
ఎమ్మిగనూరులో టీడీపీకి షాక్!
● పార్టీకి, పార్టీ సభ్వత్వానికి
రాజీనామ చేసిన 21వ వార్డు కౌన్సిలర్
● త్వరలో కౌన్సిలర్ బాటలో మరికొందరు
ఎమ్మిగనూరు రూరల్: పట్టణంలో కూటమి ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి, పార్టీ సభ్వత్వానికి 21వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వీజీఏ. వాల్మీకి దయసాగర్ సోమవారం రాజీనామ చేయటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. 11 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో చురుకై న కార్యకర్తగా అనేక బాధ్యతలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎర్పడి సంవత్సరం కావస్తుంది, ఎన్నికల ముందు ఇచ్చిన హమీలు నెరవేర్చటంలో పూర్తిగా విఫలమైందని ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో సొంత పార్టీ నేత, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రాజీనామ కూటమి ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చినట్లయింది. కూటమి ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది, అయినా అధికార పార్టీకి రాజీనామ చేయటం గమనార్హం. కౌన్సిలర్ బాటలోనే మరికొందరు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
డ్రోన్ ధర రూ.10 లక్షలా!
● బహిరంగ మార్కెట్లో
బ్యాటరీ సహా రూ.8 లక్షలే..
● కొనుగోలుకు ముందుకురాని గ్రూపులు
కర్నూలు(అగ్రికల్చర్): పలు కంపెనీల డ్రోన్లు బహిరంగ మార్కెట్లో రూ.8 లక్షలకే లభిస్తున్నాయి. బ్యాటరీ లేకుండా అయితే రూ.6 లక్షలు, బ్యాటరీతో కలిపి రూ.8 లక్షలకే క్వాలిటీ డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వ్యవసాయ శాఖ అందజేస్తున్న డ్రోన్ల ధరలో భారీగా వ్యత్యాసం ఉండటం చర్చనీయాంశమైంది. వ్యవసాయ శాఖ సరఫరా చేస్తున్న డ్రోన్ల యూనిట్ కాస్ట్ రూ.9.81లక్షలు. ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇస్తోంది. జిల్లాలో విహంగ, డ్రోగో కంపెనీలు కిసాన్ డ్రోన్లను సరఫరా చేస్తున్నాయి. యూనిట్ కాస్ట్లో ఎఫ్ఎంజీ కిసాన్ డ్రోన్ గ్రూపులు 50 శాతం చొప్పున రూ.4.90 లక్షల ముందుగానే చెల్లించాల్సి ఉంది. మిగిలిన 50 శాతం బ్యాంకు లోన్ కింద సమకూరిస్తేనే యూనిట్ గ్రౌండ్ అవుతుంది. జిల్లాకు 35 డ్రోన్లను మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో ఐదు గ్రూపులు మాత్రమే 50 శాతం మొత్తాన్ని చెల్లించాయి. సిబిల్ స్కోర్ కారణంగా బ్యాంకుల నుంచి లోన్ పొందడం గగనమవడం.. యూనిట్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉండటం పట్ల గ్రూపు సభ్యుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.