breaking news
Desert crop
-
కరువు తీర్చే పంట!
తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతల మధ్య సాధారణ పంటల సాగుకు పనికిరాని (ఎడారి) భూముల్లో సైతం బతికి ఉండటమే కాకుండా అధిక దిగుబడిని ఇచ్చే పంట ఏమైనా ఉందా?అవును. అలాంటిదే ‘బ్రహ్మజెముడు’! బ్రహ్మజెముడు మనకు కొత్తదేమీ కాదు. దీని కాండమే ఆకులా ఉంటుంది. సాధారణంగా మనకు తెలిసిన బ్రహ్మజెముడుకు ముళ్లుంటాయి. అయితే, ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ‘ముళ్లు లేని బ్రహ్మజెముడు’ పంట గురించి. వాతావరణ మార్పు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ ప్రతికూల వాతావరణ పరిస్థితులను సునాయాసంగా ఎదుర్కొనగల బ్రహ్మజెముడుకు ప్రపంచవ్యాప్తంగా ఏటేటా గిరాకీ పెరుగుతోంది. గడ్డుకాలంలో సవాలుగా మారే పశుపోషణలో రైతులకు తోడ్పడుతుంది. అంతేకాదు.. గాలి, వానలకు భూమి పైపొర కోతకు గురవకుండా కూడా బ్రహ్మజెముడు తోడ్పడుతుంది. దీని కాండపు ముక్కను ఒకసారి నాటుకుంటే చాలు.. 50 ఏళ్ల పాటు దిగుబడినిస్తుంది. అందుకే ఇది ‘కరువు తీర్చే పంట’. ఏడాది పొడవునా పశుగ్రాసాన్ని అందించే దీర్ఘకాలపు పశుగ్రాసపు పంటగా శాస్త్రవేత్తలు దీన్ని మన రైతులకు పరిచయం చేస్తున్నారు. ముళ్లులేని బ్రహ్మజెముడు పంటకు పశువులకు, మనుషులకు గడ్డు పరిస్థితుల్లోనూ ఉపయోగపడే ఆహార పంటగానే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎడారి పంటగా కూడా గుర్తింపు ఉంది. ఇది కాక్టస్ (Cactus - Opuntia ficus indica) జాతికి చెందిన మొక్క. మెక్సికో దీని పుట్టిల్లు. నీటిని/వర్షాన్ని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవడంలో దీనికి ఇదే సాటి. ప్రపంచవ్యాప్తంగా మెట్ట, తరచూ కరువు బారిన పడే ప్రాంతాలు, ఎడారి ప్రాంతాల్లో సాగుకు ఇది చాలా అనువైన పంట. దీన్ని బ్రెజిల్, మెక్సికో, సౌదీ అరేబియా, ఇటలీ, అమెరికా, ఆఫ్రికా దేశాలలో మొత్తం 24 దేశాల్లో సాగు చేస్తున్నారు. కాండపు ముక్కలను కూరగాయగా, పానీయాలకు ముడి పదార్థంగా, ఔషధంగా 50 రకాలుగా దీన్ని ఉపయోగిస్తున్నారు. 1970 దశకంలో ఈ పంట మన దేశానికి పరిచయమైనా పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. జోద్పూర్(రాజస్థాన్) లోని కేంద్రీయ మెట్ట ప్రాంత పరిశోధనా సంస్థ, ఝాన్సీ(ఉ.ప్ర.)లోని భారతీయ పశుగ్రాస పరిశోధనా సంస్థ, కేంద్రీయ అగ్రో ఫారెస్ట్రీ పరిశోధనా సంస్థ, కర్నల్(హర్యానా)లోని కేంద్రీయ చౌడు భూముల పరిశోధనా సంస్థ, బికనెర్(రాజస్థాన్)లోని కేంద్రీయ వర్షాధార ఉద్యాన పరిశోధనా సంస్థ, ఫల్తన్(మహారాష్ట్ర)లోని నింబికర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(నారి), పుణే జిల్లా ఉరులికాంచన్లోని బి.ఎ.ఐ.