Non-Metro
-
ఉద్యోగాలకు ముందుకొస్తున్న మహిళలు
ముంబై: ఉద్యోగ బాధ్యతలు చేపట్టేందుకు మరింత మంది మహిళలు ముందుకు వస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా 2021 నుంచి 2024 మధ్యకాలంలో టైర్–2, 3 ఇతర నాన్ మెట్రో పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ‘ఆప్నా డాట్ కో’ వెల్లడించింది. ముఖ్యంగా టైర్–2, 3 పట్టణాల నుంచి మహిళా అభ్యర్థుల దరఖాస్తులు మూడు రెట్లు పెరిగినట్టు తెలిపింది. మెట్రోలకు వెలుపల ఉద్యోగాల్లో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యాన్ని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొంది. పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, డిజిటల్ అనుసంధానత, నియామకాల్లో వస్తున్న మార్పులు చిన్న పట్టణాల్లోనూ వివిధ రంగాల్లో మహిళల ప్రవేశానికి వీలు కల్పిస్తున్నట్టు తెలిపింది. → టైర్–2, 3 పట్టణాల్లో సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, అడ్మిన్, బ్యాక్ఆఫీస్, కస్టమర్ సపోర్ట్లో మహిళలు ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. 55 శాతం మంది మహిళలు ఈ ఉద్యోగాల్లోనే చేరుతున్నారు. → అంతేకాదు కఠిన పరిస్థితులు ఉండే క్షేత్రస్థాయి అమ్మకాలు, డెలివరీ, లాజిస్టిక్స్లోనూ కొందరు పనిచేసేందుకు సుముఖత చూపుతున్నారు. → క్షేత్రస్థాయి విక్రయాల్లో ఉద్యోగానికి 6 లక్షలు, డెలివరీ, లాజిస్టిక్స్ ఉద్యోగాలకు 2.5 లక్షల దరఖాస్తులు, సెక్యూరిటీస్ సేవల ఉద్యోగాలకు 1.5 లక్షల దరఖాస్తులు 2021–2024 మధ్యకాలంలో వచ్చాయి. → లక్నో, జైపూర్, ఇండోర్, భోపాల్, సూరత్, నాగ్పూర్, కోయింబత్తూర్ మహిళలకు ఉపాధి కేంద్రాలు. ఆప్నా ప్లాట్ఫామ్పై ఉద్యోగ దరఖాస్తుల్లో 45% ఇక్కడివే. -
టెక్నాలజీ వ్యాపారవేత్తలుగా మహిళలు
న్యూఢిల్లీ: మెట్రో నగరాలతో పోలిస్తే మెట్రోయేతర నగరాల్లోని మహిళలు ఎక్కువగా టెక్నాలజీ వ్యాపారవేత్తలుగా మారడంపై ఆసక్తిగా ఉన్నారు. అయితే, సాంకేతిక వనరులు, మౌలిక సదుపాయాల కొరత, దిశానిర్దేశం చేసే మెంటార్లు దొరక్కపోవడం వారికి ప్రధాన అవరోధంగా ఉంటోంది. టెక్నాలజీ అనలిటిక్స్ సంస్థ టెక్ఆర్క్, మహిళల ప్లాట్ఫామ్ షీట్వర్క్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయాయి. దీని ప్రకారం నాన్–మెట్రో నగరాల్లోని మహిళల్లో దాదాపు 48 శాతం మంది .. తమ కెరియర్ ఆప్షన్గా టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్షిప్ను ఎంచుకోవడంపై ఆసక్తిగా ఉన్నారు. మెట్రో నగరాల్లో తమ సొంత వెంచర్లను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారి సంఖ్య 23 శాతం మాత్రమే ఉంది. మెట్రో నగరాల్లోని మహిళలు.. సౌకర్యవంతమైన కెరియర్ కోసం ఎక్కువగా కార్పొరేట్ ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు. ‘భారత్లో మహిళా టెక్ ఎంట్రప్రెన్యూర్షిప్ స్థితిగతులు‘ అనే అంశంపై దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో 2,000 మంది పైచిలుకు పాల్గొన్నారు. వీరిలో ప్రొఫెషనల్స్, విద్యార్థులు, స్టార్టప్ల వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఐఐటీల్లో పెరిగిన విద్యార్థినులు.. ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో విద్యార్థినుల సంఖ్య గడిచిన నాలుగేళ్లలో గణనీయంగా పెరిగింది. అప్పట్లో ఇది కేవలం 5 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 16 శాతానికి చేరింది. కానీ వీరంతా సొంతంగా టెక్ కంపెనీలను ప్రారంభించే దిశగా వెళ్లడం లేదు. ‘మెట్రోయేతర నగరాల్లోని 73 శాతం మంది మహిళలు .. అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే .. తాము ఎంట్రప్రెన్యూర్షిప్ను ఎంచుకోలేకపోతున్నామని తెలిపారు. మెట్రోల్లో 22 శాతం మంది మహిళలు భౌతిక ఇన్ఫ్రా కొరత తమకు సమస్యగా ఉంటోందని పేర్కొన్నారు‘ అని నివేదిక వెల్లడించింది. ఇక పురుషులతో పోలిస్తే నిధులు సమీకరించడం, పెట్టుబడులను సమకూర్చుకోవడం కష్టతరంగా ఉంటోందని సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది చెప్పారు. ‘విద్యావంతుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సంబంధిత వ్యాపార, సాంకేతిక వనరులు పరిమిత స్థాయిలోనే ఉండటమనేది వారి వెంచర్లను విస్తరించడంలో అవరోధంగా ఉంటోంది. టెక్నాలజీ కొరత ప్రధాన సవాలుగా ఉంటోందని మెట్రోయేతర నగరాల్లోని 74 శాతం మంది తెలిపారు. మహిళా వ్యాపారవేత్తలు తమ వెంచర్లలో విజయం సాధించాలంటే టెక్నాలజీ అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని మెట్రో నగరాల్లో 24 శాతం మంది చెప్పారు‘ అని నివేదిక పేర్కొంది. -
ఆరోగ్య బీమాకే హైదరాబాదీల ఓటు: సర్వే
హైదరాబాద్: ఆరోగ్య బీమాకు సంబంధించి పరిణితి చెందిన నాన్-మెట్రో నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఎదుగుతోంది. జీవిత బీమా కన్నా ఆరోగ్య బీమానే మరింత ముఖ్యమని అత్యధిక శాతం మంది హైదరాబాదీలు భావిస్తున్నారు. మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ నిర్వహించిన పల్స్ 2015 సర్వేలో 75 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ఎదురయ్యే వైద్య వ్యయాలను తట్టుకునేందుకు హైదరాబాద్లో 96 శాతం మంది ఆరోగ్య బీమాపై ఆధారపడినట్లు సర్వేలో వెల్లడైంది. ఇక్కడ సగటున బీమా మొత్తం రూ. 8 లక్షల స్థాయిలో ఉంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, తదితర నగరాల్లో 1,500 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.