తప్పుల తడకలూ-నిర్జీవన కాలాలూ | Sakshi
Sakshi News home page

తప్పుల తడకలూ-నిర్జీవన కాలాలూ

Published Tue, May 12 2015 12:20 AM

national level, the contents of their communications error

కాలమిస్ట్ గొల్లపూడి మారుతీరావు మే 7న రవీంద్ర నాథ్ టాగోర్ జయంతి సందర్భంగా ‘సాక్షి’ సం పాదకీయ పేజీలో ‘మాతృ వందనం’ అంటూ ఒక రచన చేశారు. దాంట్లో జాతీయ స్థాయి విషయాలపై వారి సమాచార లోపం లేదా సమాచారం పట్ల వారి నిర్లక్ష్యం పట్ల ఖేదపడుతున్నాను. వారి ఉద్దేశం తేట తెల్లమే. ‘జనగణమన’ను చిన్నది చేసి ‘వందేమాత రం’ను పెద్ద చేయడం. జాతీయగీతంగా వందే మాతరం మెరుగైనదీ, మరిం త సమంజసమైనదన్న భావన కలుగజేయాలనే రచయిత ఆతురత ప్రద ర్శించారు. ఈ క్రమంలో వివాదపు లోయల్లో పడి పోవడం, గోష్పాదమంత వ్యర్థ సంచలనాల్లో ఇరు క్కోవడమూ ఆయనకు పరిపాటిగా మారింది.

టాగోర్ జనగణమన గీతాన్ని 1911లో మదన పల్లిలో రాశారని గొల్లపూడి గారు చెప్పడం ఒక పూర్తి స్థాయి తప్పుడు సమాచారం. ఇంత ప్రాథమిక సమాచారాన్ని కూడా తప్పుగా ఇవ్వడం శోచనీయం. 1911లో టాగోర్ ఉన్నది నాటి కలకత్తాలో. ఆ నగ రం అప్పటి భారతదేశ రాజధాని. ఇంగ్లండ్‌లో సిం హాసనం అధిష్టించిన పంచమ జార్జ్ చక్రవర్తి కలక త్తాకు వచ్చారు. ఆనాటికి బ్రిటిష్ విధేయులుగా ఉన్న కాంగ్రెస్ వారు ఈ రాజసందర్శనను పురస్కరించు కుని ఒక గీతం రాయమని కోరగా టాగోర్ జనగణ మన రాశారు. దాన్ని 27-12-1911 సాయంత్రం జార్జ్ చక్రవర్తి సన్మాన సభలో స్వాగతగీతంగా పాడారు. ఆనాటికి అంటే 1911కి జనగణమన జాతీ య గీతం అవుతుందని ఎవరూ అనుకోలేదు.

 చిత్తూరు జిల్లా మదనపల్లెకు, జనగణమనకు గల సంబంధం 1918-19 కాలం నాటిది. అక్కడి అనెబిసెంట్ థియోసాఫికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఐరిష్ కవి జేమ్స్ కజిన్స్ పిలుపు మేరకు మదనపల్లెకి  వచ్చిన టాగోర్ వారి కోరిక మేరకు ఆ గీతాన్ని ఆల పించి ఆంగ్లానువాదం కూడా చేశారు. జేమ్స్ భార్య మార్గరేట్ కజిన్స్ సహకారంతో టాగోర్ స్వయంగా జనగణమన గీతాన్ని పాడే పద్ధతిని స్థిరపరిచారు. ఇప్పటికీ అదే వరుసలో మనం పాడుతున్నాం. అయితే 1918 నాటికి కూడా ఈ గీతం దేశ జాతీయ గీతం అవుతుందన్న అంచనాలు ఎవరికీ లేవు.

1911లో రాసిన గీతం 36 ఏళ్ల తర్వాత జాతీ యగీతం అయిందనుకుని, దాన్ని అలా చేయడంలో మహాత్మాగాంధీ, జవహర్‌లాల్నెహ్రూ వంటి వారికి ఏవో ప్రత్యేక ఇష్టాలు ఉన్నాయని అక్కడికి ఈ కాల మిస్ట్ తానే కనిపెట్టినట్లుగా సన్నాయి నొక్కులు నొక్క డం.. ఇది మరొక తీవ్ర దురవగాహన. ‘జనగణ మన’ జాతీయ గీతం అయింది దాన్ని రాసిన 36 ఏళ్ల తర్వాత అంటే 1947లో కాదు. భారత రాజ్యాంగ సభ 1950 జనవరి 24న అలా తీర్మానించింది. ఆనాటికి మహాత్మాగాంధీ జీవించి లేరు. ఇది కూడా తెలియకుండా జాతీయ చారిత్రక ప్రాముఖ్యత కలి గిన అంశాలపై రాయడం దోషం, అపరాధం కూడా. దేశమంతటికీ అర్థమయ్యే భాషలో సంస్కృత పదాల తత్సమ బెంగాలీలో రాసిన జనగణమన గీతాన్ని తక్కువ చేసే ప్రయత్నంలో తానే చిన్నపోయారు ఈ కాలమిస్ట్. అందుకు విచారంతోపాటు చరిత్రలో సం ఘటనలను చెప్పడంలో కాలమిస్టు మారుతీ రావు గారు మరింత జవాబుదారీతనాన్ని కలిగి ఉండాలని అనుకోవడం పాఠకుల కనీసస్థాయి ఆశగా వారు గుర్తిస్తే బాగుంటుంది.
 
(రామతీర్థ  ప్రముఖ కవి, రచయిత)
మొబైల్: 98492 00385
 
 

Advertisement
Advertisement