ఎఫ్. డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ తదితర మెట్ట/ఎడారి ప్రాంత వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో కొన్ని ఏళ్లుగా దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. జో«ద్పూర్లో చేపట్టిన పరిశోధనల్లో పశువుల మేతగా బ్రహ్మజెముడు సమర్థవంతంగా పనికివస్తుందని రుజువైంది. అనంతపురం జిల్లా రేకులకుంటలో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానంలో కూడా ముళ్లు లేని బ్రహ్మజెముడును ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. బ్రహ్మజెముడు అనగానే ముట్టుకుంటే గుచ్చుకునే ముళ్లు్ల గుర్తుకొస్తాయి. కానీ.. ఈ బ్రహ్మజెముడుకు ముళ్లు ఉన్నట్లు కనిపించినా అవి మెత్తగా ఉంటాయి. ముళ్లులేని బ్రహ్మజెముడు కాండపు ముక్కలు పశువుల మేతగా బాగా పనికివస్తాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ ఆర్.వీరరాఘవయ్య(99896 25222), శాస్త్రవేత్తలు డాక్టర్ జి.నారాయణస్వామి(62812 84235), డాక్టర్ కె.అరుణ్కుమార్(83092 30136) అంటున్నారు. అతి తక్కువ వర్షపాతం చాలు వార్షిక వర్షపాతం అత్యల్పంగా(150 నుంచి 200 మి.మీ) నమోదయ్యే ప్రాంతాల్లో కూడా ముళ్లు లేని బ్రహ్మజెముడు సాగు చేసుకోవచ్చు. బంజరు భూములు, అటవీ ప్రాంతాల్లోనూ దీని కాండం (ఆకు) ముక్కలను నర్సరీలో పెంచి నాటుకోవచ్చు. మొక్క సులువుగా బతుకుతుంది. ఎలాంటి తెగుళ్లు, చీడపీడలు ఆశించవు. పశువులకు రోజువారీ ఇచ్చే పప్పుజాతి/ధాన్యపు జాతి మేతలో దీన్ని 33 శాతం మేరకు కలిపి ఇవ్వవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ముళ్లు లేని ఆకులను రెండు, మూడు భాగాలుగా కత్తిరించి నాటుకోవచ్చు. పశువులకు మేతగా ఇచ్చే సమయంలో మట్టి అంటకుండా చూసుకోవాలి. ఈ పంట వల్ల భూసారం పెరుగుతుందని నిరూపణ అయింది. బంజరు భూములు, అటవీ భూములలో నాటుకోవచ్చు. తోటలు, పొలాల చుట్టూ రక్షణ పంట(జీవకంచె)గా వేసుకొని పశువుల మేతకు వినియోగించుకోవచ్చు. కాయలు లేదా పండ్లను కూడా పశువులు, గొర్రెలు తింటాయి. ఏ వయసు పశువులకైనా మేపవచ్చు. ఎకరానికి 667 మొక్కలు నాటాలి జోద్పూర్ నుంచి తెచ్చిన బ్రహ్మజెముడు ముక్కలను రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానంలో సాగు చేస్తున్నారు. ఎకరానికి 667 మొక్కలు నాటుకోవాలి. 15–20 రోజుల వ్యవధిలో 10–15 సెం.మీ. పొడవు, 30 గ్రాముల బరువు ఉండే బ్రహ్మజెముడు కాండపు ముక్కల(క్లాడోడ్స్) దిగుబడి పొందవచ్చు. అనంతపురం వంటి తీవ్ర కరువు ప్రాంతాల్లో అయితే.. వరుసల మధ్య 2–3 మీటర్లు, మొక్కల మధ్య 1.5–2 మీటర్ల దూరం ఉండాలి. వర్షపాతం, భూసారం మెరుగ్గా ఉండే ప్రాంతాల్లో అయితే.. వరుసల మధ్య 3 మీటర్లు, మొక్కల మధ్య 2–2.5 మీటర్ల దూరం పాటించాలి. హెక్టారు భూమిలో సంవత్సరానికి 20 టన్నుల వరకు గ్రాసాన్ని పొందవచ్చు. 50–55 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుంటుంది. మట్టి పాళ్లు తక్కువగా ఉండే రాళ్ల/ఇసుక భూములు, కొండ వాలు, బంజరు భూముల్లో పెంచుకోవచ్చు. భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ముళ్లు లేని బ్రహ్మజెముడు కరువు కాలపు పంటగా గుర్తెరగడం అవసరం.– గంగుల రామలింగారెడ్డి,సాక్షి, అగ్రికల్చర్, అనంతపురం రాత్రి పూటేకిరణజన్య సంయోగ క్రియ! ముళ్లులేని బ్రహ్మజెముడు తీవ్ర ప్రతికూల వాతావరణంలోనూ అతి తక్కువ నీటితోనే మనుగడ సాగిస్తుంది. అదెలా? సాధారణ పంటలు(సి3 రకం), నీటిని తక్కువగా వాడే చిరుధాన్య పంటలు(సి4 రకం) పగటి పూటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. వీటి పత్ర రంధ్రాలు పగటి పూటే తెరుచుకొని నీటి ఆవిరిని వాతావరణంలోకి విడుదల చేస్తూ ఉంటాయి. కాబట్టి నీటి అవసరం ఎక్కువ. బ్రహ్మజెముడు మొక్కలు పగలు గమ్మునుండి రాత్రి పూటే ఈ పనిచేస్తాయి. అందువల్ల సి3, సి4 పంటలకన్నా 3–5 రెట్లు తక్కువ నీటినే బతుకుతుందని ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్.ఎ.ఓ.) నిపుణుడు హరిందర్ పి.ఎస్. మక్కర్ అంటున్నారు. కిలో బ్రహ్మజెముడు కాండపు ముక్కల ఉత్పత్తికి 250 లీటర్ల నీరు చాలు. అతి చలిని, అతి వేడిని తట్టుకుంటుంది. సారవంతమైన భూమిలో నీటిపారుదల ఉంటే అత్యధిక దిగుబడినిస్తుంది. నిస్సారమైన భూముల్లో తక్కువ నీటితో కూడా పెరిగి మోస్తరు దిగుబడినిస్తుంది. నీరు నిలిచే, చౌడు భూములు పనికిరావు. పాల దిగుబడిని పెంచే మేత ♦ ముళ్లులేని బ్రహ్మజెముడును పశువుల మేతగా ఏ మేరకు పనికివస్తుందనే దానిపై డీఆర్డీఏ–వెలుగు(సెర్ప్) ఆధ్వర్యంలో కొందరు రైతుల చేత ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలో సాగు చేయిస్తున్నారు. గుత్తి, నల్లమాడ, ముదిగుబ్బ, తనకల్లు, శింగనమల, ఉరవకొండ మండలాల పరిధిలో స్వల్ప విస్తీర్ణంలో గత జనవరి నుంచి సాగు చేస్తున్నారు. ♦ పూణె సమీపంలోని ఊర్లికాంచంలోని బి.ఎ.ఐ.ఎఫ్. బయో రీసెర్చ్ స్టేషన్ నుంచి 7 వేల కణుపులు తెచ్చి ఎకరాకు 700 కణుపులు నాటించామని అనంతపురం ప్రాంతీయ పశు శిక్షణా కేంద్రం నిపుణులు డాక్టర్ శ్రీకాంత్(94411 84152) తెలిపారు. ♦ రెండు అడుగుల గుంత తీయించి మొక్కల మధ్య రెండున్నర మీటర్లు, వరుసల మధ్య 3 మీటర్ల ఎడంలో నాటించాం. శిలీంధ్ర సమస్య తలెత్తకుండా 2 గ్రాములు మాంకోజెబ్ పురుగుమందులో కణుపులు ముంచి నాటించామన్నారు. నాటిన తర్వాత 10–12 నెలల నుంచి ఆకులు (కాండపు ముక్కలు) చిన్న ముక్కలుగా కోసి పశువులకు మేపుకోవచ్చు. ♦ వర్షాకాలంలో నాటుకుంటే మేలు. ఒక మొక్కకు వారం లేదా పది రోజులకోసారి ఒక లీటర్ నీళ్లు చాలు. నాటిన మొదట్లో 10 నుంచి 15 రోజులకో తడి ఇస్తే సరిపోతుంది. సంవత్సరానికి ఎంతలేదన్నా ఎకరాకు 10 టన్నుల మేత అందుబాటులోకి వస్తుంది. ♦ తక్కువ మేతలోనే ఎక్కువ శక్తినిచ్చే పోషకాలు ఉంటాయి. ఎముక బలం, పాల దిగుబడి పెరుగుతాయి. ♦ ఒక మొక్కకు సంవత్సరానికి 25 నుంచి 37 కణుపులు వస్తాయి. ఒక్కో మొక్క నుంచి ఎంతలేదన్నా సంవత్సరానికి 15 కిలోల వరకు మేత పొందవచ్చు. -
పొలం ఎడారవుతోంది!
తెలంగాణ రాష్ట్రంలో 31.34% భూమి పడావు పడి ఎడారిగా మారింది. ఆంధ్రప్రదేశ్లో 14.35%పంట భూమి ఎడారిగా మారింది.భూమికి ఎటువంటి ఆచ్ఛాదనా లేక వర్షాలకు భూమి పైపొర కొట్టుకుపోవటం, చెట్టు చేమ నశించటం ఇందుకు మూల కారణాలు. సాగులో ఉన్న పొలాలు జీవాన్ని కోల్పోతున్నాయి. పంట పొలాలు క్రమంగా గడ్డి కూడా మొలవని ఎడారైపోతున్నాయి. నీటి వనరులు బొత్తిగా లోపించి, పచ్చదనం, జీవరాశి కనుమరుగైన భూమి ఎడారిగా మారినట్లు లెక్క. ప్రపంచవ్యాప్తంగా 33% పంట భూములు ఇప్పటికే ఎడారిగా మారాయి. మన దేశంలో 32.87 కోట్ల హెక్టార్ల పొలం ఉంటే.. ఇందులో 9 కోట్ల 64 లక్షల హెక్టార్ల భూమి పంటల సాగుకు ఎంతమాత్రం పనికిరాకుండా పోయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2003–05 నుంచి 2011–13 మధ్యకాలంలోనే 18 లక్షల 70 వేల హెక్టార్ల భూమి పంటలకు పనికిరాకుండా పోయింది. ► భూమి ఎడారిగా మారటానికి అనేక కారణాలున్నాయి. గత ఏడాది ‘ఇస్రో’ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన దేశంలో 1.12% సాగు భూములు, ముఖ్యంగా సాగు నీటి సదుపాయం ఉన్న డెల్టా భూములు, చౌడుబారిపోయాయి. రసాయనిక ఎరువులు అతిగా వాడటం వల్ల లేదా పర్యావరణ సమస్యల కారణంగా నేలపైకి లవణాలు ఎక్కువగా చేరటమే ఇందుకు కారణం.? ► వాన నీటి కోత కారణంగా సుమారు 11% భూమి ఎడారిగా మారుతున్నది. ► అడవుల నరికివేత, పోడు వ్యవసాయం, చెట్టు చేమను అతిగా కొట్టివేయటం వంటి పనుల వల్ల సుమారు 9 శాతం భూమి ఎడారిగా మారుతున్నది. ► తీవ్రమైన గాలుల వల్ల భూమి పైపొర గాలికి కొట్టుకుపోవటం, ఇసుక తెన్నెలు ఇతర ప్రాంతాల్లోకి వచ్చి పడటం వల్ల సుమారు 5.55% భూమి జీవాన్ని కోల్పోతున్నది. ► పచ్చని పంట భూములను విచక్షణారహితంగా నివాసప్రాంతాలుగా మార్చటం, గనుల తవ్వకానికి వాడటం వల్ల సుమారు 1% భూమి సాగుకు దూరమవుతున్నది. ఇతర కారణాలతో మరో 2% భూమి ఎడారి అవుతున్నది. ► 2030 నాటికి కొత్తగా సెంటు భూమి కూడా ఎడారిగా మారకుండా చేయగలగాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా నిర్దేశించింది. అయినా.. దీన్ని అడ్డుకోవటంలో దేశాలు విఫలమవుతుండటం విషాదకర వాస్తవం. ► యుద్ధప్రాతిపదికన ప్రతి పొలంలో 50 మీటర్లకు ఒక చోట వాలుకు అడ్డంగా కందకాలు తవ్వటం.. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను, మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రోత్సహించటం ద్వారా ఎడారీకరణను, నీటి కరువును 5 ఏళ్లలో అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. – సాగుబడి డెస్క్ -
చౌడు భూమిలో ఎడారి పంట
♦ ఖర్జూరం సాగులో రాణిస్తున్న నల్లగొండ జిల్లా రైతు ♦ పంట చేతికొచ్చిన తొలి ఏడాదే ఎకరాకు రూ. 2 లక్షల ఆదాయం ముళ్ల చెట్లు పెరిగిన చౌడు భూమిలో ఎడారి పంటగా పేరు పొందిన ఖర్జూరను సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నారు బండారి వెంకట నారాయణ. నల్లగొండ జిల్లా.. నల్లగొండ రూరల్ మండలం నర్సింగ్ బట్ల ఆయన స్వగ్రామం. 2011లో రెండెకరాల చౌడు భూమిని కొనుగోలు చేశారు. అందులో ఉన్న ముళ్ల చెట్లను తొలగించి సాగు యోగ్యంగా మార్చారు. చౌడు భూమిలో సాగు చేసేందుకు అనువైన పంటల కోసం అన్వేషించే క్రమంలో ఈ భూమిలో ఈత చెట్లు ఎక్కువగా ఉండటాన్ని గమనించి ఖర్జూరను సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందని ఆయన భావించారు. మొక్క ధర రూ. 3 వేలు దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్న టిష్యూకల్చర్ ఖర్జూర మొక్కలను గుజరాత్ నర్సరీల్లో పెంచుతున్నారు. వెంకట నారాయణ గుజరాత్ వెళ్లి ఖర్జూర నర్సరీలను పరిశీలించారు. ఒక్కో ఖర్జూర మొక్క రూ. 3100 చొప్పున కొనుగోలు చేశారు. ఒక్కో మొక్కకు రవాణాకు రూ. 400 వరకు ఖర్చయింది. 2012 మార్చిలో రెండడుగుల గుంతలు తీసి మొక్కలు నాటుకున్నారు. చౌడు భూమి కావటంతో గుంతల్లో ఎర్రమట్టి పోశారు. పాదుల మధ్య 25 అడుగుల ఎడం ఉండేలా ఎకరాకు 60–70 మొక్కలు నాటుకున్నారు. బోరు నీటిని డ్రిప్పు ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. పరపరాగ సంపర్కం జరిగేందుకు ఎకరాకు 5 మగ ఖర్జూర చెట్లను నాటారు. వీటి నుంచి వచ్చే కాయలను సేకరించి పొడిగా చేస్తారు. ఈ పొడిని ఎకరంలోని ఆడ ఖర్జూర చెట్లకు వచ్చే గెలలపై చల్లుతారు. అయితే మగ చెట్లు 5 ఏళ్ల వయసులోనే గెలలు వేస్తాయి. దీంతో తొలి ఏడాది గుజరాత్ నుంచి పౌడర్ కొనుగోలు చేసి వాడారు. దీని ధర కిలో రూ. 10 వేలు. ఎకరాకు అరకిలో పౌడర్ సరిపోతుంది. ఖర్జూర చెట్ల నుంచి కల్లును సేకరించవచ్చు కానీ మొక్కల జీవిత కాలం తగ్గుతుంది. సాగు ఖర్చులు ఏడాదికి ఎకరాకు రూ. 10 వేలు ఏడాదికి ఐదు సార్లు ఎరువులు వేశారు. శిలీంద్రాలు, కుమ్మ పురుగు ఆశించకుండా పురుగు మందులు, తెగుళ్ల మందులు నెలకోసారి పిచికారీ చేశారు. వీటన్నింటికి ఏడాదికి ఎకరాకు రూ. 10 వేల వరకు ఖర్చయింది. చిలకలు, ఉడుతలు కాయలను తినకుండా గెలలకు ఉల్లి సంచులను కట్టారు. పంట చేతికొచ్చేవరకు ఎకరాకు రూ. 2.50 లక్షల ఖర్చయిందని నారాయణ తెలిపారు. 2016 మార్చిలో చెట్లకు పూత వచ్చింది. జూలైలో దిగుబడి వచ్చింది. తొలి ఏడాది 40 చెట్లకు మాత్రమే పంట వచ్చింది. చెట్టుకు 20 కిలోల చొప్పున దిగుబడి తీశారు. మార్కెట్లో ధర తక్కువగా లభిస్తుండటంతో కిలో రూ. 150 చొప్పున ఇంటివద్దనే విక్రయించారు. తొలి ఏడాది 14 క్వింటాళ్లకు రూ. 2 లక్షల ఆదాయం లభించింది. ఎండు ఖర్జూరంగా మార్చటానికి ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులో లేకపోవటం వల్ల కోసిన నాలుగు ఐదు రోజుల్లో పంటను అమ్ముకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడే విక్రయించారు. ఈ ఏడాది జూలైలో మళ్లీ పంట చేతికొస్తుంది. ఈసారి అన్ని చెట్ల నుంచి పంట రావటంతో పాటు దిగుబడి పెరుగుతుందని వెంకట నారాయణ తెలిపారు. 10 ఏళ్లు తిరిగేసరికి చెట్టుకు క్వింటాన్నర దిగుబడి వస్తుందన్నారు. – కుంభం వెంకటేశ్వర్లు గౌడ్, సాక్షి, నల్లగొండ రూరల్