
అడ్డుకునేందుకు వెళితే హత్య చేశాడు..
ఉప్పల్: బార్లో మద్యం సేవిస్తున్న యువకుల మధ్య జరిగిన గొడవ ఓ అమాయకుడి ప్రాణాలు తీసింది. పక్క పక్క టేబుళ్లలో మద్యం సేవిస్తున్న యువకుల మద్య వివాదం చెలరేగడంతో అడ్డుకోబోయిన యువకుడి తలపై బీరు సీసాతో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజి పేట గ్రామానికి చెందిన భాస్కర్ నగరానికి వలసవచ్చి అంబర్పేట్, బాపూజీ నగర్లో నివాసం ఉంటూ కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడి కుమారుడు పవన్(26) డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి అతను తన స్నేహితుడు రిషికేష్తో కలిసి రామంతాపూర్లోని గుడ్ డే బార్కు వెళ్లాడు. మద్యం సేవిస్తుండగా పక్క టేబుల్లో కూర్చున్న అంబర్పేట, పటేల్ నగర్ ప్రాంతానికి చెందిన శ్రావణ్ కుమార్ గౌడ్ హరికృష్ణ అనే వ్యక్తితో గొడవ పడి అతడిపై బీరు సీసాతో దాడి చేయడంతో అతడికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న పవన్ కుమార్ దీనిని అడ్డుకునేందుకు యత్నించడంతో శ్రావణ్ కుమార్ బీరు సీసాతో పవన్ తలపై బలంగా మోదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై సమాచారం అందడంతో ఉప్పల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పవన్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. దాదాపు అరగంట పాటు బార్లో గొడవ జరుగుతున్నా నిర్వాహకులు అడ్డుకోకపోవడమేగాక, పోలీసులకు సమాచారం అందించనందునే తన కుమారుడు మృతి చెందాడని మృతుడి తండ్రి భాస్కర్ ఆరోపిస్తున్నాడు. బార్ నిర్వాహకులతో పాటు తన కుమారుడిని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
బార్లో యువకుల వీరంగం
బీరు సీసాలతో దాడి
అడ్డుకునేందుకు వెళ్లిన యువకుడి మృతి