-
6000 కి.మీ ఎగురుతూ ఛత్తీస్గఢ్కు అరుదైన పక్షి!
పక్షి ప్రేమికులు సంబరపడే వార్త ఇది. కెనడా, అమెరికాలకు ఆనుకుని ఉన్న మధ్యధరా సముద్ర ప్రాంతాల్లో కనిపించే వింబ్రెల్ పక్షి తాజాగా ఛత్తీస్గఢ్లోని ఖైరాఘర్ జిల్లాకు తరలివచ్చింది. ఇది దాదాపు ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చింది.ఈ పక్షి మొదటిసారిగా ఈ ప్రాంతంలో కనిపించింది. దీనిని చూసేందుకు అటవీశాఖ సిబ్బందితో పాటు సామాన్యులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వింబ్రల్ పక్షి ఖైరాఘర్ జిల్లా మొహభట్టా గ్రామానికి తరలివచ్చింది. దాని శరీరంపై రేడియో కాలర్ అమర్చారు. ఈ కాలర్ అంచనా ధర రూ.10 లక్షలని తెలుస్తోంది. ఆ పక్షి వెనుక భాగంలో సోలార్ జీపీఎస్ కాలర్ కూడా ఉంది. దీని ద్వారా అది ఎంత దూరం ఎగురుతూ ఇక్కడకు చేరిందో తెలుస్తుంది.ఈ కాలర్ను ఆ పక్షికి 2023 నవంబర్ 16న ఒక ద్వీపంలో అమర్చారు. ఆ పక్షి దాదాపు 6 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని దీని ద్వారా తెలుస్తోంది. ఆ పక్షి పాకిస్తాన్ మీదుగా ఛత్తీస్గఢ్లోని ఖైరాగఢ్కు చేరుకుంది. దీవి నుంచి బయలుదేరిన ఆ పక్షి అరేబియా సముద్రానికి చేరుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్కు చేరుకుని, అక్కడ నాలుగు రోజుల పాటు మకాం వేసింది.ఈ పక్షి భారత తీరంలో 10 రోజులు ఉండి, తరువాత ఖైరాఘర్ జిల్లాలోని మొహభట్టా గ్రామానికి చేరుకుంది. ఇక్కడ ఈ పక్షి నీటిలో ఉల్లాసంగా తిరుగుతూ కనిపిస్తోంది. గత మూడు రోజులుగా ఈ పక్షి ఇక్కడే ఉంటోంది. ఈ పక్షి రెండు కాళ్లపై ఆకుపచ్చ, పసుపు రంగుల జెండాలు ఉన్నాయి. యూరప్లోని ఒక సంస్థ ఈ పక్షిని పర్యవేక్షిస్తున్నదని సమాచారం. వింబ్రల్ పక్షి రాకపై తమకు సమాచారం అందిందని ఖైరాగఢ్ డీఎఫ్ఓ అమిత్ తివారీ తెలిపారు. సాధారణంగా ఈ పక్షి మధ్యధరా సముద్ర తీరంలో నివసిస్తుంది. ఇది సంతానోత్పత్తి కోసం వివిధ ప్రదేశాలను వెతుకుతూ ఉంటుంది. -
చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
దుమ్ముగూడెం: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని కబిర్ధామ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పికప్ వ్యాన్ అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గాయాలపాలయ్యారు. మృతుల్లో 18 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. కభీర్దామ్ జిల్లాలోని సెమ్హరా గ్రామానికి చెందిన గిరిజనులు తునికాకు సేకరణ కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్ కుక్దూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బహపానీ గ్రామ సమీపంలో బంజారి ఘాట్లో అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడింది. -
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. 12 మంది నక్సల్స్ మృతి
చర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో శుక్రవారం మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గంగలూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ సాగిస్తున్న భద్రతా బలగాలపై నక్సల్స్ కాల్పులకు దిగారు. ఇరువురి నడుమ ఎదురుకాల్పులు గంటలపాటు కొనసాగాయి. కాల్పుల అనంతరం ఘటనా ప్రాంతంలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఎం విష్ణుదేవ్ సాయ్ తెలిపారు. అదేసమయంలో, మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఒక బారెల్ గ్రెనేడ్ లాంఛర్, 12 బోర్ గన్, దేశవాళీ రైఫిల్, భారీగా పేలుడు పదార్థాలు లభించాయన్నారు. ఏప్రిల్ 16, 30వ తేదీల్లో చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు చనిపోవడం తెల్సిందే. బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాదిలో వివిధ ఎన్కౌంటర్లలో103 మంది నక్సల్స్ చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్
భువనేశ్వర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం. మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఘటన జరిగిన ప్రాంతం గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందిఘటనా స్థలం నుంచి హతమైన నక్సలైట్ల మృతదేహాలు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైన ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. ఈ నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లో మూడు జిల్లాల నుంచి భద్రతా బలగాలు పాల్గొన్నాయి.బీజాపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాల నుంచి సుమారు 1200 మంది DRG, STF, COBRA, CRPF సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు సమాచారం. అగ్రశ్రేణి నక్సల్స్ నేతలు ఉన్నారన్న సూచనతో ఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బస్తర్ ఐజీ, మూడు జిల్లాల డీఐజీ, ఎస్పీలు ఎన్కౌంటర్పై నిఘా పెట్టారు. -
Lok sabha elections 2024: ఇస్తినమ్మా తాంబూలం.. వస్తినమ్మా ఓటింగ్కు!
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా వినూత్నమైన కార్యక్రమాలెన్నో జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో బలరామ్పూర్ జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాలు చేసిన ‘సంప్రదాయ’ కృషి వీటన్నింట్లో ఎంతో ఆసక్తికరం. మూడో దశలో భాగంగా ఈ నెల 7న రాష్ట్రంలో ఏడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. బలరామ్పూర్ జిల్లాలోని సర్గూజా లోక్సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు చింతాకులు, అక్షితలు అందించారు. తప్పకుండా ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్థానిక సంప్రదాయాలను ఇలా వినూత్నంగా వాడుకున్న తీరు అందరినీ ఆకర్షించింది. ‘చింతాకులు, అక్షితలు అందించడం మా సంస్కృతిలో భాగం. పెళ్లిళ్లకు, మా సంఘం కార్యక్రమానికి ఇలాగే ఆహా్వనిస్తాం. అదే పద్ధతిలో విధిగా ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాం. దీనికి స్పందన కూడా చాలా బాగా వచి్చంది’’ అని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యురాలు విమలా సింగ్ హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించినట్టు జిల్లా నోడల్ అధికారి రైనా జమీల్ పేర్కొన్నారు. ఓటర్లను ఇలా వినూత్నంగా పోలింగ్ బూత్లకు తరలాల్సిందిగా కోరిన తీరు పొరుగు రాష్ట్రాలైన జార్ఖండ్, ఒడిశాలను కూడా ఆకట్టుకుంది. ఆ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం మే 13న నాలుగు విడతలో మొదలై జూన్ 1న ఏడో విడత దాకా కొనసాగనుంది. అక్కడ కూడా ఇలా ఓటర్లను సంప్రదాయ పద్ధతిలో ఓటేసేందుకు ఆహా్వనించాలని పలు జిల్లాల ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు కూడా చేస్తున్నారట!– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ బూత్లో 9 గంటలకే 100 శాతం పోలింగ్!
ఈరోజు (మంగళవారం) దేశంలో లోకసభ ఎన్నికల మూడో దశ పోలింగ్ జరుగుతోంది. అయితే ఒక పోలింగ్ బూత్లో ఉదయం 9 గంటలకే వందశాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇది వినేందుకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ పోలింగ్ కేంద్రం ఛత్తీస్గఢ్లో ఉంది.వివరాల్లోకి వెళితే ఛత్తీస్గఢ్లోని షెర్దాండ్ పోలింగ్ స్టేషన్ నంబర్ 143లో మొత్తం ఐదుగురు ఓటర్లు తమ ఓటు వేశారు. దీంతో ఇక్కడ 100 శాతం పోలింగ్ పూర్తయ్యింది. ఎంపీని ఎన్నుకునేందుకు వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.షెర్దాండ్ పోలింగ్ కేంద్రం కొరియా జిల్లాలోని సోన్హట్ జన్పాడ్ పంచాయతీ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉంది. ఐదుగురు ఓటర్ల కోసం ఇక్కడ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓటింగ్ సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండగా, ఉదయం 9కే 100 శాతం ఓటింగ్ నమోదయ్యింది. జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కుమార్ లాంగే, సీఈవో డాక్టర్ అశుతోష్ చతుర్వేది, అదనపు కలెక్టర్ అరుణ్ మార్కం, ఎస్డీఎం రాకేష్ సాహు తదితర జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఈ ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఈ ఓటర్లకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కుమార్ లాంగే కృతజ్ఞతలు తెలిపారు.వనాంచల్ ప్రాంతంలోని షెర్దాండ్లో మొత్తం ఐదుగురు ఓటర్లు ఉన్నారు. ఈ ఐదుగురు ఓటర్లలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు. ఈ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడికి చేరుకోవడానికి పక్కా రోడ్లు లేవు. గ్రామపంచాయతీ చందా నుంచి పోలింగ్ పార్టీలు ట్రాక్టర్లలో పోలింగ్ కేంద్రానికి చేరుకుని, ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాయి. -
ఓటుకు సిద్ధం.. 100 ఏళ్లు దాటిన 2,000 మంది ఓటర్లు!
