
రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి
డిండి : భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కోరారు. బుధవారం డిండి మండలంలోని ఖానాపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై అవగాహన కల్పించటంతోపాటు వివిధ కారణాలతో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో ఈ నెల 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఆయన వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, జూనియర్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు.
ఎన్జీ కాలేజీ డిగ్రీ ఫలితాలు విడుదల
రామగిరి(నల్లగొండ) : ఎన్జీ కాలేజీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల ఫలితాలను బుధవారం ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి బత్తిని నాగరాజు ఫలితాలను విశ్లేషించారు. బీబీఏ, బీకామ్ విభాగాల్లో అత్యధికంగా 87 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని.. చివరి సంవత్సరం పూర్తిచేసిన విద్యార్థుల్లో బీబీఏ 83శాతం, బీకామ్ 80 శాతం, బీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్ విద్యార్థులు 69శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పరంగి రవికుమార్, అడిషన్ సీఓఈ డాక్టర్ వైవి.ప్రసన్నకుమార్, అధ్యాపకులు కోటయ్య, చంద్రయ్య, నాగరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు.
ఎర్రజెండాతోనే సమసమాజం సాధ్యం
మిర్యాలగూడ : ఎర్రజెండా ద్వారానే అసమానతలు లేని సమసమాజం సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. బుధవారం మిర్యాలగూడ మండలంలోని యాద్గార్పల్లి గ్రామంలో జరిగిన సీపీఐ మండల 10 మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, మండలాల కార్యదర్శులు ఎండీ.సయీద్, డి.లింగానాయక్, జిల్లా యాదయ్య, నాయకులు బిల్లా కనకయ్య పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
మాడ్గులపల్లి : మండలంలో పార్టీ బలోపేతానికి సీపీఐ కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. బుధవారం మాడ్గుపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఐ మండల మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో వీరస్వామి, ఆర్ఎస్.రెడ్డి, కట్టా వెంకట్రెడ్డి, రఘునాధచార్యులు, పుల్లెంల అబ్రహం, జిల్లా యాదమ్మ, కంకణాల శ్రీనివాస్రెడ్డి, లెనిన్, పుష్పలత, శిరీష, యాదమ్మ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
సీఎం పర్యటనకు
పటిష్ట బందోబస్తు
తుర్కపల్లి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన, బహిరంగ సభకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. తుర్కపల్లి మండలంలోని తిర్మలాపూర్లో సభా స్థలిని బుధవారం ఆయన పరిశీలించారు. పోలీసు అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట డీసీపీ అక్షాంశ్ యాదవ్, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీలు రాహుల్రెడ్డి, శ్రీనివాస్నాయుడు, సీఐలు శంకర్గౌడ్, ఎలగొండ కృష్ణ, ఎస్ఐ తకియొద్దీన్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి

రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి