపంలో చెల్లించాల్సి ఉన్నట్టు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల్లో పైసా విడుదల కాకపోగా, అంతకుముందు ఏడాది 40శాతం మాత్రమే నిధులు విడుదలయ్యాయి. సాధారణంగా అయితే విద్యాసంవత్సరం ముగిసిన వెంటనే నిధులు విడుదల చేస్తారు. కానీ మూడేళ్లుగా పరిస్థితి తారుమారైంది. బీసీ విద్యార్థులవే అధికం ఫీజు బకాయిల్లో అత్యధికం బీసీ సంక్షేమశాఖకు చెందినవే ఉన్నాయి. ఈ మూడేళ్లకు సంబంధించి బీసీ విద్యార్థులకు రూ.2182.89 కోట్ల బకాయి లున్నాయి. ఈబీసీ కేటగిరీలో మూడేళ్ల బకాయిలు రూ.661.84 కోట్లు ఉన్నాయి. ♦ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు ప్రత్యేక అభివృద్ధి నిధి ద్వారా నిధుల సర్దుబాటు చేస్తున్నారు. ♦ మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోనూ బకాయిలు 461.05కోట్లు ఉన్నాయి. టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు... ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిధులు విడుదల చేసిన తర్వాత వాటిని కాలేజీ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయడంలోనూ తాత్సారం చేస్తోంది. గతేడాది డిసెంబర్లో దాదాపు రూ.4వందల కోట్లకు సంబంధించి టోకెన్లు జనరేట్ చేసిన అధికారులు ట్రెజరీల్లో క్లియరెన్స్ ఇవ్వకుండా ఆపారు. – గౌరి సతీశ్, కన్వినర్, కేజీ టు పీజీ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ దగ్గరున్న ఓఇంజనీరింగ్ కాలేజీలో జె.కార్తిక్ తాజాగా ఎంటెక్ పూర్తి చేశాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఇంటర్వ్యూ ద్వారా జాబ్కు ఎంపికయ్యాడు. ఒప్పందపత్రంపై సంతకంతోపాటు విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్టు సమర్పించాలని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజు చెల్లించాలంటూ రీయింబర్స్మెంట్కు మెలిక పెట్టింది. దీంతో అప్పు చేసి ఫీజు చెల్లించి కాలేజీకి నుంచి సర్టిఫికెట్లు తీసుకున్నాడు. -
రేపు ‘కేసీఆర్ విద్యాబంధు’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు మోసుకొచ్చింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్తో బీసీ గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువ స్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కరీంనగర్లో మీడియా తో మాట్లాడుతూ పథకానికి సంబంధించిన వివరాలు తెలిపారు. కేసీఆర్ విద్యాకానుక/ కేసీఆర్ విద్యాబంధు/ స్వదేశీ విద్యానిధి.. ఇలా దాదాపు 20 పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఈనెల 28న హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగం(ఎంహెచ్ఆర్డీ)లో పథకం పేరు, జీవో విడుదల, లోగోతోపాటు విధివిధానాలను ఆవిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్గౌడ్తోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్ హాజరవుతున్నారని చెప్పారు. గురుకులాలన్నీ ఒకే గొడుగు కిందకు..: కేవలం స్కూల్ వరకు విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ చార్జీలు చెల్లిస్తే.. సరిపోదని భావించిన కేసీఆర్.. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు కూడా అవే సౌకర్యాలు కల్పించాలని ఈ కార్య క్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి గంగుల తెలిపారు. ఈ నిర్ణయంతో 302 హాస్టళ్లలో చదువుకుంటున్న 33, 687 మంది విద్యార్థులకు లబ్ధి చేకూ రుతుందన్నారు. వీరికి డైట్, కాస్మె టిక్ చార్జీలతోపాటు నోట్బుక్స్, రికా ర్డ్స్, బెడ్షీట్లు తదితరాలు అందిస్తా మన్నారు. అదే విధంగా ఐఐటీ, ఐఐ ఎం, ఐఐఎస్సీ, ఐఐటీ, ఎయిమ్స్తో పాటు అన్ని ప్రముఖ వర్సిటీలు, జాతీయ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు కూడా చెల్లిసా ్తమని మంత్రి స్పష్టంచేశారు. అందు కే, గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే నూతన పథ కం ముఖ్యఉద్దేశమని శుక్రవారం విధివిధానాలు వివరిస్తామని తెలి పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవి శంకర్ పాల్గొన్నారు. -
జాతీయ విద్యా సంస్థల్లో చదివే బీసీలకూ ఫీజు రీయింబర్స్మెంట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చదివే బీసీలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్) పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలు వంటి 200కు పైగా ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన రాష్ట్ర బీసీ విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించనుంది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అమలు చేస్తున్న ఈ పథకాన్ని.. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే బీసీలకు కూడా వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఏటా సుమారు 10 వేల మందికి.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందజేస్తోందని.. రాష్ట్రంలో చదువుతున్న వారికి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నామని మంత్రి గంగుల గుర్తు చేశారు. ఇకపై దేశంలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీట్లు పొందిన బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఫీజు అందించనుందని తెలిపారు. మొత్తంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణేనని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఏటా రాష్ట్రానికి చెందిన దాదాపు 10వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని, ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా అదనంగా రూ.150 కోట్ల భారం పడుతుందని గంగుల వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతు బంధు, ఉచిత కరెంటు తదితర పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా అని పేర్కొన్నారు. బీసీలకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామాలు, పట్టణాల్లో కమ్యూనిటీ హాళ్లు, కుల వృత్తిదారుల ఆర్థిక స్వావలంబనకు రూ.లక్ష ఆర్థిక సాయం, ప్రపంచస్థాయి విద్యను అందించేలా 327 గురుకుల విద్యాలయాల ఏర్పాటు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఈ నిర్ణయం విప్లవాత్మకం: జూలూరు గౌరీశంకర్ ఎక్కడా లేని విధంగా దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకునేందుకు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హర్షం వ్యక్తం చేశారు. -
ముందుగానే ‘ఉపకార’ దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు అనుమతివ్వాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ముందస్తుగా దర ఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తే.. వేగంగా పరిశీలించి అర్హతలు నిర్ధారించవచ్చని, దీంతో నిధు లు సైతం త్వరగా అర్హుల ఖాతాల్లో జమ చేయవచ్చని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపింది. సాధారణంగా జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా 2023–24 సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల నుంచే ప్రారంభించేందుకు సాంకేతిక అనుమతులను కోరింది. ప్రస్తుతం ఈ ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. దీనిపై వారం రోజుల్లోగా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రభు త్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసు కుని దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ సన్నాహాలు చేస్తోంది. నాలుగు నెలలు గడువు.. 2023–24 విద్యా సంవత్సరంలో పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నాలుగు నెలల పాటు నిర్వహించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. గతేడాది మొదట మూడు నెలల పాటు అవకాశం కల్పించగా.. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల నుంచి వచ్చిన వినతుల మేరకు మరో రెండు నెలలు, చివరగా నెలరోజుల పాటు అవకాశం కల్పించింది. ఈ సారి విడతల వారీగా దరఖాస్తుల స్వీకరణకు బదులుగా ఒకేసారి నాలుగు నెలల పాటు అవకాశం కల్పించి తర్వాత నిలిపివేయాలని యోచిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన వెంటనే వాటి పరిశీలన, అర్హతల ఖరారు ప్రక్రియను కొనసాగించనుంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ముందుగా ఉపకారవేతనాలను విడుదల చేసే అంశాన్ని సంక్షేమ శాఖలు పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వెంటనే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుంటే వేగంగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారవర్గాలు సూచిస్తున్నాయి. -
నెల రోజుల్లో పరిశీలన.. ఆపై ఉపకారవేతనాలు
