పరిగి: గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు కాలేదని డీసీసీ అధ్యక్షుడు, పరిగి అసెంబ్లీ అభ్యర్థి రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. గురువారం పరిగిలో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చరిత్ర ఎంతో గొప్పదని, దేశ పురోగతిలో ముఖ్య భూమిక పోషించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని, డిసెంబర్ 3న అధికారంలోకి వస్తా మన్నారు. ప్రజల ఆకాంక్షను గుర్తించిన సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణను ఇచ్చిందని, ప్రస్తుత ఎన్నికల్లో పార్టీని గెలిపించి ఆమెకు బహుమతి ఇవ్వాలని ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా పరిగికి నీళ్లు తెస్తానని హామీ ఇచ్చారని, ఐదేళ్లు పూర్తయినా పనులను ప్రారంభించకపోవ డం సిగ్గుచేటన్నారు. పేదలకు డబుల్ ఇళ్లు ఇస్తామ ని ఆశ పెట్టి ఒక్కరికి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఊరికి వెళ్లినా కాంగ్రెస్ హయాంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లు దర్శనమిస్తాయని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని, అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలను గ్రామాల్లోకి రానివ్వడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ మాయమాటలు చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చారని, ఆ సారి ఆయన ఆటలు సాగవన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు కాంగ్రెస్ నాయకులకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, పార్టీ ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, మండల అధ్యక్షుడు పరశురాంరెడ్డి, దోమ ఎంపీపీ అనసూయ, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ బంగ్ల యాదయ్యగౌడ్, జిల్లా నాయకులు కడ్మూర్ ఆనందం తదితరులు పాల్గొన్నారు.