
హామీలను అమలు చేయకుండా మోసం
తాడేపల్లిగూడెం (టీఓసీ): కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు విమర్శించారు. స్థానిక హౌసింగ్బోర్డు కాలనీలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత జగన్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే నేటి కూటమి ప్రభుత్వం పెన్షన్ మినహా ఏదీ నెరవేర్చలేదన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు చూస్తుంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉన్నట్లుగా ఉందన్నారు. పిఠాపురంలో దళితులను అగ్రవర్ణాలు వారు వెలివేస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించలేదని, ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు కార్యక్రమం విజయవంతంగా జరిగిందన్నారు. సమావేశంలో మాల సంఘాల జేఏసీ నాయకులు గంట సుందర్ కుమార్, కేసీ రాజు, ఎం.ఎస్తేర్ రాణి పాల్గొన్నారు.