
తల్లి మందలించిందని
బాలుడి ఆత్మహత్య
సైదాబాద్: చదువుకోకుండా టీవీ, మొబైల్ ఫోన్ చూస్తుండటంతో తల్లి మందలించినందుకు మనస్తాపానికి లోనైన ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఐఎస్సదన్ డివిజన్, రాధే రెసిడెన్సీ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న వెంకటయ్య, సుజాత దంపతులు అదే అపార్ట్మెంట్ సెల్లార్లో ముగ్గురు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నారు. వారి పెద్ద కుమారుడు రిషి (16) ఇటీవల 10 తరగతి ఫెయిల్ అయ్యాడు. తల్లిదండ్రులు అతనికి ధైర్యం చెప్పి సప్లిమెంటరీకి సిద్ధం కావాలని ట్యూషన్లో చేర్పించారు. అయితే గత మూడు రోజులుగా అతను టీవీ చూడటం, మొబైల్ ఫోన్లో ఆటలాడుతుండటంతో తల్లి అతడిని మందలించింది. పరీక్షల కోసం చదువుకోవాలని చెప్పింది. దీంతో మనస్తాపానికి లోనైన రిషి సోమవారం మధ్యాహ్నం అపార్ట్మెంట్ టెర్రస్కు ఉన్న ఇనుప మెట్లకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడి తల్లి సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సైదాబాద్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.