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మార్చి 31తో దరఖాస్తుల స్వీకరణ ముగియగా... మొత్తం 12,59,812 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో రెన్యువల్స్ 7,36,799 కాగా, ఫ్రెషర్స్ దరఖాస్తులు 5,23,013 ఉన్నాయి. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం గత సెపె్టంబర్లో ప్రకటన విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ... డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. కానీ వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికావడంలో తీవ్ర జాప్యం జరగడంతో జనవరి 31 వరకు గడువు పొడిగించారు. కానీ అప్పటివరకూ అడ్మిషన్లు కొనసాగుతుండటంతో చివరి అవకాశం కింద మార్చి 31 వరకు గడువు పొడిగించారు. ఇప్పుడు దరఖాస్తుల గడువు ముగియడంతో అధికారులు వాటి అర్హత నిర్ధారణపై దృష్టి సారించారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన వెంటనే సంక్షేమ శాఖలు అందుబాటులో ఉన్న నిధులను ముందుగా ఉపకారవేతనాలు విడుదల చేసి, ఆ తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు చేపట్టనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. నెలరోజుల్లో పరిశీలన పూర్తి... ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలనకు సంక్షేమ శాఖలు నెలరోజుల గడువును నిర్దేశించుకున్నాయి. ఏప్రిల్ ఆఖరు కల్లా వీటిని పరిశీలించి అర్హులను నిర్ధారించాలని నిర్ణయించాయి. ఈమేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ , వికలాంగుల సంక్షేమ శాఖల జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులు ముందుగా సంబంధిత కాలేజీ యాజమాన్యం యూజర్ ఐడీకి చేరతాయి. కళాశాల ప్రిన్సిపల్ దరఖాస్తులను పరిశీలించి వాటిని సంక్షేమాధికారికి ఫార్వర్డ్ చేస్తారు. అక్కడ ధ్రువపత్రాలను పరిశీలించి అర్హులను నిర్ధారిస్తారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం ఆమోదం తెలిపిన తర్వాత ప్రతి విద్యార్థి మీసేవా కేంద్రాల్లో వేలిముద్రలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ తంతు పూర్తయ్యాక సంక్షేమ శాఖలు సదరు దరఖాస్తును ఆమోదిస్తాయి. ఈ ప్రక్రియ కోసం సంక్షేమ శాఖలు నెలరోజులు గడువు నిర్దేశించుకున్నప్పటికీ మరింత ఎక్కువ సమయం పడుతుందని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. పరీక్షలు, ప్రిపరేషన్ నేపథ్యంలో విద్యార్థులు వేలిముద్రలు సమర్పించడంలో జాప్యం జరుగుతుందని, ఏటా ఇదే జాప్యం వల్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. -
తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ప్రైవేటు కాలేజీల నిర్వహణ కష్టంగా ఉందని ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీసతీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడి సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు స్థాపించిన కాలేజీలపట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. తమ కాలేజీల్లో 9.40 లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. 2021–22 సంవత్సరానికి రూ.86.55 కోట్లు ట్రెజరీకి విడుదలైనా ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంటు ఇవ్వలేదని, 2022–23 సంవత్సరానికి రూ.226 కోట్లు ఇంకా విడుదల చేయలేదన్నారు. దీనివల్ల అధ్యాపకులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక వసతులులేవని వేధించే ప్రభుత్వం, తమకు రావాల్సిన బకాయిలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. గడచిన ఎనిమిదేళ్లలో కాలేజీలపై వివిధ రకాల ఫీజులను 10 నుంచి 50 శాతం పెంచారని, ఫీజు రీయింబర్స్మెంట్ను మాత్రం ఆ నిష్పత్తిలో పెంచలేదన్నారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో సంఘం నేతలు ఇంద్రసేనరెడ్డి, ఉస్మాన్, ఎస్ఎన్ రెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫీజులు దులపండి
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం అమలవుతున్న ఉపకారవేతన, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం కనిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో క్రమంగా బకాయిలు పెరిగిపోతున్నాయి. 2020–21, 2021–22 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు నిధుల విడుదలకు ప్రభుత్వం తాత్సారం చేయడంతో బకాయిలు ఏకంగా రూ.2,117.66 కోట్లకు పేరుకుపోయాయి. తాజాగా 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం వరకు గడువుండగా, ఆ తర్వాత దరఖాస్తుల పరిశీలన మొదలుపెట్టి అర్హతను నిర్ధారిస్తారు. అనంతరం తాజా విద్యా సంవత్సర చెల్లింపులు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే రెండేళ్లుగా బకాయిలు పెండింగ్లో ఉండడంతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులు కూడా ఆలస్యం అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ‘బీసీ’ నిధులు భారీగా పెండింగ్.. గత విద్యా సంవత్సరం వరకు ఉన్న రూ.2117.6 కోట్ల బకాయిల్లో బీసీ సంక్షేమ శాఖకు చెందినవే ఎక్కువగా ఉన్నాయి. ఈ శాఖకు సంబంధించి రూ.1,376.36 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 2020–21కు సంబంధించి రూ.322.25 కోట్లు, 2021–22కు చెందిన రూ.1,054.11 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఉండడం, ఆ మేరకు అందుబాటులో ఉన్న నిధులను సర్దుబాటు చేస్తుండడంతో ఆయా శాఖలకు సంబంధించిన బకాయిలు తక్కువగా ఉన్నాయి. మరోవైపు ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన బకాయిలు కూడాపెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నట్లు ఆయా శాఖలు చెబుతున్నాయి. ఖజానా శాఖకు అనుమతులు లేక... ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కో సం వచ్చిన దరకాస్తులను పరిశీలించి వాటిని ఆమోదిస్తున్న సంక్షేమ అధికారులు.. జిల్లా స్థాయిలో వాటికి బిల్లులు రూపొందించి నిధుల విడుదల కోసం ఖజానా విభాగానికి పంపిస్తున్నారు. అలా పంపిన బిల్లులు సంక్షేమ శాఖల్లో పరిష్కరించినట్లు రికార్డు చూపిస్తున్నప్పటికీ.. ఖజానాల్లో నిలిచిపోతున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన బిల్లులను మాత్రమే ఖజానా అధికారులు క్లియర్ చేస్తున్నారు. ప్రతి నెల ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ నిధులు మాత్రమే సకాలంలో పరిష్కరిస్తుండగా... మిగతా ఎలాంటి బిల్లులకు ఆమోదం లభించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది పరిశీలనతోనే సరి! 2022–23కు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. చివరి తేదీ జనవ రి 31 నాటికి 12.5 లక్షల దరఖాస్తులు వస్తాయని సంక్షేమ శాఖల అధికారులు అంచనా వేస్తున్నారు. స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్ పరిశీలన పూర్తి చేసేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి చూస్తే 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిమాండ్ రూ.2,350 కోట్లు ఉండే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో కేవలం దరఖాస్తుల పరిశీలనతోనే సరిపెట్టి, పాత బకాయిలు క్లియర్ చేసేందుకు ప్రభుత్వ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది. ఖాజీపేటకు చెందిన రాఘవేంద్ర కుమార్ కూకట్పల్లి సమీపంలోని ఓ కాలేజీలో ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సెమిస్టర్ పరీక్ష ఫీజు సమయంలో మొదటి సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం మెలిక పెట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అర్హులు సైతం ట్యూషన్ ఫీజులు చెల్లించాలని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాక వారికి తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది. ట్యూషన్ ఫీజు రశీదు ఇచ్చిన విద్యార్థుల నుంచే సెమిస్టర్ పరీక్ష ఫీజు స్వీకరిస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో రాఘవేంద్రకుమార్ డబ్బులు వడ్డీకి తెచ్చి ట్యూషన్ ఫీజు, సెమిస్టర్ ఫీజు చెల్లించాడు. -
విద్య, వైద్య రంగాలను జాతీయం చేయాలి
కవాడిగూడ (హైదరాబాద్): బడుగు, బలహీనవర్గాల ప్రజల సంక్షేమంకోసం విద్య, వైద్య రంగాలను జాతీయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కేంద్రాన్ని కోరారు. రాష్ట్రాన్ని తొమ్మిది సంవత్సరాలుగా పరిపాలిస్తున్న సీఎం కేసీఆర్ 12 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. సచివాలయం, రాష్ట్రవ్యాప్తంగా ప్రగతి భవన్లు నిర్మించుకోవడానికి నిధులు ఉంటాయిగానీ, బీసీ విద్యార్థులకు నూతన వసతి భవనాలు నిర్మించడానికి నిధుల కొరత ఉందని చెప్పడం సిగ్గుచేటు అని విమర్శించారు. చదువుకోసం, సామాజిక న్యాయసాధన కోసం తలపెట్టిన బీసీ విద్యార్థుల పోరుయాత్ర ముగింపు సభ ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో జరిగింది. డిసెంబర్ 2న పాలమూరులో ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం హైదరాబాద్ చేరుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బీసీ విద్యార్థి, యువజనులు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణను జ్ఞాన తెలంగాణ చేయకుండా గొర్రెలు, బర్రెలను పంపిణీ చేస్తూ విద్యను వ్యాపారం చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బడులు మూసి, బార్లు తెరుస్తున్న కేసీఆర్ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు బకాయిపడ్డ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2023లో ఓటు మనదే.. సీఎం సీటు మనదే.. అని నినాదమిచ్చారు. ర్యాంకు నిబంధనలు ఎత్తివేసి బీసీ విద్యార్థుల మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలను రద్దుచేసి ప్రభుత్వ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లు పెంచాలన్నారు. తెలంగాణలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకోసం రాజకీయ విధానాన్ని ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ తదితరులు పాల్గొన్నారు. -
AP: ప్రభుత్వ పథకాలతో ఉన్నత చదువులకు విద్యార్థుల మొగ్గు
సాక్షి, అమరావతి: ఉన్నత చదువులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణుల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 93.38 శాతం మంది ఉన్నత విద్యా కోర్సుల్లో చేరడం గమనార్హం. ఇది దేశంలోనే కొత్త రికార్డు సృష్టించింది. జాతీయ సగటుకు మించి ఏపీలో గరిష్ట చేరికల నిష్పత్తి నమోదవుతోంది. ఏ రాష్ట్రంతో పోల్చినా ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో మూడున్నరేళ్లలో గణనీయమైన పురోగతి సాధించింది. టీడీపీ హయాంలో 2018–19లో 20.37 శాతం మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరలేక డ్రాపౌట్లుగా మిగలగా ప్రస్తుతం 6.62 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. గత సర్కారు అరకొర ఫీజులనూ ఇవ్వకుండా రూ.1,800 కోట్లకు పైగా బకాయిలు పెట్టి దిగిపోగా వాటిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించి విద్యార్థుల చదువులకు అండగా నిలిచింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ ఒక్క విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న ఆశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో పాటు అకడమిక్ అంశాలు, నైపుణ్యాభివృద్ధి కోసం చేపట్టిన సంస్కరణల వల్లే ఉత్తమ ఫలితాలు వస్తున్నాయనేది కాదనలేని నిజం. విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తూ సదుపాయాలు మెరుగు పరుస్తుండడం, వివిధ పథకాలతో అడుగడుగునా అండగా నిలుస్తుండటంతో చదువుల నాణ్యతలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రానికే ప్రాధాన్యం బయట రాష్టాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గతంలో కన్నా తగ్గి రాష్ట్ర కాలేజీల్లో చేరికలు పెరిగాయి. 2022 – 23లో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరిన వారు 35.50 శాతం ఉండగా డిగ్రీ కోర్సుల్లో 43.79 శాతం మంది చేరారు. 11.13 శాతం మంది అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యలో చేరిన వారు 2.96 శాతం మంది ఉన్నారు. మరో 6.62 శాతం మంది మాత్రమే డ్రాపౌట్లుగా మిగిలారు. 2018–19లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారిలో 20.37 శాతం మంది డ్రాపౌట్లుగా మిగిలిపోగా ఈసారి అది 6.62 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. 2018 – 19లో టీడీపీ అధికారంలో ఉండగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కాకుండా కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లించినందున మిగతా ఫీజుల భారాన్ని భరించలేక ఇంజనీరింగ్ కోర్సుల్లో 21.77 శాతం మంది మాత్రమే చేరారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తుండడంతో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరికల శాతం అమాంతం 35.50 శాతానికి పెరగడం గమనార్హం. నాడు.. ప్రైవేట్కే విద్య టీడీపీ హయాంలో ఉన్నత విద్య మొత్తం ప్రైవేట్పరం కావడం విద్యార్థులకు శాపంగా పరిణమించింది. ఇంటర్ చదువులకే రూ.లక్షలు ధారపోయాల్సిన దుస్థితి నెలకొంది. తూతూ మంత్రంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలైంది. కాలేజీల్లో ఫీజు ఎంతున్నా ఇంజనీరింగ్కు రూ.35 వేలు, ఇతర డిగ్రీ కోర్సులకు రూ.7 వేల నుంచి రూ. 10 వేల లోపు మాత్రమే విదిలించి గత సర్కారు చేతులు దులుపుకొంది. అది కూడా అరకొరగానే ఇవ్వడంతో మిగతా ఫీజుల మొత్తాన్ని తలిదండ్రులే భరించాల్సి వచ్చేది. ఫలితంగా పిల్లల చదువులు పూర్తయ్యేసరికి అప్పుల్లో మునిగిపోయేవారు. ఇలాంటి పరిస్థితి కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఇంటర్తోనే చదువు ముగించి చిన్నా చితకా ఉద్యోగాలు, కూలి పనుల అన్వేషణలో నిమగ్నమైన పరిస్థితి ఏర్పడింది. నేడు.. సమూల మార్పులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యా రంగం పరిస్థితి సమూలంగా మారిపోయింది. పేద విద్యార్థుల చదువులకయ్యే ఫీజు మొత్తాన్ని జగనన్న విద్యా దీవెన ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తోంది. చదువులు సాఫీగా సాగేలా వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేల వరకు చెల్లిస్తున్నారు. వీటిని నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్నత చదువులపై భరోసా ఏర్పడింది. ఫలితంగా డ్రాపౌట్లు గణనీయంగా తగ్గాయి. కరోనా ఉన్న రెండేళ్లలోనూ చేరికలు పెరగడం విశేషం. లక్ష ప్లేస్మెంట్స్ లక్ష్యం ► టీడీపీ హయాంలో 2015–16లో ఉన్నత విద్యా కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య 11,25,510 కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2021–22 నాటికి 14,23,952కి చేరుకుంది. చదువుల కోసం నయాపైసా భారం పడకుండా ప్రభుత్వమే మొత్తం ఫీజులను చెల్లిస్తుండటంతో ప్రవేశాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ► అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాల ప్రకారం 2014–15లో రాష్ట్రంలో ప్లేస్మెంట్లు 56 వేలు కాగా 2021–22లో 78 వేలకు చేరాయి. ప్లేస్మెంట్స్ను లక్షకు పైగా తీసుకెళ్లటాన్ని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ► జీఈఆర్ (ప్రతి వంద మందిలో కాలేజీల్లో చేరేవారి సంఖ్య)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్రాల వారీగా ఆలిండియా ఉన్నత విద్యా సర్వే (ఐష్) పేరిట నివేదికలను వెలువరిస్తుంది. ఐష్ సర్వే ప్రకారం ఏపీలో జీఈఆర్ 2015–16లో 30.8 ఉండగా 2019–20లో 35.2కు పెరిగింది. జాతీయ స్థాయిలో 24.5 నుంచి 27.1కు పెరిగింది. జీఈఆర్ పెరుగుదల జాతీయ స్థాయిలో 3.04 శాతంగా ఉండగా ఏపీలో 8.64 శాతంగా ఉండడం విశేషం. కేరళ 4.86 శాతం, తమిళనాడు 4.89 శాతం, తెలంగాణ –1.65 శాతంగా ఉన్నాయి. -
‘ఫీజు’కు తప్పని నిరీక్షణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు మరింత నిరీక్షణ తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అటు సంక్షేమ శాఖల వద్ద భారీగా బిల్లులు పేరుకుపోగా.. ఇటు సంక్షేమశాఖలు ఈపాస్ ద్వారా ఆన్లైన్లో క్లియర్ చేసిన బిల్లులకూ ట్రెజరీల్లో చెల్లింపులు జరగని పరిస్థితి నెలకొంది. దీనితో కాలేజీల యాజమాన్యాల నుంచి ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమ శాఖల గణాంకాల ప్రకారం.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి రూ.1,867.66 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.460.96 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. 2021–22కు సంబంధించి 1,406.70 కోట్లు చెల్లించాలి. ఇక 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులు ఇప్పటికీ మొదలుకాలేదు. ట్రెజరీలో ఆగిన రూ.560 కోట్లు పోస్ట్మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలతోపాటు అర్హత ఉన్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను ముందుగా కాలేజీ యాజమాన్యాలు పరిశీలించి ఆమోదం కోసం సంక్షేమశాఖ అధికారులకు పంపుతాయి. సంక్షేమశాఖల అధికారులు వాటిని పరిశీలించాక ఆమోదించి నిధుల విడుదల కోసం ట్రెజరీకి బిల్లులు పంపుతారు. ట్రెజరీ అధికారులు వాటిని పరిష్కరించి నిధులు విడుదల చేస్తారు. ఈ క్రమంలో 2020–21, 2021–22 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు సుమారు రూ.560.16 కోట్లకు సంబంధించిన బిల్లులను ట్రెజరీకి పంపగా.. అధికారులు ఆమోదించి టోకెన్లు జనరేట్ చేశారు. కానీ ఆర్థికశాఖ విధించిన ఆంక్షలతో నిధుల విడుదల చివరిదశలో నిలిచిపోయింది. ఆంక్షలు సడలించాకే నిధులు విడుదలవుతాయి. చెల్లింపుల్లో పెరుగుతున్న జాప్యం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం చెల్లింపులు ఒక ఏడాది ఆలస్యంగా జరుగుతున్నాయి. సాధారణంగా ఏదైనా విద్యా సంవత్సరం ముగియగానే.. ఆ ఏడాదికి సంబంధించిన నిధుల చెల్లింపుల ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. కానీ కోవిడ్ మహమ్మారి తర్వాత కాలంలో చెల్లింపుల్లో జాప్యం పెరిగింది. ప్రస్తుతం 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలు దాదాపు 20 శాతం చెల్లించాల్సి ఉంది. 2021–22కు సంబంధించి 50 శాతం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా చెల్లింపులు మొదలుకాలేదు. -
550 కోట్ల కేంద్ర నిధులు హుళక్కే!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న దళిత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ సాయం బంద్ అయ్యింది. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ విధించిన షరతులతో రెండేళ్లుగా ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాలేదు. షరతులకు లోబడి పథకాన్ని అమలు చేస్తేనే నిధులిస్తామని కేంద్రం పేర్కొనగా వాటిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంది. దీంతో రెండేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదల కావాల్సిన రూ. 550 కోట్లు వచ్చే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక కోటాలో నిధులు విడుదల చేసింది. వాటిని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు విద్యార్థుల ఖాతాల్లో జమ చేశారు. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ అభివృద్ధి శాఖ వద్ద ఉన్న నిధులను సర్దుబాటు చేస్తూ సీనియర్ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించింది. ఈ రెండేళ్లకు సంబంధించి కేంద్ర వాటా విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకిలా... షరతులేంటి?: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇవ్వగా కేంద్రం 40 శాతం నిధులిచ్చింది. 2021–22 వార్షిక సంవత్సరం నుంచి కేంద్రం ఎస్సీ విద్యార్థులకు మరింత ఎక్కువ బడ్జెట్ను కేటాయిస్తూ 60 శాతం కేంద్రం భరిస్తూ 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలా మార్పులు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొంతమేర భారం తగ్గనుందని అధికారులు సైతం భావించారు. కానీ తాము నిర్దేశించినట్లుగానే పథకాన్ని అమలు చేయాలంటూ కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి విద్యార్థి వివరాలను తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు కాకుండా లబ్ధిదారుల ఖాతాలకే నేరుగా పంపుతామని తెలిపింది. అయితే ఈ నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ను కాలేజీల యాజమాన్యాలకు చెల్లిస్తున్నందున కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థుల వివరాలను సమర్పిస్తే పథకం అమలు స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం భావించి మిన్నకుండిపోయింది. ఫలితంగా రెండేళ్లుగా కేంద్రం తన వాటా నిధుల విడుదలను నిలిపేసింది. -
‘ఉపకార’ సంస్కరణలు ఇప్పట్లో లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల విషయంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని భావించిన సంక్షేమ శాఖలకు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దరఖాస్తుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలను సమర్పించాయి. ప్రధానంగా సాంకేతిక సమస్యలను అధిగమించడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ, పరిశీలన, ఆమోదం విషయంలో సవరణలకు సంబంధించిన ప్రతి పాదనలను సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి దాదాపు ఆర్నెళ్లు కావస్తున్నా..వాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ప్రస్తుతం అవలంభిస్తున్న పద్ధతులతోనే పథకాలను అమలు చేయాలని భావించి పాత విధానాల ఆధారంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేశాయి. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి విద్యార్థుల నుంచి ఈ పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేలా గడువును నిర్దేశించాయి. సులభతరం కోసం సంస్కరణలు.. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం ఏటా సగటున 12.5 లక్షల మంది విద్యార్థుల నుంచి సంక్షేమ శాఖలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. ఇవన్నీ ఆన్లైన్ పద్ధతిలోనే స్వీకరిస్తున్నప్పటికీ.. పరిశీలన ప్రక్రియలో పలు అంచెలన్నీ మాన్యువల్ పద్ధతిలోనే సాగుతున్నాయి. దీంతో పథకాల అమలులో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సులభతర విధానం కోసం దరఖాస్తుల ప్రక్రియలో మార్పులు చేయాలని సంక్షేమ శాఖలు పలు దఫాలుగా చర్చించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఏదైనా కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థి ఒకసారి ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు సమర్పిస్తే కోర్సు ముగిసే వరకు ఆ దరఖాస్తును సాంకేతికంగా అప్డేట్ చేయాలని, ఈ బాధ్యతలను కాలేజీ యాజమాన్యాలకు ఇస్తే విద్యార్థి పదేపదే దరఖాస్తు చేసే పని ఉండదని, సంక్షేమ శాఖ అధికారులు మొదటి ప్రతిపాదన చేశారు. విద్యార్థుల నుంచి ప్రతిసారి ఆదాయ ధ్రువీకరణ పత్రాల సమర్పణ, అఫిడవిట్లు తీసుకునే విధానాన్ని రద్దు చేయాలని, ఇక ప్రతి విద్యార్థి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత మాన్యువల్ పద్ధతిలో పత్రాలను సమర్పించడం కాకుండా ఆన్లైన్ విధానాన్నే పాటించడం, బయోమెట్రిక్ అప్డేషన్ ప్రక్రియంతా కాలేజీలో నిర్వహించడంలాంటి పద్ధతులతో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలు మరింత సులభతరమవుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ శాఖలు ప్రతిపాదనలు సమర్పించాయి. ఇదంతా జరిగి ఆర్నెళ్లు కావస్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ఈ విద్యాసంవత్సరంలో పాత విధానాన్నే అనుసరించాలని, ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే ఏడాది నుంచి కొత్త పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణను వేగవంతం చేస్తూ కాలేజీ యాజమాన్యాలకు జిల్లా సంక్షేమ శాఖల నుంచి ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు మౌఖిక ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఆదేశాలు పంపించారు. -
జగనన్న విదేశీ విద్యా దీవెనకు 392 దరఖాస్తులు
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు పెద్ద చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన కోసం 392 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఈ పథకంలో దరఖాస్తులకు సెప్టెంబర్ 30 వరకు ఇచ్చిన గడువు శుక్రవారం ముగిసింది. ప్రభుత్వ ఆర్థికసాయంతో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన ఈ పథకం రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలు (ఈబీసీ), బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వర్తిస్తుంది. వచ్చిన దరఖాస్తులు, వాటికి జతచేసిన ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించిన తరువాత ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. జగనన్న విదేశీ విద్యాదీవెనను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటుగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారందరికీ వర్తింపజేయడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్ ర్యాంకులు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఇది మేలు చేస్తుంది. ఒకటి నుంచి వంద క్యూఎస్ ర్యాంకింగ్ కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న వారికి ఫీజు రూ.కోటి అయినా నూరుశాతం ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుంది. 101 నుంచి 200 క్యూఎస్ ర్యాంకులున్న యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే రూ.50 లక్షల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుంది. ఈ పథకానికి వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షల వరకు పెంచడం విశేషం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత ఉన్న ఎంతమందికైనా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు కె.హర్షవర్ధన్ తెలిపారు. (క్లిక్ చేయండి: ట్రిపుల్ ఐటీ సీట్లలో అగ్రభాగంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement