-
జర్మనీలో ఘనంగా ఉగాది వేడుకలు
ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ : నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ వేడుకలు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఘనంగా నిర్వహించారు. జర్మనీ తెలుగు వెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సోస్సెన్ హైం ఆడిటోరియంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ ఎంబసీ కాన్సులేట్ జనరల్ ప్రతిభ పార్కర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఫ్రాంక్ఫర్ట్ నగర పురపాలక ప్రతినిధి మోబిస్ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగువెలుగు సంస్థ కమిటీని, వారు చేసే వివిధ సాంస్కృతిక సేవలను కొనియాడారు. గాయకులు ధనుంజయ్, సాయి శిల్పలు వారి ప్రదర్శనలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. భూషణ సాయి హేమంత్ కృష్ణ తన నాసికా వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. నదియా నృత్య ప్రదర్శన తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇండియన్ మ్యూజిక్ అకాడమీ, ఇండియన్ డాన్స్ అకాడమీ, ఉజ్వల డాన్స్ గ్రూప్, ఫ్రాంక్ఫర్ట్ గర్ల్స్ ఎంతో ఉత్సాహంగా వారి కళలను ప్రదర్శించారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులకు రుచి రెస్టారెంట్ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసింది. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన రుచి రెస్టారెంట్, ఎయిర్ ఇండియా, హెక్స్డ్ సాఫ్ట్వేర్, జవాజి సాఫ్ట్వేర్, జస్ట్ 1 బజార్, స్పూన్స్ అండ్ ఫోక్స్, వాట్సమన్ కన్సల్టింగ్, పిజె ఈవెంట్స్ వారికి సంస్థ అధ్యక్షుల సాయి రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
గ్రామాలకు దూరంగా ఆర్టీసీ
గ్రామీణులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఆర్టీసీ తెలు గు వెలుగు పేరుతో బస్సులు నడుపుతోంది. పదేళ్ల క్రితం వరకు ఇవి బాగా నడిచేవి. పాలకుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం..ప్రయివేటు వాహనాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవ డం, వాటిపై నియంత్రణ లేకపోవడంతో ఆర్టీసీ బస్సులకు నష్టాలు రావడం మొదలుపెట్టాయి. ప్రయివేటు వాహనాలను అడ్డుకోవాల్సిన అధికారులు దాన్ని పక్కనబెట్టి నష్టాల పేరుతో ఆర్టీసీ బస్సులను నిలిపేయడం ప్రారంభించారు. ఈ కారణంగా సంస్థకు నష్టాలు తగ్గకపోగా ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. మదనపల్లె అర్బన్: ఆధ్యాత్మికంగా పేరుగాంచిన మన జిల్లాలో యాత్రికుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ, నగర ప్రాంతాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రయాణికులూ రోజూ వేలల్లో ఉంటారు. వీరికి తెలుగు వెలుగు బస్సులు ఎంతో సౌకర్యంగా ఉన్నాయి. నష్టాల పేరుతో వాటిని ప్రతియేటా తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలోని 14 డిపోల పరిధిలో ఆరేళ్ల క్రితం 714 పల్లె వెలుగు బస్సులు ఉండేవి. ప్రస్తుతం వాటిని 598కి తగ్గించేశారు. అత్యధికంగా పీలేరు డిపోలో గత ఏడాది 76 సర్వీసులుండగా ఈ ఏడాది మూడు బస్సులు పెంచారు. మిగిలిన అన్ని డిపోల్లో తగ్గించారు. తెలుగు వెలుగు బస్సులకు కి.మీకు రూ.27 ఖర్చు అవుతుండగా చాలా ప్రాంతాల్లో రూ.పది నుంచి 15 మధ్య వస్తోందని అధికారులు చెబుతున్నారు. గ్రామాలకు ఆర్టీసీ సర్వీసు నడపటం ద్వారా కిమీకు రూ.15 నష్టపోవాల్సి వస్తోందని అంటున్నారు. ఆర్టీసీ అధికారుల వాదన ఇలా ఉండగా ప్రయివేటు వాహనాల వల్ల రోజుకు రూ.43.61 లక్షలు, నెలకు దాదాపు రూ.13 కోట్లు నష్టం వస్తోందని అంచనా. గ్రామాలకు సర్వీసులు తక్కువగా ఉండటం వల్లే ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని గ్రామీణులు చెబుతున్నారు. రద్దీకి తగ్గట్లు బస్సులు నడిపితే ప్రయివేటు వాహనాల హవా తగ్గించవచ్చునని అంటున్నారు. భారీగా తగ్గిన బస్సులు.. మదనపల్లె ఒకటో డిపో నుంచి రెండు నెలల కాలంలో 12 తెలుగు వెలుగు సర్వీసులను నిలిపేశారు. మదనపల్లె నుంచి బురకాయలకోట మీదుగా బి.కొత్తకోటకు 30 ఏళ్లుగా నడుపుతున్న గోళ్లపల్లి సర్వీసులో ఒక ట్రిప్పును నిలిపేశారు. సదుం–చింతామణి సర్వీసును ఏడాది కిందట రద్దు చేశారు. ప్రస్తుతం మదనపల్లె ఒకటో డిపోలో 79, రెండో డిపోలో 68, పీలేరులో 79, పలమనేరులో 54, చిత్తూరు ఒకటో డిపోలో 32, రెండో డిపోలో 43, కుప్పంలో 57, పుత్తూరులో 54, సత్యవేడులో 35, శ్రీకాళహస్తిలో 43, తిరుపతిలో 43, మంగళంలో 11 తెలుగు వెలుగు బస్సులు నడుస్తున్నాయి. సిటీ బస్సుల నష్టాలకూ ఇదే కారణం.. తిరుపతిలో సిటీ బస్సులు కూడా నష్టాలే మిగులుస్తున్నాయి. సర్వీసుల మధ్య కాలవ్యవధి ఎక్కువగా ఉండటం, ప్రైవేటు వాహనాలు తిరుగుతుండటమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఆర్టీసీ అధికారులు ఉన్నతాధికారులకు నెలనెలా నివేదికలు అందిస్తున్నా అవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రయివేటు వాహనాలను అడ్డుకోవడమేగాక, సర్వీసులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైఎస్సార్ జిల్లాలో విజయవంతం.. ఆర్టీసీ పరిరక్షణ పేరుతో వైఎస్సార్ జిల్లాలో అవలంబిస్తున్న విధానం లాభాలు తెచ్చిపెడుతోంది. డిపోల వారీగా నష్టాలు వస్తున్న రూట్లను గుర్తిస్తున్నారు. ప్రైవేటు వాహనాలు అధికంగా తిరుగుతున్న రూట్లను గుర్తించి ఒక డిపో మేనేజరు, ఇద్దరు ట్రాఫిక్ పర్యవేక్షకులు, సెక్యూరిటీ గార్డు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేపడుతున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని ప్రైవేటు వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోనివ్వడం లేదు. ఆ రూట్లలో రద్దీకి అనుగుణంగా బస్సులను తిప్పుతుండటంతో లాభాలు తెచ్చి పెడుతున్నాయి. మన జిల్లాలో రోజుకు ఒక బృందం మాత్రమే తిరుగుతుండటంతో కార్యక్రమం ఫలప్రదం కావట్లేదు. ఈ బృందం తిరుగుతున్న రూట్లలో రోజుకు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం పెరుగుతోంది. -
పల్లెల్లో తెలుగు వెలుగులేవీ?
126 గ్రామాలకు తెలుగు వెలుగులు దూరం శ్లాక్ సీజన్ పేరుతో 21 సర్వీసుల రద్దు – ప్రయాణికుల ఇక్కట్లు ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి సురక్షితంగా గమ్యం చేరండి.. ప్రైవేటు వాహనాలు ఆశ్రయించకండి.. ప్రమాదాల బారిన పడకండి’ అని అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. రూట్లో ఆదాయం వస్తేనే బస్సును తిప్పండి లేదంటే నిలిపివేయండంటూ ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో కొన్ని పల్లెల్లో తెలుగు వెలుగు బస్సులు కనిపించడం లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. నెల్లూరు(టౌన్): జిల్లాలో 126 గ్రామాలకు నేటికి ఆర్టీసీ బస్సులు నడవడం లేదంటే కొంత ఆశ్చర్యంగా ఉన్నా నమ్మక తప్పదు. తాజాగా శ్లాక్ సీజన్ పేరుతో నష్టాలు వస్తున్నాయంటూ ప్రధాన రహదారుల్లో తిరుగుతున్న 21 సర్వీసులను నిలిపివేశారు. వీటిపై ఆర్టీసీ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. నాలుగు రోజుల క్రితం నుంచి 21 సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో సర్వీసులు నిలిపివేయడంపై ఆర్టీసీ సంఘాలు మండిపడుతున్నాయి. నెల్లూరు డిపో–1 నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడకు తిరుగుతున్న మూడు బస్సులను నిలిపివేశారు. డిపో–2 నుంచి చెన్నై నుంచి విజయవాడ తిరుగుతున్న బస్సును రద్దు చేశారు. అదేవిధంగా రాపూరు డిపో నుంచి –1, ఆత్మకూరు డిపో నుంచి–3 కావలి నుంచి–4, ఉదయగిరి నుంచి –4, వాకాడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి డిపోల నుంచి ఒక్కో బస్సును రద్దు చేశారు. బెంగళూరు, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, తిరుపతికి తిరుగుతున్న బస్సులను రద్దు చేశారు. సర్వీసుల రద్దు చేయడానికి ప్రైవేటు వాహనాల యజమానుల నుంచి అందుతున్న ముడుపులే కారణమని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బస్సులు తిరగని గ్రామాలు... నష్టాలు వస్తున్నాయని, రోడ్డు బాగాలేదని చెబుతూ ఇప్పటికి జిల్లాలో 126 గ్రామాల్లో ఆర్టీసీ బస్సులను తిప్పడం లేదు. అనంతసాగరం రూట్లో చీపురపల్లి, చాకురాళ్లపల్లి, కావలి మండలంలో కోనేటిపాలెం, గానుగపెంట, దగదర్తి రూట్లో మట్టెంపాడు, సంగం రూట్లో నీలాయపాలెం, తిమ్మాపురం, చింతూరు, ఆనపల్లిపాడు, వెంగమాంబపురం, దేవరవేమూరు, అత్తలసిద్దవరం, కోనేశ్వరపాడు, ఎల్లవగ్గపలి, తిమ్మినగుంట, లింగంపాలెం, బొట్ల, కొత్తనల్లపాడు, పెనుబర్తిగోపవరం, శుద్ధమల్లి, కోటూరుపాడు, చందనమూడి, మనిమాలముడి, సూరపుఅగ్రహారం, బురదమడుగు, యల్లాయపాలెం, వేటగిరిపాలెం గ్రామాలకు బస్సులు తిరగడం లేదు. సూళ్లూరుపేట మండలంలో చెరువుమిట్ట, కొమ్మినేనిపల్లి, పంట్రంగం, సర్వారెడ్డికొండ, ఎర్రబల్లి, వాకాడు మండలంలో పాటెటిపాలెం, జువ్వినట్టు, రెడ్డిపాలెం, పంబలి, పుదిరాయదరువు, ఉదయగిరి నుంచి కిష్టంపల్లి మీదుగా అర్లపడిగ, బిజ్జంపల్లి, అప్పసముద్రం, గూడూరు నుంచి చెర్లోపల్లి, కుడితపల్లి, కాగితాలపూర్, లక్ష్మీనరసాపురం, కొడవలూరు మండలం యల్లాయపాలెం, రామన్నపాలెం, మానేగుంటపాడు, రెడ్డిపాలెం, ఆలూరు తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ ప్రాంత ప్రజలు ప్రైవేట వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కావాలనే సర్వీసులను రద్దు చేశారు : – రమణరాజు, ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికారులు కావాలనే సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతం శ్రావణమాసం సందర్భంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు అధికంగా ఉన్నాయి. వీటితో పాటు పుష్కరాలు కూడా జరగనున్నాయి. శ్లాక్ సీజన్ పేరుతో బస్సులను రద్దు చేయడం తగదు. వెంటనే వాటిని పునరుద్ధరించాలి. ఆదరణ ఉంటే తప్పకుండా తిప్పుతాం : రవివర్మ, ఆర్టీసీ ఆర్ఎం రూట్లల్లో ఆదరణ, ఆదాయం వస్తే తప్పకుండా బస్సులను తిప్పుతాం. నష్టాలు వస్తే బస్సులను తిప్పలేం. శ్లాక్ సీజన్ కారణంగా ప్రయాణికులు తక్కువగా ఉండటంతోనే ఆ సర్వీసులను నిలిపివేశాం. రద్దీ రోజుల్లో అదనంగా 48 సర్వీసులను తిప్పాం. -
తెలుగు వెలుగు సూర్యుడు అన్నమయ్య
విజయవాడ కల్చరల్ : తెలుగు వెలుగు సూర్యుడు అన్నమయ్య అని పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. దిలీప్కుమార్ కల్చరల్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో శివరామకృష్ణ క్షేత్రంలో ఆదివారం సాయంత్రం అన్నమయ్య సంకీర్తన కచేరీ జరిగింది. ముఖ్య అతిథి తులసిరెడ్డి మాట్లాడుతూ పద కవితకు అన్నమయ్య ఆద్యుడని, ఆయన సాహిత్యం నిండా సామాజిక స్పృహ నిండి ఉంటుందని చెప్పారు. జ్యోతిష్య శాస్త్రవేత్త అచ్చిరెడ్డి గురుంచి మాట్లాడుతూ 179 పుస్తకాలకు పైగా జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన పవర్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ గ్రంథాన్ని రచించారని, జ్యోతిష్య అంశాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. యువ జ్యోతిష్య శాస్త్రవేత్త వంశీకృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ కిషోర్ తదితరులు మాట్లాడారు. భక్తి సంగీత విభావరి కార్యక్రమంలో భాగంగా గాయకుడు దిలీప్కుమార్ స్వరపరిచిన సంకీర్తనలను గాయనీమణులు టీవీఎస్ శ్రీదేవి, జ్యోతి, కొమ్మినేని రత్నకుమారి ఆలపించారు. -
వేడుకగా ఉగాది పురస్కారాలు
32 మందికి కళారత్న, 67 మందికి ఉగాది పురస్కారాలు బాలాంత్రపు రజనీ కాంతారావుకు ‘తెలుగు వెలుగు’ పురస్కారం సాక్షి, విజయవాడ బ్యూరో: మన్మథ నామ సంవత్సర ఉగాది వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వం వివిధ రంగాల్లో నిష్ణాతులైన 100 మంది ప్రముఖులకు శనివారం ‘2015 కళారత్న (హంస), ఉగాది పురస్కారాలను అందజేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో శనివారం జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావులు వీటిని అందజేశారు. ప్రముఖ వాగ్గేయకారుడు డాక్టర్ బాలాంత్రపు రజనీ కాంతారావుకు తెలుగు వెలుగు విశిష్ట పురస్కారాన్ని అందించి సత్కరించారు. అదేవిధంగా 32 మందికి హంస, మరో 67 మంది ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందజేశారు. హంస పురస్కార గ్రహీతలకు రూ. 50 వేలు, ఉగాది పురస్కార గ్రహీతలకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతిని అందజేశారు. -
ఇక.. రోడ్ల మీదకి పచ్చ వెలుగులు!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏపీలో అమల్లో ఉన్న ఒక్కో పథకానికీ పేరు మార్చుకుంటూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా పల్లె వెలుగు బస్సులకు కూడా పేరు మార్చాలని నిర్ణయించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సంస్కరణల పేరుతో పల్లె వెలుగు బస్సులను పచ్చ వెలుగు బస్సులుగా మార్చడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. పల్లె వెలుగు బస్సులకు పసుపు రంగు వేయాలని నిర్ణయించారు. దీనికిగాను ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. అదేవిధంగా బస్సులపై మాజీ సీఎం ఎన్టీఆర్ ఫొటోను ముద్రించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ‘తెలుగు వెలుగు’ అని కొత్త పేరు పెట్టనున్నారు. -
వివరం: మన తెలుగు మన వెలుగు
తెలుగు గురించిన ఈ రెండు గొప్పదనాలు, ఉత్తి స్వాతిశయపు విశేషణాలేం కాదు. తెలుగు, రాయడానికి అందమైన భాష; వినడానికి సొంపైన భాష. దీన్ని ప్రకటించుకుంది కూడా మనం కాదు; ఆ గుర్తింపునిచ్చింది అన్యభాషీయులే! ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని మురిశాడు ఇటలీ యాత్రికుడు నికొలొకాంటి. ‘సుందర తెలుగు’ అని చాటాడు తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి. అన్నీ ఉన్నా ‘తెలుగువాడి నోట్లో’ శని అన్నట్టు, మొదట్నుంచీ మన మీద సంస్కృత అత్తగారి పెత్తనాన్ని కొనసాగనిచ్చాం; ఇప్పుడేమో ఇంగ్లీషు మామగారి ఆధిపత్యానికి నాలుకలు మడతపెడుతున్నాం. ఆగస్టు 29న ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా మన తెలుగేమిటో, మన వెలుగేమిటో ఒకసారి మాట్లాడుకుందాం... మనమేమో ‘వానల్లు కురియాలి వానదేవుడా!’ అనే చిన్నప్పటి పాట నెమరువేస్తుంటాం. పిల్లలేమో బడిలో ‘రెయిన్ రెయిన్ గో ఎవే’ అంటూ చక్కని రైమింగ్లో వానని వెళ్లగొడుతుంటారు. పేదరాసి పెద్దమ్మ కతల తరం మనదైతే, హ్యారీపోటర్ తరం మన పిల్లలది. కాలం మారిపోయింది. దానితో పాటు తెలుగు భాషకీ కాని కాలం వచ్చింది. కాని కాలం రాకపోతే టీవీ ప్రదర్శనల్లో యాంకరమ్మ ‘హాయ్ వ్యూయర్స్!’ అని తెలుగువాళ్లని ఇంగ్లిష్లో పలకరించే సాహసం చేస్తుందా? ‘యస్టర్ డే మార్నింగ్ మార్కెట్కి వెళితే టూ హండ్రెడ్ రూపీస్కి టూ కిలోస్ వెజిటబుల్స్ రాలేదండీ’ అని పక్కింటి పడుచు, ఎదురింటి యిల్లాలితో మాట్లాడుతుంటే, పోనీలే క్రియాపదాలైనా తెలుగులో ఉన్నాయని, తెలుగు భాషాభిమానులం సంతృప్తి పడుతున్నామా లేదా? అక్షరాలు ముత్యాల కోవలు ‘అరయంగ కర్ణుడీల్గె నార్వుర చేతన్’ అన్నట్టు తలా ఒక చెయ్యి నెత్తిమీద వెయ్యగా తెలుగుతల్లి మునిగిపోతుందన్నది వాస్తవం. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీనాథుడో, శ్రీకృష్ణ దేవరాయలో చెప్పిన పద్యపాదాన్ని పైపైన ప్రస్తావించటం గాక లోతుగా చూస్తే తెలుగు భాష విలువ ఏమిటో బాగా అర్థమవుతుంది. ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నాడు ‘అమృతం కురిసిన రాత్రి’లో దేవరకొండ బాలగంగాధర తిలక్. ‘నా అక్షరాలు ముత్యాల కోవలు’ అని కూడా అంటే మరింత బాగుండేదనిపిస్తుంది. ఆ అందం, చందం ఒక్క తెలుగు వర్ణమాలకే ఉంది. ఆంగ్లం, రష్యన్, చైనీస్, దేవనాగరి, హిందీ, అరవం మొదలైన లిపులన్నీ రేఖాత్మకాలు. ప్రధానంగా కొన్ని (సరళ) రేఖలు కలుపుకుంటూ ఆ అక్షరాలు రాస్తారు. కానీ తెలుగు లిపిది వర్తులాకృతి. ‘అ’ మొదలు ‘క్ష’ దాకా ఏ అక్షరమైనా వృత్తంలో ఇముడుతుంది. త్రికోణాలు, చతుష్కోణాల కన్న వర్తులాకృతులు కనువిందుగా ఉంటాయని వేరే చెప్పాలా? తెలుగు అజంత (అచ్+అంత) భాష అని భాషావేత్తలు సాధారణంగా చెప్పే మాట. అంటే తెలుగు మాటల చివర అచ్చులుంటాయి. ఇందువల్ల భాష వినసొంపుగా ఉంటుంది. ‘తేనె వలె తీయనిది’ అని పాడుకునేది అందుకే. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీనాథుడో, శ్రీకృష్ణ దేవరాయలో చెప్పిన పద్యపాదాన్ని పైపైన ప్రస్తావించటం గాక లోతుగా చూస్తే తెలుగు భాష విలువ ఏమిటో బాగా అర్థమవుతుంది. గిడుగు రామ్మూర్తి పంతులు గిడుగు జయంతి (ఆగస్టు 29)నే తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ప్రాచీన మహాకవుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క దారి. వేములవాడ భీమకవిలో ఉద్దండ లీల, నన్నయలో ఉభయ వాక్ప్రౌఢి, తిక్కనలో రసాభ్యుచిత బంధం, ఎర్రాప్రెగ్గడలో ఉక్తి వైచిత్రి ఉన్నాయన్నాడు శ్రీనాథుడు. ప్రాచీన కవుల్లో భాషాశక్తి, పదబంధం, నిర్మాణవ్యూహం తప్పనిసరిగా పరిశీలించదగినవి.భాషా నైపుణ్యంతో పాటు జీవిత నిష్ఠ నేర్పే పద్యాలు, వేమన, సుమతీ శతకాలు పిల్లలకి నేర్పితే వేరే ‘వ్యక్తిత్వ వికాసాలు’ అవసరమంటారా? ఈ సొంపు హలంత భాషలకు ఉండదు. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని నికొలొకాంటి అనే ఇటలీ యాత్రికుడు తెలుగును మెచ్చుకోవటానికి కారణం ఇదే. ఇటాలియన్ భాష కూడా తెలుగు మాదిరే అజంత భాష. ఈ వినసొంపైన లక్షణమే, కర్ణాటక సంగీత సంప్రదాయంలో తెలుగు కీర్తనల్ని అగ్రస్థానంలో నిల్పింది. ‘సుందర తెలుగు’ అని సుబ్రహ్మణ్య భారతి వంటి తమిళ మహాకవుల మెప్పు పొందింది. పరాయి భాషలంటే మొహం చిట్లించే తమిళులు త్యాగరాజు కీర్తనల్ని ఆస్వాదించటానికి ముఖ్య కారణం మన భాషలోని నాద మాధుర్యమే. ‘రెండు వేల’ ఏళ్ల తెలుగు ‘జనని సంస్కృతంబు సకల భాషలకును ’ (క్రీడాభిరామము) అనే నమ్మకమే చిరకాలం నుంచి రాజ్యమేలింది. అయితే తెలుగు సంస్కృత జన్యం కాదని, ద్రావిడ భాషా కుటుంబానికి చెందిందని రాబర్ట్ బిషప్ కాల్డ్వెల్ (19వ శతాబ్ది) నిరూపించటంతో సంస్కృతానికి, తెలుగుకు తల్లీబిడ్డల బంధం తెగిపోయింది. అయితే నన్నయ మొదలు కవులంతా తెలుగు కావ్యాల్లో సంస్కృత పదాలు గుప్పించి, సామాన్య ప్రజలకి సాహిత్యం దూరం చెయ్యటంలో కృతకృత్యులయ్యారు. సంస్కృతం లేదా ప్రాకృతమే రాజభాషగా శాసనాల్లో చెలామణి అయ్యింది. క్రీస్తు శకారంభం నుంచి తెలుగు మూల ద్రావిడ భాష నుంచి విడివడ సాగింది. అప్పటి ‘గాథాసప్తశతి’ ప్రాకృత గ్రంథంలో అత్త, అమ్మి, పొట్ట, పాడి మొదలైన తెలుగు మాటలు తొంగిచూశాయి. క్రీ.శ.ఒకటవ శతాబ్ది నాటి అమరావతి స్తూపం రాతిపలక మీద కనపడ్డ ‘నాగబు’ (నాగము, పాము) అనేది మనకు కనిపించిన మొట్టమొదటి తెలుగు మాట. ఆ తర్వాత రేనాటి చోళులు వేయించిన కలమళ్ల, ఎర్ర గుడిపాడు శాసనాల్లో (క్రీ.శ.575) తెలుగు భాష కనపడుతుంది. పండరంగడి అద్దంకి శిలాశాసనం (క్రీ.శ.848) మొట్టమొదటి (తరువోజ) పద్య శాసనం. యుద్ధమల్లుడి బెజవాడ శాసనం, విరియాల కామసాని గూడూరు శాసనం మొదలైన వాటిల్లో కనపడే తెలుగు పద్యాలు నన్నయభట్టుకు ముందే తెలుగు కవిత్వం ఉందని నిరూపిస్తున్నాయి. తెలుగు ప్రాచీన హోదాని బలపరుస్తున్నాయి. 12, 13 శతాబ్దాల్లో నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు ‘జాను తెనుగు’ ఉద్యమం చేపట్టి, సంస్కృత మార్గ పద్ధతి కాక తేటతెలుగే కావ్య భాషగా ఉండాలని ప్రతిపాదించారు. తర్వాత కాలంలో తెలుగు మీద సంస్కృతం పెత్తనాన్ని నిరసిస్తూ అచ్చ తెలుగు కావ్యాలు వచ్చాయి. ఏది ఏమైనా తెలుగు మీద ఒకప్పుడు సంస్కృతం అత్తగారి పెత్తనం సాగితే, ఇవాళ ఇంగ్లిష్ మామగారి పెత్తనం సాగుతుందన్నది వాస్తవం. ప్రాచీన సౌందర్యం వర్తమాన సాహిత్య అధ్యయనం వల్ల సమకాలీన వస్తువులు, అధునాతన వ్యక్తీకరణ పద్ధతులు, వాదాలు, ఉద్యమాలు మొదలైనవాటి గురించి తెలుస్తుంది. మరి ప్రాచీన సాహిత్యాన్ని ఎందుకు అధ్యయనం చెయ్యాలి? ప్రాచీన మహాకవుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క దారి. వేములవాడ భీమకవిలో ఉద్దండ లీల, నన్నయలో ఉభయ వాక్ప్రౌఢి, తిక్కనలో రసాభ్యుచిత బంధం, ఎర్రాప్రెగ్గడలో ఉక్తి వైచిత్రి ఉన్నాయన్నాడు శ్రీనాథుడు. ఇక అతని కవిత్వంలో ధాటి చెప్పాల్సిన పనిలేదు. ప్రాచీన కవుల్లో భాషాశక్తి, పదబంధం, నిర్మాణ వ్యూహం తప్పనిసరిగా పరిశీలించదగినవి. ‘అభ్రంకషంబైన యాలపోతు నితండు త్రుంచినా డీతండు పెంచినాడు’ అనే నాచన సోమన పద్యాన్ని పరిశీలిస్తే, భిన్నాంశాల మధ్య వైరుధ్యాన్ని ఎట్లా వ్యక్తీకరించవచ్చో తెలుస్తుంది. అదే కవి ‘అరి జూచున్, హరి జూచు’ అంటూ భిన్న చర్యల మార్పును ఎంత చక్కగా కవిత్వీకరించవచ్చో చూపించాడు. అడిగెదనని కడు వడి జను నడిగిన దను మగుడ నుడుగడని నడ యుడుగున్ వెడవెడ సిడి ముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ గజేంద్రుడిని రక్షించటానికై ఆదర బాదరగా పరిగెత్తుతున్న విష్ణువు పరిస్థితి అర్థం గాని లక్ష్మీదేవి మానసిక డోలాందోళన అది. పోతన రచించిన సర్వ లఘు కందం. చక్కని డకార అనుప్రాస. అర్థానికి శబ్ద సౌందర్యంతో పరిపుష్ఠి నెట్లా కల్పించవచ్చో తెల్పుతుంది. ‘మమ్మెరుగు, దెదిరి నెరుగుదు’మనే కంద పద్యంలో తిక్కన ఏడు వాక్యాలు ఇమిడించాడు. అల్పాక్షరాల్లో అనల్పార్థ రచన తిక్కనను చూసి నేర్చుకోవాల్సిందే. శ్రీనాథుడు తనకెంతో ఇష్టమైన సీస పద్య రచనలో 32 రకాల గతి భేదాలు ప్రదర్శించాడు. వ్యావహారిక భాషావాదం ఆంగ్లేయుల వలస పాలనలో 20వ శతాబ్ది మొదటి పాదంలో దేశంలో ఆధునిక దృక్పథం మొదలైంది. తరతరాల సాహిత్య, సాంస్కృతిక మూలాలను విమర్శిస్తూ కొత్త దారుల కోసం అన్వేషణ ప్రారంభమైంది. గురజాడ, గిడుగు సాహిత్య రంగంలో దీనికి ఆద్యులు. ‘మంచి గతమున కొంచెమే’ అన్నాడు గురజాడ. భాషలో యథాస్థితి వాదానికి, పరిణామ వాదానికి మధ్య యుద్ధం 1910లోనే మొదలైంది. వ్యావహారిక భాషోద్యమానికి గిడుగు, గురజాడ అంకురార్పణ చేశారు. దానికి వ్యతిరేకంగా జయంతి రామయ్య పంతులు నాయకత్వంలో గ్రాంథిక భాషా వాదం సాగింది. కాలక్రమంలో వ్యావహారిక భాషోద్యమానిది పైచేయి అయిందని మనకు తెలిసిన సంగతే. ఆ తర్వాత భాషా వ్యవహారంలో స్థిరీకరణ కోసం శిష్ట వ్యవహారం ముందుకొచ్చింది. కాని నిలబడలేకపోయింది. విభిన్న మాండలికాల మధ్య ప్రామాణిక భాష అనేది ఆదర్శంగానే మిగిలిపోయింది. అయితే మధ్య కోస్తాలో వెలసిన పత్రికల ద్వారా ఆ ప్రాంతపు భాష ముఖ్యంగా రాతలో, రచనల్లో ఆధిపత్యం వహించింది. రాను రాను రచయిత తమ ప్రాంతపు జీవద్భాషలో రచనలు చెయ్యటం వల్ల గొప్ప భాషా వైవిధ్యం చూడగలుగుతున్నాం. ప్రాచీన గ్రంథాల భాషకి, ప్రజల వ్యవహార భాషకి మధ్య గల అంతరాన్ని గుర్తించటమే వ్యావహారిక భాషావాదానికి ప్రాతిపదిక. గ్రాంథిక భాషలోని కృత్రిమత్వాన్ని, ‘పండితభిషక్కుల భాషా భేషజా’న్ని గిడుగువారు బయటపెట్టారు. వాడుక భాషే రచనా భాషగా ఉండటం సహజమైన విధానమని ఆయన చెప్పటంలో తప్పు లేదు. అయితే వ్యావహారిక భాషావాదులు గమనించని అంశమేమిటంటే, మాట్లాడే భాషకి, లిఖిత భాషకి పూర్తి ఏక రూపత సాధ్యం కాదనేది. ఉచ్ఛారణలో విసంధులు పాటించం. కాని రాతలో పాటించకపోతే అర్థ స్పష్టత ఉండకపోగా అపార్థాలు చోటుచేసుకుంటాయి. గురజాడే ‘కన్యాశుల్కం’లోని సంభాషణల్లో ఉచ్ఛారణ భేదాన్ని గుర్తించటానికి కొన్ని గుర్తులు వాడాల్సి వచ్చింది. వ్యావహారిక భాషోద్యమం గ్రాంథిక ‘భాష’ని తిరస్కరించే క్రమంలో ఆ భాషలోని అన్ని విలువల్ని తిరస్కరించే ఆలోచనావిధానం తలెత్తింది. తన కవిత ‘శ్మశానాల వంటి నిఘంటువుల దాటి, వ్యాకరణాల సంకెళ్లు విడిచి, ఛందస్సుల సర్ప పరిష్వంగం వదలి’ వెలువడిందన్నాడు శ్రీశ్రీ. కవిత్వ ఆవిర్భావంలోని నిసర్గ లక్షణాన్ని ఆయన దర్శించిన పద్ధతి అది. ఆ మాటలలోని ధ్వనిని వదిలిపెట్టి, వాచ్యార్థం గ్రహించిన సాహిత్యకారులు, నిఘంటువులు, వ్యాకరణాలు, ఛందస్సులు పూర్తిగా అనవసర విషయాలుగా భావించారు. ప్రాచీన సాహిత్యానికి అవి నిర్మాణ సాధనాలు. వాటిని తిరస్కరించే క్రమంలో ఆ సాహిత్యాన్నీ తిరస్కరించారు. అందులో రాచరిక, భూస్వామ్య విలువలు, వర్ణ భేదాలు, దైవ కేంద్రక భావజాలం- ఇవన్నీ ఉన్నమాట నిజం. అయితే ప్రాచీన సాహిత్యమంటే అవి మాత్రమే కాదు. భాషా విన్యాసం, పలుకుబడి, సాంస్కృతిక విశేషాలు, పౌరాణిక, చారిత్రక సమాచారం- మరెన్నో అందులో ఉన్నాయి. వాటిని నిరాకరించటమంటే ఆ వారసత్వ సంపదని కోల్పోవటమే. పద్యాల్లో వ్యక్తిత్వ వికాసం పద్యం పాత చింతకాయ పచ్చడే కావచ్చు. కాని పిల్లలకు నైతిక జీవసూత్రాలు తెల్పటానికి, ధారణాశక్తి వృద్ధికి, భాషా సౌందర్యం తెలుసుకోవటానికి పద్య సాహిత్యం ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు. ఉదాహరణకి తిక్కన భారతంలో ఒక పద్యం చూడండి: ఒరు లేయవి యొనరించిన నరవర! య ప్రియము మనంబున కగు, దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్ ఇతరులు ఏ పనులు చేస్తే మనం బాధపడతామో, ఆ పనులను ఇతరుల పట్ల మనం చెయ్యకుండా ఉండటమే ఉత్తమమైన ధర్మం. ‘చదువు పద్యమరయ చాలదా యొక్కటి’ అన్నాడు వేమన. ఆ ఒక్కటి ఈ పద్యమే అనుకోగూడదా? తప్పులెన్నువారు తండోపతండముల్ ఊరి జనులకెల్ల నుండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పు లెరుగరో విశ్వదాభిరామ! వినురవేమ! తేట తెలుగు మాటలతో సరళమైన అల్లిక పనితనం అది. భాషా నైపుణ్యంతో పాటు జీవిత నిష్ఠ నేర్పే యిటువంటి పద్యాలు, శతకాలు పిల్లలకి నేర్పితే వేరే ‘వ్యక్తిత్వ వికాసాలు’ అవసరమంటారా? తెలుగు లేని చదువు ఒక్క తెలుగు అక్షరం నేర్చుకోకుండా ఉన్నత విద్యాధికుడు కాగల అవకాశం తెలుగు దేశంలోనే ఉంది. కింది నుంచి పైస్థాయి దాకా తెలుగును ప్రథమ భాషగా, తప్పనిసరి అంశంగా చేస్తే విద్యార్థులు మాతృభాషకు దూరం కాకుండా ఉంటారు. తెలుగు మీడియం పట్ల చిన్నచూపును పోగొట్టడం కూడా అవసరమే. ప్రపంచంలో ఏ భాషవారైనా ఒక విషయాన్ని మాతృభాషలోనే చక్కగా అర్థం చేసుకోగలుగుతారని శాస్త్ర పరిశోధకులు చెప్పిన మాటే. విద్యార్థి మాతృభాషకి దూరం కావటం అంటే దానిలోని సమస్త సాంస్కృతిక సంపదకి దూరం కావటమే. పునాది లేని సమాచార నిధిగా మిగిలిపోవటమే. భాషను ఆధునికం చెయ్యటం ఎలా? భాష కూడా ఇవాళ ప్రపంచీకరణకి గురి అవుతున్నది. కొత్త కొత్త శాస్త్ర విశేషాలు, కొత్త కొత్త అవసరాలు, వాటిని తీర్చే సాధనాలు పుట్టుకొస్తున్నప్పుడు వాటిని గ్రహించకుండా ఏ భాషైనా మడికట్టుకొని కూర్చోగూడదు. భాష విస్తృతం కావటానికి రెండు పద్ధతులున్నాయి. కొత్త పరిభాషని ఇతర భాషల నుంచి యధాతథంగా గ్రహించటం. రైలు, రోడ్డు, గుమస్తా, తారీకు, బత్తాయి మొదలైన ఇతర భాషా పదాల్ని (అన్య దేశాలు) అట్లాగే చేర్చుకొన్నాం. విషయ నిర్దేశానికి, వ్యక్తీకరణకి అవసరమైన పరిభాషను సొంతగా కల్పించుకోవటం. అశ్వ శక్తి, నల్ల ధనం, హరిత విప్లవం లాంటివి ఇట్లా కల్పించుకున్నవే. ఆ ప్రయత్నం పట్టుదలతో సాగటం లేదు. కంప్యూటర్ పరిభాషని మొత్తం తమిళంలో కల్పించుకోగలిగారు తమిళులు. ‘కంప్యూటర్’ అనే ఒక్క మాటని కూడా తెలుగు చెయ్యలేకపోయాం. పాలనా యంత్రాంగంలో అధికార భాషగా ఇంగ్లిష్ స్థానంలో తెలుగును ప్రవేశపెట్టడం అవసరం. నాయకులకు రాజకీయ నేపథ్యం తప్ప సాంస్కృతిక నేపథ్యం లేకపోవటం మన దురదృష్టం. తెలుగు భాషకి ప్రాచీన హోదా కన్నా ఆధునిక హోదా ఇవాళ అత్యవసరం. - పాపినేని శివశంకర్ (ప్రముఖ కవి, రచయిత)
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
నాణ్యమైన విత్తనాలతో ఆశించిన దిగుబడులు
గతానికంటే మెరుగైన సీట్లతో మళ్లీ జగనన్న పాలన
ఇరువర్గాలపై కేసులు నమోదు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఇంటర్ సప్లిమెంటరీకి సర్వం సిద్ధం
భద్రత వెరీ స్ట్రాంగ్
24న ఎంఎస్ఎంఈ వర్క్షాప్
అంగన్వాడీ కేంద్రాలుతనిఖీ చేసిన ఆర్జేడీ
నేడు మోదకొండమ్మ కొలువు సంబరం
సింహగిరి.. ఆధ్యాత్మిక ఝరి
తప్పక చదవండి
- కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement