No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Mar 26 2024 12:55 AM

-

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో టీడీపీ, జనసేనల మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు పార్టీల నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పశ్చిమ ప్రకాశంలో కీలకమైన గిద్దలూరు నియోజకవర్గంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించడం పట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. మొదటి నుంచి ఈ సీటును జనసేనకు ఇస్తామంటూ ప్రచారం చేసి చివరికి తెలుగుదేశం పార్టీకి కేటాయించడం వెనక దుష్ట శక్తుల కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమంచి స్వాములును గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. అయితే టీడీపీ, జనసేన పొత్తుల తరువాత కూడా కొంతకాలం ఇదే కథ నడిపించారు. చివరికి గిద్దలూరు సీటు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన నాయకులు మోసపోయినట్లు గ్రహించారు. నమ్మించి మోసం చేశారని ఆగ్రహం చెందిన ఆమంచి స్వాములు జనసేన పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామాలు జరుగుతుండగానే టీడీపీ అభ్యర్థి అశోక్‌ రెడ్డి జనసేనలో చిచ్చు పెట్టారు. రెండు గ్రూపులను సృష్టించారు. జనసేనలో కాసుల పాండు, బెల్లంకొండ సాయిబాబు గ్రూపులు ఏర్పడ్డాయని కార్యకర్తలు మండిపడుతున్నారు.

దర్శిపై దోబూచులు..

దర్శి నియోజకవర్గంలో సైతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇది కూడా మొదట్నుంచీ జనసేనకు ఇస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో ఎన్నారై గరికపాటి వెంకట్‌ ప్రచారాన్ని సైతం చేసుకుంటూ వచ్చారు. సీటు తనకే వస్తుందని ఆశపడ్డారు. పలు కార్యక్రమాలను సైతం నిర్వహించారు. అయితే ఈ సీటుపై టీడీపీ అధినేత చంద్రబాబు తనస్టైల్‌లో కుట్రలకు తెరతీశారు. దర్శిపై దోబూలాట మొదలెట్టారు. ఎల్లో మీడియా ద్వారా రోజుకో ప్రచారాన్ని చేయిస్తూ వస్తున్నారు. ఈ సీటును జనసేనకు కాకుండా టీడీపీకి కేటాయిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోంది. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రటించినప్పటికీ దర్శిపై క్లారిటీ ఇవ్వలేదు. నోటిఫికేషన్‌ వచ్చి పది రోజులవుతున్నా ఇప్పటి వరకు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించకుండా తాత్సారం చేస్తోంది. దీంతో కూటమి పార్టీలో నాయకులు, కార్యకర్తలు చిరాకుపడుతున్నారు. ఒకవేళ ఇక్కడ నుంచి జనసేన తరఫున ఎవరు పోటీ చేసినా అభ్యర్థి మాత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన వారే ఉండేలా చంద్రబాబు తెరవెనుక మంత్రాంగం నెరపుతున్నట్టు సమాచారం.

రెబల్‌గా స్వాములు..

ఆమంచి స్వాములు ఆదివారం రాత్రి కంభంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో తెలుగుదేశం నాయకత్వంపై ఫైర్‌ కావడం సంచలనం సృష్టించింది. ఓడిపోయే సీట్లను జనసేనకు కట్టబెడుతున్నారని ఆయన చేసిన విమర్శలు పెద్ద దుమారం లేపాయి. జిల్లా నుంచి కనీసం ఒక్క సీటైనా జనసేనకు ఎందుకు కేటాయించలేదన్న ఆయన ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పటికై నా మించిపోయిందేమీ లేదని, పొత్తు విషయంలో పునరాలోచించుకోవాలని పార్టీ నాయకుడు పవన్‌ కళ్యాణ్‌కు ఆయన సూచించడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆమంచి స్వాములు రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్వాములు ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన కూటమిలో లుకలుకలు మొదలైనట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement