మార్కాపురం: అంతర్జిల్లాల దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.2.52 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఆవుల వెంకటేశ్వర్లు తెలిపారు. సీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. మార్కాపురం పట్టణ, మండలం, కంభం, వినుకొండ పొలీసుస్టేషన్ పరిధిలో వివిధ దొంగతనాలకు పాల్పడిన షేక్ సుభానీని మార్కాపురం ఆర్టీసీ బస్టాండు వద్ద అదుపులోనికి తీసుకుని విచారించగా దొంగతనం వివరాలు తెలిపాడన్నారు. ఎస్సై షేక్ అబ్దుల్ రెహమాన్ వచ్చిన సమాచారం మేరకు..సిబ్బందితో ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వెళ్లగా పోలీసు జీపును చూసి సుభానీ పారిపోయేందుకు ప్రయత్నించగా అదుపులోనికి తీసుకొని విచారించామని తెలిపారు. బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే సుభానీ..జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడేవాడన్నారు. నిందితునిపై గతంలో పోలీస్స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేసినట్లు పేర్కొన్నారు. శ్రీనివాసనగర్కు చెందిన స్నేహితుడు శివతో కలిసి మార్కాపురం పట్టణ, మండలం, కంభం, వినుకొండ పోలీస్స్టేషన్ల పరిధిలో వివిధ దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. సెల్ఫోన్లు, మోటార్ బైకులు అపహరించి తక్కువ ధరకు విక్రయించాడు. దీంతో మార్కాపురం, కంభం, వినుకొండ పోలీసుస్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో నిందితునిగా భావించి సోమవారం రాత్రి 8 గంటల సమయంలో సుభానీని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.2.52 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రెండో నిందితుడు శివ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరితో పాటు దొంగలించిన మోటారుసైకిళ్లను తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ పేపర్లు లేకుండా కొనుగోలు చేసిన పట్టణానికి చెందిన దుర్గా ప్రసాద్ను కూడా నిందితునిగా చేర్చినట్లు పేర్కొన్నారు.