బడంగ్పేట్: విద్యతో పాటు ఆధ్యాత్మికత అవసరమని, మానవులు ఎలా జీవించాలనేది మన సనాతన ధర్మం బోధిస్తుందని మళయాళస్వామి భక్తురాలు, బహు గ్రంథ రచయిత బొప్పన అరుణాదేవి అన్నారు. 98వ సనాతన వేదాంత జ్ఞానసభలో మంగళవారం రెండోరోజు జరిగిన మహిళల సభలో పలువురు మాతాజీలు ఆధ్యాత్మిక సందేశాలను వినిపించారు. భగవద్గీత సామూహిక పఠనం చేశారు. అనంతరం అరుణాదేవి మాట్లాడుతూ.. మహిళలకు ఆధ్యాత్మికం, ఆత్మగౌరవం, భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించాలనే ఉద్దేశంతో సుమారు తొంభైఎనిమిది సంవత్సరాల క్రితమే మళయాళస్వామి సీ్త్రల సభకు రూపకల్పన చేశారని వివరించారు. నాటి నుంచి నేటి వరకు ఈ పద్ధతి కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో పరిస్థితులు మారాయని, సీ్త్రలు ఉన్న విద్యావంతులుగా ఎదుగుతున్నారని అయితే తమ మూలాలను మర్చిపోకూడదని సూచించారు. మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం వెలుగుతుంది కానీ నేడు ఎక్కువ శాతం పాశ్చాత్య ధోరణులకు అలవాటుపడుతున్నారన్నారు. తల్లిదండ్రులే పిల్లలకు రోల్ మోడల్స్ అని పిల్లలను తీర్చిదిద్దడంలో వారి పాత్ర ఎనలేనిదన్నారు. అందువల్ల పిల్లల పెంపకంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మన సనాతన ధర్మాలను రాబోయే తరాలకు అందజేయాలంటే వారికి సంస్కారాన్ని ఇవ్వాలన్నారు. పిల్లలకు చిన్ననాటి నుంచి మన సంస్కృతి, విధానాలు, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందింపచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా సభలో పాల్గొన్న ఆధ్యాత్మిక వక్త కొంపెల్ల మాధవీలతను సత్కరించి శక్తిరూపిణిగా అభివర్ణిస్తూ అరుణాదేవి తదితరులు త్రిశూలం అందజేశారు. సభ వద్ద వ్యాసాశ్రమ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందస్వామి ఎమ్మెల్సీ బొగ్గారపు దయానందగుప్తాను జ్ఞాపికతో సన్మానించారు. కాగా అంతకు ముందు ఉదయం బ్రహ్మశ్రీ ఎం.రాజేశ్వరశర్మ ఆయుష్ హోమం నిర్వహించారు.