ఛత్తీస్గఢ్లో నేడు (మంగళవారం) లోక్సభ ఎన్నికల మూడో విడతలో ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఒక కోటీ 39 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనుండగా, వారిలో 2,174 మంది 100 ఏళ్లు దాటిన వారే కావడం విశేషం. రాష్ట్రంలో మొదటి సారి ఓటు వేయబోయేవారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలు. రాష్ట్రంలోని సుర్గుజా, రాయ్గఢ్, జాంజ్గిర్-చంపా, కోర్బా, బిలాస్పూర్, దుర్గ్, రాయ్పూర్లలో ఓటింగ్ జరగనుంది. ఈ ఏడు స్థానాల్లో మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో మహిళా అభ్యర్థుల సంఖ్య 26.పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద డ్రింకింగ్ వాటర్, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. క్యూలో నిలుచునే ఓటర్లకు నీడను కల్పించారు. వెయిటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన మందులతో పాటు మెడికల్ కిట్ కూడా అందుబాటులో ఉంచారు.రాష్టంలోని ఏడు స్థానాలకు నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మూడో దశలో 26 మంది మహిళలతో సహా మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. రాయ్పూర్లో అత్యధికంగా 38 మంది, బిలాస్పూర్లో 37 మంది, కోర్బాలో 27 మంది, దుర్గ్లో 25 మంది, జాంజ్గిర్-చంపాలో 18 మంది, రాయ్గఢ్లో 13 మంది, సుర్గుజాలో 10 మంది అభ్యర్థులు ఉన్నారని ఆయన చెప్పారు. ఏడు నియోజకవర్గాల్లో 15,701 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 25 పోలింగ్ కేంద్రాలను హైపర్ సెన్సిటివ్గా, 1072 పోలింగ్ కేంద్రాలను సెన్సిటివ్గా వర్గీకరించారు. -
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఒంటరి పోరుతో పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమత ఇప్పుడు బీజేపీ నుంచి రాష్ట్రంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. మూడో విడతలో భాగంగా అక్కడ నాలుగు లోక్సభ స్థానాలకు, బీజేపీ పాలిత ఛత్తీస్గఢ్లో ఏడింటికి, అసోంలో నాలుగింటికి మంగళవారం పోలింగ్ జరగనుంది. వాటిల్లో కీలక స్థానాలను ఓసారి చూస్తే... జాంగీపూర్ (పశి్చమ బెంగాల్) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. 2019లో బీజేపీ అభ్యర్థి మఫుజా ఖాతూన్పై తృణమూల్ కాంగ్రెస్ నేత ఖలీలుర్ రెహమాన్ 2.4 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారీ ఆయనే పోటీలో ఉన్నారు. బీజేపీ ధనుంజయ్ ఘోష్కు టికెటివ్వగా కాంగ్రెస్ ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ను పక్కన పెట్టి మొర్తజా హుస్సేన్ను పోటీకి దింపింది. దాంతో ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది.దక్షిణ మాల్డా (పశి్చమ బెంగాల్) ఉత్తర మాల్డాతో పాటు ఈ స్థానం కూడా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. జమిందారీ కుటుంబీకుడు ఘనీఖాన్ చౌదరి హవా నడిచేది. రెండు దశాబ్దాలు మాల్డా రాజకీయాలను శాసించిన ఆయన మరణానంతరం పరిస్థితి మారింది. ముస్లిం ప్రాబల్య స్థానమైన దక్షిణ మాల్డాలో ముక్కోణపు పోటీ నెలకొంది. 2009, 2014, 2019ల్లో ఘనీఖాన్ సోదరుడు అబూ హసీం ఖాన్ కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈసారి ఆయన కుమారుడు ఇషా ఖాన్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి శ్రీరూప మిత్ర చౌదరి, టీఎంసీ తరఫున షానవాజ్ అలీ రెహమాన్ పోటీ చేస్తున్నారు.ఉత్తర మాల్డా (పశి్చమ బెంగాల్) ఇక్కడి ఓటర్లలో చైతన్యం ఎక్కువ. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి ఖగేన్ ముర్ముకు తృణమూల్ నుంచి బరిలో దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రసూన్ బెనర్జీ గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ముస్తాక్ ఆలం బరిలో ఉన్నారు. ఇక్కడ 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై గెలిచిన మౌసమ్ నూర్ 2019లో తృణమూల్ నుంచి పోటీ చేశారు. ఖగేన్ చేతిలో 1.85 లక్షల ఓట్ల తేడాతో ఓడారు. ఇక్కడా ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది.మాధేపుర (బిహార్) మండల్ కమిషన్ చైర్మన్ బిందేశ్వరీ ప్రసాద్ మండల్, జేడీ(యూ) దిగ్గజం శరద్ యాదవ్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ వంటి రాజకీయ ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన స్థానమిది. ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి నుంచి ప్రొఫెసర్ కుమార్ చంద్రదీప్ యాదవ్ పోటీలో ఉన్నారు. జేడీ(యూ) నుంచి సిట్టింగ్ ఎంపీ దినేశ్ చంద్ర యాదవ్ మరోసారి పోటీకి నిలబడ్డారు.అరారియా (బిహార్) బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రదీప్కుమార్ సింగ్ బరిలో ఉన్నారు. 2019లో ఆయన చేతిలో 1.37 లక్షల ఓట్ల తేడాతో ఓడిన మహమ్మద్ సర్ఫరాజ్ ఆలంకే ఆర్జేడీ మళ్లీ టికెటి చి్చంది. ఇద్దరు బలమైన స్వతంత్ర అభ్యర్థులూ బరిలో ఉన్నారు.గువాహటి (అసోం) ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ రెండూ మహిళలకే టికెటిచ్చాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ క్వీన్ ఓజాను కాదని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు బిజూలి కలిత మేధిను బరిలో దింపింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బీరా బోర్తకుమార్ గోస్వామి పూర్వాశ్రమంలో బీజేపీ నేతే! పర్వత, మారుమూల ప్రాంతాల్లోనూ ఆమె సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగం, వరదలు, తాగునీరు ఇక్కడి సమస్యలు. డుబ్రి (అసోం) ఈ లోక్సభ స్థానం ఏకంగా 142 కిలోమీటర్ల మేర బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటోంది. బ్రహ్మపుత్ర పొంగినప్పుడల్లా ఇక్కడి ప్రజలకు కష్టాలు తప్పవు. వరదలు, పేదరికం, బాల్య వివాహాలు ప్రధాన సమస్యలు. ముస్లింలు ఏకంగా 80 శాతమున్నారు. దాంతో వారి ఓట్లే ఫలితాన్ని నిర్దేశిస్తుంటాయి. ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ ఇక్కడ వరుసగా నాలుగోసారి గెలిచేందుకు శ్రమిస్తున్నారు. బీజేపీ మిత్రపక్షం ఏజీపీ నుంచి జబేద్ ఇస్లాం, కాంగ్రెస్ నుంచి రకీబుల్ హుస్సేన్ పోటీలో ఉన్నారు. రాయ్గఢ్ (ఛత్తీస్గఢ్) ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి 1999 నుంచి 2014 దాకా ఇక్కడినుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. పైగా ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కూడా రాయ్గఢ్ లోక్సభ స్థానం పరిధిలోనే ఉంది. దాంతో ఇక్కడ బీజేపీని గెలిపించుకోవడం సీఎంకు ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ నుంచి రాధేశ్యామ్ రతియా, కాంగ్రెస్ నుంచి మేనకాదేవి సింగ్ పోటీ చేస్తున్నారు. గోండ్ రాజ కుటుంబ వారసురాలైన మేనకాదేవి డాక్టర్ కూడా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
రాయ్పూర్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి మాత్రం రోజురోజుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు పార్టీలకు రాజీనామా చేయటం తీవ్ర తలనొప్పిగా మారింది.తాజాగా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నేత రాధికా ఖేరా కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు.‘‘అయోధ్యలోని రామమందిరం సందర్శించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చాలా తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నా. ఎన్ఎస్యూఐ నుంచి కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగానికి 22 ఏళ్లుగా నా జీవితం అంకితం చేశా. పార్టీకి చాలా నిజాయితీగా పని చేశా. కానీ, నేను అయోధ్య రామ మందిరానికి మద్దతు తెలిపటం కారణంగా పార్టీలో చాలా వ్యతిరేకతను అనుభవించా. నేను ఒక మహిళను. న్యాయం కోసం, దేశం కోసం పోరాడుతా. కానీ, కాంగ్రెస్ పార్టీలో పోరాడటంలో ఓడిపోయా. ఒక రామ భక్తురాలిగా నేను చాలా బాధించబడ్డాను’’ అని రాధికా ఖేరా తెలిపారు. -
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
ఛత్తీస్గఢ్లో లోక్సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ మే 7న జరగనుంది. రాష్ట్రంలోని రాయ్పూర్, దుర్గ్, బిలాస్పూర్, జాంజ్గిర్-చంపా, కోర్బా, రాయ్గఢ్, సుర్గుజా మొదలైన ఏడు లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతాల్లో మే 5 నుండి 7 వరకు డ్రై డేగా ప్రకటించారు. అంటే ఈ రెండు రోజూలూ ఈ లోక్సభ నియోజకవర్గాల్లో మద్యం విక్రయాలు ఉండవు. డ్రై డేకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఓటింగ్కు 48 గంటల ముందు సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలను మూసివేస్తారు. అంతే కాదు మద్యం రవాణాను కూడా నిషేధించారు. ఈ సమయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాయ్పూర్, దుర్గ్, బిలాస్పూర్, జాంజ్గిర్-చంపా, కోర్బా, రాయ్గఢ్, సుర్గుజా లోక్సభ నియోజకవర్గాల్లో మే 5 నుండి మే 7 వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఈ లోక్సభ నియోజకవర్గాలకు మూడు కిలోమీటర్ల పరిధిలోగల అన్ని మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఎవరైనా మద్యం దుకాణాన్ని తెరిచి, విక్రయాలు సాగిస్తున్నారని తేలితే సంబంధిత అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. -
జయహో జోయా
‘ఈ ప్రపంచంలో గొప్ప వృత్తులు ఏమిటి?’ అని చిన్నప్పుడు తండ్రిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం జోయా మీర్జా మనసులో ముద్రించుకుపోయింది. ఆ తరువాత కలగా మారింది. కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పరాజయం పలకరించింది. నిరాశలో రెండడుగులు వెనక్కి వేసినా ఆ తరువాత మాత్రం ఆత్మవిశ్వాసం అనే ఇంధనంతో వేగంగా ముందడుగు వేసింది. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్గా ఎంపిక అయింది జోయా మీర్జా. చత్తీస్గఢ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది జోయా....కల కన్నప్పుడే విజయానికి దగ్గరవుతాం. ఏ కలా లేనప్పుడు ఏ విజయమూ ఉండదు. ఛత్తిస్గఢ్లోని దుర్గ్ జిల్లాకు చెందిన జోయా మీర్జా చిన్నప్పటి నుంచి పెద్ద కలలు కనేది. అయితే అవేమీ ఆకాశానికి నిచ్చెన వేయాలనుకునే కలలు కావు. ‘వైద్యురాలిగా సేవ అందించాలి, సైన్యంలో పనిచేయాలి’... ఇలా ఉండేవి ఆమె కలలు.కన్న కలలు కాలానికి నిలబడతాయనే గట్టి నిబంధన లేదు. అయితే గట్టి పట్టుదల ఉంటే కల నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు అని చెప్పడానికి స్ఫూర్తి... జోయా మీర్జా. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (ఏఎఫ్ఎంసీ)లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మీర్జా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్గా నియామకం కావడం ద్వారా తన కలను నిజం చేసుకుంది.అయితే జోయా మీర్జాది నల్లేరు మీద నడకేమీ కాదు. కుటుంబ ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉండేది. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా ‘ఇక చదివింది చాలు’ అనే మాట తల్లిదండ్రుల నుంచి ఎప్పుడూ రాలేదు. చదువు విషయంలో కుమార్తెను ఎప్పుడూ ్రపోత్సహించేవారు. జోయాను డాక్టర్గా చూడాలనేది అమ్మమ్మ కల.‘నీట్’ పరీక్షలో జోయాను ఫెయిల్యూర్ పలకరించింది. బాధపడుతూ కూర్చోకుండా ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో గ్రాడ్యుయేషన్ చేయడంపై దృష్టి పెట్టింది. ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని రాజస్థాన్లోని కోటాలో ‘నీట్’ కోసం కోచింగ్ తీసుకోవడానికి జోయా మీర్జాను తల్లిదండ్రులు ఒప్పించారు. కోచింగ్ కోసం అప్పులు చేశారు. ‘తల్లిదండ్రుల కోరిక మేరకు కోటాకు వెళ్లాను. అయితే ్రపాక్టీస్ ఎగ్జామ్స్లో ఇతర విద్యార్థులు నా కంటే మెరుగ్గా ఉన్నారనే విషయం తెలిసినప్పుడు నాలో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. నీట్ పరీక్షకు ఇరవై రోజుల ముందు అమ్మమ్మ తీవ్రమైన అనారోగ్య సమస్య వల్ల నేను ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆ తరువాత తిరిగి కోటాకు వచ్చాను. ఒకే ఒక్క ర్యాంకు తేడాతో సీటు సాధించే అవకాశాన్ని కోల్పోయాను’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది మీర్జా.తల్లిదండ్రులు మొదట నిరాశ పడినా ‘మరో ప్రయత్నం’ అంటూ కుమార్తెను కోచింగ్ కోసం భిలాయ్కు పంపించారు.‘భిలాయ్ కోచింగ్ సెంటర్లోని ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడంతోపాటు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. అది నాకు ఎంతగానో ఉపకరించింది’ అంటుంది మీర్జా. ఆ ఆత్మబలమే ‘నీట్’లో తగిన మార్కులు సాధించి ‘ఏఎఫ్ఎంసీ’ ఎంచుకునేలా చేసింది. పుణేలోని ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ’లో ఎంబీబీఎస్ చేసింది.‘గొప్ప వృత్తులు ఏమిటి?’ అని చిన్నప్పుడు తండ్రిని అడిగినప్పుడు... ‘సోల్జర్, డాక్టర్’ అని చేప్పేవాడు. లెఫ్టినెంట్ డాక్టర్గా ఆ రెండు గొప్ప వృత్తులలో పనిచేసే అవకాశం తన అదృష్టం అంటుంది జోయా మీర్జా.తన ఫస్ట్ పోస్టింగ్ జమ్మూలో.‘చదువుపై నాకు ఉన్న ఆసక్తిని గమనించి మా అమ్మమ్మ నన్ను డాక్టర్గా చూడాలనుకుంది. డాక్టర్గా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంది. దురదృష్టవశాత్తు ఆమె ఏడాది క్రితం చనిపోయింది. నన్ను యూనిఫామ్లో చూడలేకపోయింది’ అమ్మమ్మను తలుచుకుంటూ బాధగా అంటుంది మీర్జా.‘పరులకు సహాయం చేయాలనే తత్వం తనది. తన మనస్తత్వానికి సరిగ్గా సరిపోయే వృత్తి ఇది. మీర్జాకు ఎలాంటి సవాలైనా ఎదుర్కొనే శక్తి ఉంది’ అంటున్నాడు జోయా తండ్రి షమీమ్ మీర్జా. -
చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
చత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య మంగళవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కనీసం ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ కూడా ఉన్నారు. రాష్ట్రంలోని నారాయణ్పూర్, కాంకేర్ జిల్లాో సరిహద్దుల్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. కాగా 15 రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగడం ఇది రెండోసారి. సంఘటనా ప్రాంతం నుంచి ఒక ఏకే 47తోపాటు ఇతన భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ రీజియన్లో భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్జీ దళాలు సంయుక్తంగా నక్సల్ ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా దళాలు ఏడుగుర్ని మట్టుబెట్టాయి. -
ఓటేస్తే మజూరీలో రాయితీ
రాయ్పూర్: ఓటేస్తే రెస్టారెంట్లు డిస్కౌంట్ ఇవ్వడాన్ని నోయిడాలో చూశాం. బెంగళూరులో అయితే ఏకంగా ఫ్రీ బీర్ ప్రకటించారు! ఈ జాబితాలో తాజాగా ఛత్తీస్గఢ్ చేరింది. అయితే ఇందులో కాస్త వెరైటీ ఉంది! ఓటేసి వేలికి నీలి రంగు సిరా చూపిస్తే బంగారం తయారీ ధరలను (మజూరీ) తగ్గిస్తామని రాష్ట్ర వాణిజ్య మండలి ప్రకటించింది. దాంతోపాటు పలు ఇతర ఉత్పత్తులపైనా రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ సంస్థల నిర్వాహకులు కూడా ఇందుకు అంగీకరించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అమర్ పర్వానీ నేతృత్వంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ గౌరవ్ కుమార్ సింగ్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓటేసిన వారికి తమ ఉత్పత్తుల కొనుగోలుపై ఫర్నిచర్ అసోసియేషన్ 10 శాతం, టెక్స్టైల్ ట్రేడర్స్ అసోసియేషన్ 10 శాతం, రాయ్పూర్ ఆప్టికల్ అసోసియేషన్ 15 శాతం, ప్లైవుడ్ అసోసియేషన్ 5 శాతం, బులియన్ అసోసియేషన్ 15 శాతం రాయితీ ప్రకటించాయి. ఛత్తీస్గఢ్లో 11 లోక్సభ స్థానాలకు గాను ఏడింటికి మే 7న మూడో విడతలో పోలింగ్ జరగనుంది. -
ఏప్రిల్లోనే ఎండిపోయిన నది.. 25 వేల జనాభా విలవిల!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి విజృంభిస్తోంది. ఛత్తీస్గఢ్లోని రామానుజ్గంజ్ ప్రాంతంలోని 25 వేల జనాభాకు నీటిని అందించే కన్హర్ నది ఏప్రిల్లోనే ఎండిపోయింది. దీంతో నదిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అక్కడి జనాభాకు నగర పంచాయతీ నీటిని అందిస్తోంది. రామానుజ్గంజ్ ప్రాంతానికి సరిపడా తాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ కోట్లాది రూపాయలతో నదిపై ఆనకట్టను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అధికారుల అవినీతి కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఎంతకాలం ఎదురు చూసినా ఆనకట్ట నిర్మాణానికి నోచుకోకపోవడంతో రామానుజ్గంజ్వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆనకట్టను తొలగించి, నూతన నిర్మాణం చేపడితేనే నగరానికి సరిపడా నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.ఈ నది ఎండిపోవడంతో స్థానికులతో పాటు ఈ నదిపై ఆధారపడిన జంతువులు, పక్షులు సైతం విలవిలలాడిపోతున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం, నగరపంచాయతీ స్థానికులకు తాగు నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
ఆ ఐదు చోట్ల అమీతుమీ
పూర్ణియా (బిహార్) ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి సిట్టింగ్ ఎంపీ, జేడీ(యూ) నేత సంతోష్ కుమార్ కుశ్వాహా ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. విపక్ష ఇండియా కూటమి తరఫున ఆర్జేడీ నాయకురాలు బీమా భారతీ పోటీలో ఉన్నారు. ఆమె నెల క్రితమే జేడీ(యూ) నుంచి ఆర్జేడీలో చేరారు. కానీ బాహుబలి రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూయాదవ్ రంగప్రవేశంతో పోటీ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయింది. ఆయనపై లెక్కలేనన్ని హత్య, హత్యాయత్నం తదితర కేసులున్నాయి. ఐదుసార్లు లోక్సభ ఎంపీగా నెగ్గారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. 2015లో ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురయ్యాక జన్ అధికార్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. కాంగ్రెస్ టికెట్పై ఆశతో దాన్ని ఇటీవలే ఆ పార్టీలో విలీనం చేశారు. కానీ కూటమి సర్దుబాటులో ఆ సీటు ఆర్జేడీకి వెళ్లడంతో ఆగ్రహించి స్వతంత్రునిగా రంగంలోకి దిగి ప్రధాన పార్టీల అభ్యర్థులకు పెనుసవాలు విసురుతున్నారు. గతంలో కూడా ఆయన స్వతంత్రునిగా నెగ్గడం విశేషం. సంతోష్ కుమార్పై ఓటర్లలో అసంతృప్తి, వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. పైగా జేడీ(యూ) మాజీ నేత అయిన బీమా భారతీ కూడా ఆ పార్టీ ఓట్లను బాగానే చీల్చేలా కన్పిస్తున్నారు. ప్రణామ్ పూర్ణియా పేరిట పప్పూయాదవ్ చేస్తున్న ప్రచారానికి భారీ స్పందన లభిస్తుండటం విశేషం! రాజ్నంద్గావ్ (ఛత్తీస్గఢ్) ఈ స్థానం బీజేపీకి కంచుకోట. ఈసారి దాన్ని ఎలాగైనా బద్దలు కొట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందులో భాగంగా తాజా మాజీ సీఎం భూపేశ్ బఘెల్ను బరిలో దింపింది. అయితే, కాకాగా ప్రసిద్ధుడైన ఆయన బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నిజానికి సీఎంగా ఈ ప్రాంతాన్ని బఘెల్ ఎంతగానో అభివృద్ధి చేశారు. పైగా ఈ లోక్సభ స్థానం పరిధిలోని 8 అసెంబ్లీ సీట్లలో ఏకంగా ఐదు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. అయినా ఈసారి కూడా ఇక్కడ బీజేపీదే విజయమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ సంతోష్ పాండే ఈసారి కూడా విజయంపై ధీమాగా ఉన్నారు. 2000లో రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి ఒక్కసారి మినహా ఇక్కడ కాషాయ జెండాయే ఎగిరింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో ఇక్కడ గెలుపు బఘెల్కు తప్పనిసరిగా మారింది. దాంతో ఈ పోరును ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. నిత్యం ఓటర్లను కలుస్తూ ఓట్లడుగుతున్నారు. కాకపోతే మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం ఆరోపణలు ఆయన అవకాశాలకు మరింతగా గండికొట్టేలా కన్పిస్తున్నాయి. ఇక్కడి ఓటర్లలో ఆదివాసీలు ఏకంగా 35 శాతం, ఓబీసీలు 30 శాతమున్నారు. నాందేడ్ (మహారాష్ట్ర) ఈ లోక్సభ స్థానం కొన్నాళ్ల క్రితం దాకా కాంగ్రెస్కు పెట్టని కోట. కానీ ఆ పార్టీ అగ్ర నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ ఇటీవల బీజేపీలో చేరడంతో ఇక్కడ సమీకరణాలు పూర్తిగా మారాయి. దానికి తోడు గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పాగా వేసింది. అయితే సిట్టింగ్ బీజేపీ ఎంపీ ప్రతాప్రావ్ గోవిందరావ్ పాటిల్ చికలీకర్కు ఇండియా కూటమి తరఫున వసంత్ చవాన్ ఈసారి గట్టి పోటీ ఇస్తున్నారు. దీనికి తోడు ప్రకాశ్ అంబేడ్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాఢీ (వీబీఏ) కూడా బరిలో ఉండటంతో ముక్కోణపు పోరు నెలకొంది. ఈ సెగ్మెంట్లో సంఖ్యాధికులైన ఓబీసీలు బీజేపీకి గట్టి ఓటు బ్యాంకు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన వీబీఏ అభ్యర్థి అవినాశ్ భోసికర్ బీజేపీ ఓట్లను చీలుస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చికలీకర్ను గెలిపించుకోవాల్సిన బాధ్యతను పార్టీ నాయకత్వం అశోక్ చవాన్పై ఉంచింది. దాంతో ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వీబీఏ అభ్యర్థి బీజేపీ వ్యతిరేక ఓట్లనే చీల్చి చికిలీకర్ విజయాన్ని సునాయాసం చేస్తారని చవాన్ చెబుతున్నారు. అమరావతి (మహారాష్ట్ర) రాష్ట్రంలో అత్యంత హోరాహోరీ పోరు నెలకొన్న స్థానాల్లో ఇదొకటి. సిట్టింగ్ ఎంపీ, సినీ నటి నవ్నీత్ కౌర్ రాణా ఈసారి బీజేపీ టికెట్పై బరిలో ఉన్నారు. ఆమె 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ దన్నుతో ఇండిపెండెంట్గా పోటీ చేసి కేంద్ర మాజీ మంత్రి ఆనంద్రావ్ అడ్సుల్పై నెగ్గి తొలిసారి లోక్సభలో ప్రవేశించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి మాత్రం ఎదురీదుతున్నారు. ఎందుకంటే ఆమెకు టికెటివ్వడంపై స్థానిక బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇది చాలదన్నట్టు ఎన్డీఏ స్థానిక భాగస్వామి ప్రహార్ పార్టీ రాణా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ పార్టీ తరఫున దినేశ్ బూబ్ను పోటీకి నిలిపింది! దీనికి తోడు మహావికాస్ అఘాఢీ కూటమి తరఫున బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వంత్ వాంఖడేకు నియోజకవర్గమంతటా మంచి పేరుంది. పైగా ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లలో మూడు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. అయితే వంచిత్ బహుజన్ పార్టీ నుంచి బరిలో ఉన్న అంబేడ్కర్ మనవడు ఆనంద్రాజ్ అంబేడ్కర్ కాంగ్రెస్ ఓట్లను భారీగా చీలుస్తారని భావిస్తున్నారు. ఇది రాణాకు బాగా కలిసొచ్చే అంశం. బాలూర్ఘాట్ (పశ్చిమబెంగాల్) పశ్చిమబెంగాల్లో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ నడుమ హోరాహోరీ పోటీ నెలకొన్న లోక్సభ స్థానాల్లో బాలూర్ఘాట్ ముఖ్యమైనది. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ సుకాంత మజుందార్ పోటీ చేస్తున్నారు. 2019లో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో భారీగా సీట్లను గెలుచుకోవడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి అర్పితా ఘోష్పై సుకాంత భారీ మెజారిటీతో నెగ్గారు. దాంతో ఈసారి బాలూర్ఘాట్ను తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుకాంతను ఎలాగైనా ఓడించి తీరాలని పట్టుదలగా ఉన్నారు. రాష్ట్ర మంత్రి విప్లవ్ మిత్రాను మమత బరిలో దించడంతో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. అయినా సుకాంత మాత్రం బాలూర్ఘాట్తో పాటు బెంగాల్ మొత్తాన్నీ మోదీ వేవ్లో బీజేపీ క్లీన్స్వీప్ చేస్తుందంటున్నారు. ఈసారి కూడా తనకు భారీ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తృణమూల్ నేతల అంతులేని అవినీతి, సందేశ్ఖాలీలో మహిళలపై వారి అకృత్యాలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని చెబుతున్నారు. మీరట్ (ఉత్తరప్రదేశ్) ‘టీవీ రాముడు’ అరుణ్ గోవిల్ పోటీతో ఈ లోక్సభ స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దూరదర్శన్లో సీరియల్గా వచ్చిన రామాయణంలో రాముని పాత్ర పోషించిన ఆయన దేశవ్యాప్త క్రేజ్ సంపాదించారు. బీజేపీ ఆయనను అనూహ్యంగా పార్టీలో చేర్చుకోవడమే గాక మీరట్ టికెట్ కూడా ఇచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు గాను బీజేపీ 62 చోట్ల నెగ్గడం తెలిసిందే. ఈసారి దేశవ్యాప్తంగా సొంతంగా 370 లోక్సభ స్థానాల లక్ష్యాన్ని సాధించాలంటే యూపీలో క్లీన్స్వీప్ చేయడం తప్పనిసరని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మీరట్ పరిసరాల్లోని పలు లోక్సభ స్థానాల్లో గోవిల్ ప్రభావం చూపుతారన్న అంచనాతో ఆయన్ను బరిలోకి దింపింది. సమాజ్వాదీ నుంచి సునీతా వర్మ, బీఎస్పీ నుంచి దేవవ్రత్ కుమార్ త్యాగీ ఆయనకు ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు. -
Chhattisgarh Encounter: ఎన్కౌంటర్ మృతుల్లో చిన్నన్న లేడు
ఆత్మకూరు రూరల్ (నంద్యాల జిల్లా) / సాక్షి ప్రతినిధి, వరంగల్: ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన 29 మంది మావోయిస్టుల్లో ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు అలియాస్ నాగన్న అలియాస్ విజయ్ లేరని బస్తర్ ఐజీ సుందర్రాజ్, కాంకేర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంద్ర కళ్యాణ్ ఎల్లిసెల వెల్లడించారు. బుధవారం రాత్రి వరకు 8 మంది మావోయిస్టులను గుర్తించామన్నారు. మృతుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్ సిరిపల్లె సుధాకర్ అలియాస్ మురళి, అలియాస్ శంకర్, ఆయన భార్య ఉన్నారని చెప్పారు. ఈ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారని, వారిలో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారని చెప్పారు. ఘటన స్థలంలో ఏకే–47, ఎల్ఎంజీ, ఇన్సాస్ లాంటి అత్యాధునిక ఆయుధాలను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుల్లో చిన్నన్న లేడని ధ్రువీకరించిన సోదరులు ఈ ఎన్కౌంటర్లో సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నట్లు పోలీసులు తొలుత భావించారు. అయితే నంద్యాల పోలీసులు చూపించిన ఎన్కౌంటర్ మృతుల ఫొటోల్లో చిన్నన్న లేడని ఆయన సోదరులు ధ్రువీకరించారు. సుగులూరి చిన్నన్న 1996లో అప్పటి పీపుల్స్వార్లో పూర్తికాల సభ్యుడిగా చేరారు. తొలుత కర్నూలు జిల్లాలో అప్పటి భవనాసిదళం సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. 2006 తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలోకి వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాజ్నంద్గావ్ – కాంకేర్ డివిజన్ కార్యదర్శిగా విజయ్ పేరుతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గుర్తించిన మృతులు 1. సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ రావు, మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్ 2. దాశశ్వర్ సుమన అలియాస్ రజిత, డీసీఎస్, సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ భార్య, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు 3. లలిత, డీవీసీ మెంబర్, జన తన సర్కార్ కమిటీ ఇన్చార్జి 4. మాధవి, నార్త్ బస్తర్ మెంబర్ 5. జగ్ను అలియాస్ మాలతి, పర్థాపూర్ ఏరియా కమిటీ 6. రాజు సలామ్ అలియాస్ సుఖాల్, పర్తాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 7. వెల సోను అలియాస్ శ్రీకాంత్ సోను, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 8. రాణిత అలియాస్ జయమతి, రూపి, ప్రాగ్ ఎల్వోసీ కమాండర్ 9. రామ్ షీలా, నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్ -
పక్కా సమాచారం.. పకడ్బందీ వ్యూహం
మృతి చెందిన మావోయిస్టుల్లో గుర్తించింది వీరినే.. 1. సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ రావు (మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్), డీవీసీ మెంబర్, నార్త్ బస్తర్ మాస్ ఇన్చార్జి, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె 2. దాశశ్వర్ సుమన అలియాస్ రజిత, డీసీఎస్, సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ భార్య, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు 3. లలిత, డీవీసీ మెంబర్, జన తన సర్కార్ కమిటీ ఇన్చార్జి 4. మాధవి, నార్త్ బస్తర్ మెంబర్ 5. జగ్ను అలియాస్ మాలతి, పర్థాపూర్ ఏరియా కమిటీ 6. రాజు సలామ్ అలియాస్ సుఖాల్, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 7. వెల సోను అలియాస్ శ్రీకాంత్ సోను, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 8. రాణిత అలియాస్ జయమతి, రూపి, ప్రాగ్ ఎల్వోసీ కమాండర్ 9. రామ్ షీలా, నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: పక్కాగా అందిన సమాచారం, పకడ్బందీ వ్యూహం నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సోమవారం సాయంత్రం పోలీస్ ఇన్ఫార్మర్ పేరిట కాంకేర్ జిల్లాలో ఒకరిని హతమార్చిన మావోయిస్టులు.. అదే ప్రాంతంలో సమావేశం అయ్యారన్న సమాచారంతో బలగాలు ప్రత్యేక వ్యూహంతో కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లోనే 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. వీరిలో 15 మంది మహిళలు కాగా, 14 మంది పురుషులు ఉన్నారు. ఘటనా స్థలంలో ఏకే–47, ఎల్ఎంజీ, ఇన్సాస్ లాంటి అత్యాధునిక ఆయుధాలను స్వాదీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్, కాంకేర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంద్ర కళ్యాణ్ ఎల్లిసెల బుధవారం రాత్రి వెల్లడించారు. ఎన్కౌంటర్కు సంబంధించిన పూర్తి వివరాలను వారు తెలియజేశారు. ఇప్పటివరకు 9 మంది మావోయిస్టులను గుర్తించామన్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురానికి చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నట్లు భావించామని, అయితే బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్ అలియాస్ మురళి, అలియాస్ శంకర్గా గుర్తించినట్లు వెల్లడించారు. ఆయనతో పాటు ఇప్పటివరకు గుర్తించిన మొత్తం 9 మంది పేర్లను తెలిపారు. మిగతా వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. ఆపరేషన్ యాంటీ మావోయిస్టులు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఆపరేషన్ యాంటీ మావోయిస్టులు పేరిట ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు గతంలోనే కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అందిన సమాచారం మేరకు.. మంగళవారం ఉదయం నుంచి కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు (డీఆర్జీ), కేంద్ర భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు బుధవారం ప్రకటించారు. లోక్సభ మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 19న 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో దండకారణ్య ప్రాంతంలోని బస్తర్, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి స్థానాలు కూడా ఉన్నాయి. ఎన్కౌంటర్ జరిగిన కాంకేర్ పార్లమెంట్ స్థానానికి రెండో విడతలో ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో నెల రోజులుగా నిఘా వేసిన పోలీసు వర్గాలకు అందిన పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టగా ఎన్కౌంటర్ జరిగినట్లు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ పోలీసుల దృష్టిలో మోస్ట్ వాంటెడ్లుగా ఉన్న పలువురు టాప్ కమాండర్లు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. నాలుగైదు రోజుల ముందే అగ్రనేతలు, ఆర్కేబీ డివిజన్ కమిటీ ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన నేపథ్యంలో రావ్ఘాట్ ఏరియా కమిటీ (పర్థాపూర్)మాత్రమే ఛోటె బెటియా పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయి పోలీసుల ఎదురుకాల్పుల్లో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినట్లు సమాచారం. ముగిసిన 25 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం చిట్యాల: విప్లవ గీతాలకు ఆకర్షితుడై 25 ఏళ్లక్రితం అడవి బాటపట్టిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ విగతజీవుడై గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. సిరిపెల్లి రాజపోశమ్మ–ఓదెలు దంపతుల కుమారుడు సుధాకర్ 1996లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తరువాత లొంగిపోయి జైలు జీవితం గడిపాడు. 1998లో మళ్లీ అడవి బాట పట్టాడు. దళ సభ్యుడి నుంచి నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, అనంతరం శంకర్ పేరుతో ఛత్తీస్గఢ్ ఏరియాలో జిల్లా కార్యదర్శిగా ఎదిగాడు. సుధాకర్ తండ్రి చనిపోగా, తల్లి వృద్ధాప్యంలో ఉంది. బస్తర్ ఎన్కౌంటర్లో సుధాకర్ చనిపోయాడని తెలియడంతో తల్లి, బంధువులు ఛత్తీస్గఢ్ వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. సుధాకర్ భార్య సుమన మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించినట్లు తెలిసింది. ఎన్కౌంటర్ మృతుల్లో చిన్నన్న లేడు ధ్రువీకరించిన సోదరులు ఆత్మకూరు రూరల్: ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన 29 మంది మావోయిస్టుల్లో ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు, అలియాస్ నాగన్న అలియాస్ విజయ్ కూడా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే స్థానిక పోలీసులు చూపించిన ఎన్కౌంటర్ మృతుల ఫొటోల్లో చిన్నన్న లేడని ఆయన సోదరులు ధ్రువీకరించారు. సుగులూరి చిన్నన్న 1996లో అప్పటి పీపుల్స్వార్లో పూర్తికాల సభ్యుడిగా చేరారు. తొలుత కర్నూలు జిల్లాలో అప్పటి భవనాసిదళం సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన..2006 తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలోకి వెళ్లినట్లు సమాచారం. తదనంతర కాలంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాజ్నంద్గావ్–కాంకేర్ డివిజన్ కార్యదర్శిగా విజయ్ పేరుతో కొనసాగుతున్నట్లు పోలీసు రికార్డుల ఆధారంగా తెలుస్తోంది. -
ఏవోబీలోకి మావోయిస్టులు?
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నమావోయిస్టులు షెల్టర్ కోసం ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని దండకారణ్యం ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని కేంద్ర పోలీసు బలగాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఏవోబీలోని దండకారణ్యంలో కేంద్ర బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కొన్నేళ్లుగా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది. అయితే, ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దులోని ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతం మావోయిస్టు పార్టీకి అడ్డాగా మారింది. ఆ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల పరిధిలో ఉన్న బస్తర్ అటవీ ప్రాంతం మావోయిస్టులకు సురక్షితంగా ఉంది. అక్కడి నుంచే మూడేళ్లుగా మావోయిస్టులు తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం కేంద్ర పోలీసు బలగాల నిర్బంధంలో ఉంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో పోలీసు పార్టీలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ సుమారు 79మంది కీలక నేతలు, సభ్యులను కోల్పోయింది. కాంకేరు జిల్లాలోని మాడ్ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఏకంగా 29మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో మిగిలిన క్యాడర్ ఛత్తీస్గఢ్ దండకారణ్యానికి సరిహద్దులో ఉన్న ఏపీకి చెందిన అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు, ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్ జిల్లాల అటవీ ప్రాంతానికి వచ్చి తలదాచుకుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. మరోవైపు మావోయిస్టుల కార్యకలపాలను నియంత్రించాలనే లక్ష్యంతో అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఒడిశా పోలీసు బలగాలతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. చింతూరుకు సరిహద్దులోని ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంపై నిఘా పెట్టారు. అప్రమత్తంగా ఉన్నాం ఏవోబీలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లు, మావోయిస్టుల మరణాలు తదితర పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. సరిహద్దులో పోలీసు బలగాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా అధికంగా ఉంది. ఒడిశా> పోలీసు యంత్రాంగం సహకారం తీసుకుంటున్నాం. అన్ని ఔట్ పోస్టుల పరి«ధిలో రెడ్ అలర్ట్ అమలులో ఉంది. – తుహిన్ సిన్హా, ఎస్పీ, పాడేరు -
Bastar Encounter: 29 మంది మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ బస్తర్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతిచెందిన 29 మంది నక్సలైట్ల మృతదేహాలకు శవపరీక్ష జరుగుతోందని బస్తర్ రేజం్ ఐజీ సుందరరాజన్ తెలిపారు. ఎన్ కౌంటర్ మృతుల్లో 15 మంది మహిళా మావోయిస్టులు, 14 మంది పురుషు నక్సల్స్ ఉన్నారని పేర్కొన్నారు. డీఆర్జీ, బీఎస్ఎఫ్ జవాన్లు సంయుక్తంగా నక్సల్స్ను చుట్టు ముట్టి మంచి ఫలితాలు సాధించారన్నారు. నాలుగు గంటల పాటు హోరా హోరిగా ఎదురు కాల్పులు జరిగాయని చెప్పారు. దండకారణ్యం మరోమారు నెత్తురోడింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో భారీ ఎన్కౌటర్లో భారీ ఎన్కౌటర్తో 29 మంది మావోయిస్టులు మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. బస్తర్ అడవుల్లోని కాంకేరు జిల్లా ఛోట్ బెటియా ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఏపీకి చెందిన అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నారు. ఈయన పై 25 లక్షల రివార్డు ఉంది. ఇద్దరు తెలంగాణ వాసులను కూడా గుర్తించారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు, ఆయన భార్య, ఆదిలాబాద్ జిల్లా హత్నూర్కు చెందిన దాసర్వర్ సుమన అలియాస్ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఏడు ఏకే–47లు, మూడు ఎల్ఎంజీలు, ఇతర ఆయుధాలు స్వాదీనం చేసుకున్నారు. నెలరోజుల్లో 79 మంది లోక్సభ ఎన్నికల ముంగిట బస్తర్ అడవుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు పట్టుదలగా అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. గడిచిన 30 రోజుల్లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీకి చెందిన 79 మంది మరణించారు. వరుస ఎదురుదెబ్బలతో కేంద్ర మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక ఛత్తీస్గఢ్లో ఈనెల 19న లోక్సభ ఎన్నికల తొలి విడత, 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. -
నవమి వేళ.. శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠ!
శ్రీరామ నవమి సందర్భంగా ఛత్తీస్గఢ్లోని జాంజ్గీర్ చంపా జిల్లాలోని కులీపోతా గ్రామంలో శ్రీసీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొంటున్నారు. చైత్ర నవరాత్రుల ప్రారంభం నుంచి ఇక్కడ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ దక్షిణముఖి హనుమాన్ 30 ఏళ్లుగా గ్రామంలో కొలువైవున్నాడన్నారు. ఇప్పుడు ఈ ఆలయ పునరుద్ధరణ జరిగిందని, ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఆలయ ప్రాంగణంలో శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని తెలిపారు. ఏప్రిల్ 16న కలశ స్థాపన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శ్రీరామనవమి రోజున ఉదయం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని, అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పూర్ణాహుతి, మహా హారతి, ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి అఖండ హరినామ సంకీర్తన ప్రారంభమవుతుందని, ఇది ఏప్రిల్ 25 వరకు కొనసాగుతుందని తెలిపారు. హనుమంతుని జయంతిని ఏప్రిల్ 23 న నిర్వహించనున్నామన్నారు. -
నెత్తురోడిన బస్తర్.. ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టుల మృతి
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న భీకర ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. భద్రతా దళాలకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటివరకు ముగ్గురిని గుర్తించగా.. వారిలో ఇద్దరు తెలంగాణ వాసులు ఉన్నారు. మరికొందరు తెలంగాణ వాసులు కూడా మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఎస్ఎఫ్, డీఆర్జీ బలగాలు.. మావోయిస్టులకు మధ్య మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందిందని బస్తర్ ఐజీ పి.సుందర్రాజ్, ఎస్పీ కళ్యాణ్ ఎలిసెల్లి మంగళవారం రాత్రి వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ, ఆర్కేబీ డివిజన్ కమి టీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్, అలియాస్ శంకర్రావు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురం గ్రామానికి చెందిన ఈయ నపై రూ.25 లక్షల రివార్డు ఉంది. మరోవైపు దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. గత పదిహేనేళ్లలో బస్తర్ అడ వుల్లో ఇదే అతి పెద్ద ఎన్కౌంటర్గా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టుల సమావేశంపై సమాచారంతో.. బస్తర్ అటవీ ప్రాంతంలో మొత్తం ఏడు జిల్లాలు ఉండగా కాంకేరు జిల్లా ఛోట్ బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండ, కరోనార్ మధ్య హపటోలా, (ఛోట్ బెటియా పోలీస్ స్టేషన్కు తూర్పున 15 కి.మీ దూరంలో) మాడ్ సమీప అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాడ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమయాన ఇరువర్గాల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఎన్కౌంటర్ రాత్రి వరకు కొనసాగగా..ఎదురుకాల్పుల తర్వాత మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. అలాగే ఘటనా స్థలంలో ఏడు ఏకే–47 రైఫిల్స్, మూడు లైట్ మిషన్ గన్స్, రెండు ఇన్సాస్ రైఫిళ్లతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర ఆయుధాలు, సామగ్రి స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఆయుధాల ఆధారంగా మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు భావిస్తున్నారు. మృతుల్లో మజ్జిదేవ్ భార్య లలిత! ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిని గుర్తించే పనిలో ఉన్న పోలీసులు అజ్ఞాతంలో ఉన్న అనుమానిత మావోయిస్టుల కుటుంబాలకు సమాచారం పంపి ఆరా తీస్తున్నారు. 1995 నుంచి మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న చిన్నన్న 2000 సంవత్సరంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. పారీ్టలో వెళ్లేకంటే ముందే వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఈ ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్, ఆయన భార్య అదిలాబాద్ జిల్లా బజార్హత్నూరుకు చెందిన ఆశశ్వర్ సుమన అలియాస్ రజిత మరణించినట్లు తెలుస్తోంది. సిరిపల్లె సుధాకర్ దండకారణ్యంలోనే డీవీసీలో పని చేస్తుండగా.. ఆయన భార్య రజిత అదే ప్రాంతంలో డీసీఎస్ స్థాయిలో ఉందని సమాచారం. అదే విధంగా దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ భార్య లలిత కూడా మృతి చెందినట్లు తెలిసింది. లలిత మహారాష్ట్రకు చెందిన వారని గుర్తించారు. అలాగే దండకారణ్యం ఐదవ కంపెనీకి చెందిన కమాండర్ రాజు సలామ్ కూడా మృతుల్లో ఉన్నట్లు తెలిసింది. ఈయనది ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా చెబుతున్నారు. మజ్జిదేవ్ కూడా ఉన్నారా? ఈ ఎన్కౌంటర్ మృతుల్లో దండకారణ్యం అగ్రనేత మజ్జిదేవ్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఆయన భార్య లలిత మృతి చెందడంతో.. మజ్జిదేవ్ కూడా మృతుల్లో ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమాల్లో కీలకంగా పనిచేస్తున్న మజ్జిదేవ్ పేరు ఇటీవలే వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇక మరణించిన వారిలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కూడా ఉండే అవకాశం ఉందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని తెలిపాయి. ఎన్కౌంటర్లో గాయపడిన బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు డీఆర్జీ పోలీసులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించాయి. నెలరోజుల్లో 79 మంది లోక్సభ ఎన్నికల ముంగిట బస్తర్ అడవుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు పట్టుదలగా అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. గడిచిన 30 రోజుల్లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో మావోయిస్టు పారీ్టకి చెందిన 79 మంది మరణించారు. ఇందులో మిలీíÙయా సభ్యులు మొదలు కంపెనీ కమాండర్ల వరకు వివిధ స్థాయి నేతలు ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ఈనెల 19న లోక్సభ ఎన్నికల తొలి విడత, 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. తెలంగాణ పోలీసుల అలర్ట్ సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడంతో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల జిల్లాల ఎస్పీలను పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాల్లో కూంబింగ్ను ముమ్మరం చేశారు. తెలంగాణలో ఇటీవలి కాలంలో మావోయిస్టుల కదలికలు లేనప్పటికీ, ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చనే అనుమానంతో తనిఖీలు పెంచినట్టు తెలిసింది. -
హెలికాఫ్టర్లో బయలుదేరిన పోలింగ్ సిబ్బంది.. వీడియో వైరల్
బీజాపూర్: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జాతీయ పార్టీలు మాత్రమే కాకుండా.. ప్రాంతీయ పార్టీలు సైతం విజయమే ప్రధానంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ తరుణంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సన్నద్ధమైంది. దేశం మొత్తం మీద ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ప్రారంభంలో మొదటి దశలో చత్తీస్ఘడ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది హెలికాఫ్టర్లలో పయనమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవితున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు MI-17 ఛాపర్లను ఉపయోగించి పోలింగ్ బృందాలు బయలుదేరాయి. శాంతియుతంగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించి ఎన్నికల అధికారులకు, ఓటర్లకు సురక్షితమైన వాతావరణం కల్పిస్తామని బీజాపూర్ కలెక్టర్ అనురాగ్ పాండే, ఎస్పీ జితేంద్ర యాదవ్ హామీ ఇచ్చారు. ఎన్నికలు జరగటానికి మూడు రోజులు ముందుగానే పోలింగ్ సిబ్బందిని.. పోలింగ్ జరిగే ప్రాంతాలకు పంపడం ప్రారంభిస్తామని బీజాపూర్ కలెక్టర్ అనురాగ్ పాండే పేర్కొన్నారు. ఇవన్నీ ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మెడకు జరుగుతాయని ఆయన అన్నారు. నేటి నుంచి పోలింగ్ అధికారులు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు.. ఎన్నికల అధికారులందరికీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM), అవసరమైన అన్ని పరికరాలను సంబంధిత అధికారులకు అందించారు. చత్తీస్ఘఢ్లో మొత్తం 11 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ పోలింగ్ మొత్తం మూడు దశల్లో నిర్వహించనున్నారు. అయితే ఏప్రిల్ 19వ తేదీన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికలు జరగున్నాయి. రెండు, మూడో దశల్లో మిగిలిన నియోజక వర్గాల్లో జరుగుతాయి. #WATCH | Chhattisgarh: Ahead of Lok Sabha elections, polling teams leave by helicopter to Naxal-hit areas, in Narayanpur 11 Lok Sabha seats in Chhattisgarh will go to polls in three phases on April 19, April 26 and May 7. Bastar will be the only seat to go to polls in the first… pic.twitter.com/bxQYMuwbVx — ANI (@ANI) April 16, 2024 -
ప్రధాని మోదీపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్
రాయ్పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఛత్తీస్ఘడ్ పోలీసులు తెలిపారు. ‘ప్రధాని మోదీపై అసభ్యకరమైన వాఖ్యలు చేసిన అరవింద్ కుమార్ సోని అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం. అతన్ని మస్తురీ పట్టణంలో అదుపులోకి తీసుకున్నాం’ అని బిలాస్పూర్ ఏఎస్పీ(రూరల్ అర్చనా ఝా తెలిపారు. శనివారం భాదోరా గ్రామంలో జరిగిన బహిరంగ సభ అనంతరం కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో అరవింద్ కుమార్ తీవ్రమైన అసభ్య పదజాలంతో ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారని పోలీసులు తెలిపారు. దీంతో బీజేపీ నేత బీపీ సింగ్ అరవింద్ కుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే విధంగా ప్రధానిమోదీపై అరవింద్ అనే వ్యక్తి అస్యభ వ్యాఖ్యలు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బిలాస్పూర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యిర్థి దేవేంద్రసింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో కన్హయ్య కుమార్ పాల్గొన్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం 11 లోక్సభ స్థానాలు ఉన్న ఛత్తీస్ఘడ్లో ఏప్రిల్ 19 నుంచి మే 7వరకు మూడు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దేవేంద్ర సింగ్ యాదవ్ బిలాయ్ నుంచి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. బీజేపీ అభ్యర్థి టోకెన్ సాహూకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేవేంద్ర సింగ్ను బరిలోకి దించింది. -
‘విద్యుత్’ నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి?
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం.. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత, మాజీ అధికారులకు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఆయా అధికారులు, మాజీ అధికారులు పోషించిన పాత్ర ఏమిటనే వివరణ, అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. ఈ ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ కొనుగోలులో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు సోమవారం బహిరంగ ప్రకటన కూడా జారీ చేయనుంది. సంబంధిత వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్కు రాతపూర్వకంగా అందించడానికి వీలు కల్పించనుంది. అవసరమైతే బహిరంగ విచారణకు రావాలని వారిని పిలిపించే అవకాశమూ ఉంది. ప్రస్తుత, మాజీ అధికారులందరికీ.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంతో సంబంధమున్న ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, ట్రాన్స్కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ జి.రఘుమారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ మాజీ సీఎండీలు కె.వెంకటనారాయణ, ఎ.గోపాల్రావుతోపాటు ఆయా విద్యుత్ సంస్థల మాజీ, ప్రస్తుత డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులకు కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. వీరితోపాటు నామినేషన్లపై యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను దక్కించుకున్న బీహెచ్ఈఎల్ సంస్థ ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు, ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మాజీ, ప్రస్తుత ఉన్నతాధికారులకు సైతం నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి వీరికి నోటీసులు అందనున్నట్టు సమాచారం. త్వరలో ప్రజాప్రతినిధులకు కూడా.. విద్యుత్ ప్లాంట్లు, కొనుగోళ్లపై న్యాయ విచారణలో భాగంగా తొలిదశలో ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసిన కమిషన్.. ఆ నిర్ణయాల్లో తమ పాత్రపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అవసరమైతే కమిషన్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరుకావాలని పిలిచే అవకాశం ఉందని విద్యుత్ వర్గాలు చెప్తున్నాయి. ఈ వివరణల్లో లభించే సమాచారం ఆధారంగా.. తర్వాతి దశలో పలువురు ప్రజాప్రతినిధులకు నేతలకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం గడువు విధించిన నేపథ్యంలో.. కమిషన్ న్యాయ విచారణ ప్రక్రియను వేగిరం చేయాలని నిర్ణయించింది. ఈఆర్సీకి అరవింద్ కుమార్ లేఖనే కీలకం.. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని.. ఆ ఒప్పందాన్ని ఆమోదించవద్దని కోరుతూ నాటి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్ 2016 డిసెంబర్లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి లేఖ రాశారు. దీనిపై ఆగ్రహించిన అప్పటి సర్కారు.. ఆయనను మరుసటి రోజే ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేసింది. తాజాగా ఆయనకు కూడా విచారణ కమిషన్ నోటీసులు జారీ చేయడంతో.. నాటి లేఖ, ఆయన వివరణ కీలకంకానున్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
Rahul Gandhi: వాళ్లది దాడి తంత్రం.. మాది పరిరక్షణ మంత్రం
జగ్దల్పూర్/భండారా: రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పాటుపడుతుంటే దానిని నచ్చినట్లు సవరించే కుట్రకు బీజేపీ బరితెగించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. లోక్సభ సమరంలో విజయం సాధించి అధికారం చేపట్టగానే దేశవ్యాప్త కులగణనకు శ్రీకారం చుడతామని రాహుల్ పునరుద్ఘాటించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలోని బస్తర్ గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ ఈసారి జరుగుతున్న ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ విధ్వంసక సిద్ధాంతాల మధ్య పోరాటం. ఓవైపు కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’కూటమి రాజ్యాంగ పరిరక్షణకు ప్రయత్నం చేస్తుంటే మరోపక్క మోదీ, అదానీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. గిరిజన మహిళ అని కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇది బీజేపీ ఆలోచనాధోరణికి అద్దంపడుతోంది’’ అని రాహుల్ ఆరోపించారు. షెడ్యూల్ తెగలకు కేటాయించిన బస్తర్ ఎంపీ స్థానంలో బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి కవాసీ లఖ్మాకు మద్దతుగా రాహుల్ ఈ సభకు వచ్చి మాట్లాడారు. ఆదివాసీ.. వనవాసీ ‘‘ ఆదివాసీ పదాన్నే ప్రధాని వాడుక నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మేం ఆదివాసీ అంటే బీజేపీ వాళ్లు వనవాసీ అంటున్నారు. రెండు పదాల అర్ధాల్లో చాలా బేధముంది. ఆదివాసీ అంటే అడవితో మమేకమైన వాళ్లు అని అర్థం. ఆ పదం మీకు జలం, జంగిల్(అడవి), జమీన్(భూమి)పై మీకున్న హక్కులను ఎలుగెత్తి చాటుతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనప్రాంతాల్లో స్వయంపాలనకు బాటలువేస్తూ గ్రామసభలకు అనుమతినిస్తూ పంచాయతీ చట్టాన్ని తెచ్చాయి. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ గిరిజనుల మత విశ్వాసాలు, సిద్ధాంతాలు, చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అటవీ భూములను అదానీ లాంటి వాళ్లకు బీజేపీ ధారాదత్తం చేస్తోంది. ఇప్పటికే దేశంలో అడవులు కుచించుకుపోతున్నాయి’’ అని రాహుల్ అన్నారు. మేమొస్తే రైతు రుణమాఫీ మహారాష్ట్రలోని భండారా జిల్లా సకోలీ పట్టణంలో పార్టీ ర్యాలీలోనూ రాహుల్ ప్రసంగించారు. ‘‘అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీచేస్తాం. నిరుద్యోగం, అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న సాధారణ జనం జీఎస్టీ కడుతున్నారు. కోట్లు గడిస్తున్న వాళ్లూ అంతే జీఎస్టీ కడుతున్నారు. మోదీ హయాంలో 22 మంది బడా పారిశ్రామికవేత్తల వద్ద పోగుబడిన సంపద 70 కోట్ల మంది భారతీయుల ఆస్తితో సమానం. ఈ విషయం వదిలేసి మోదీ ఎప్పుడూ మతం గురించే మాట్లాడతారు’’ అని రాహుల్ అన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్.. హెడ్ ఔట్
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ కామెంట్
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా?: మంత్రి బొత్స కౌంటర్
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
Indian 2 Paaraa Song Promo: కమల్ హాసన్ ఇండియన్-2.. ప్రోమో వచ్చేసింది!
SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్ తల్లికి అర్ష్దీప్ రిక్వెస్ట్ (ఫొటోలు)
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement