వైభవంగా తెప్పోత్సవం
భూదేవి, లక్ష్మీసమేతుడైన ప్రహ్లాదవరద స్వామి తెప్పోత్సవం బుధవారం రాత్రి దిగువ అహోబిలం క్షేత్రంలో కనులపండుగలా సాగింది. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరద స్వాములను పల్లకీపై కొలువుంచి మాడ వీధుల్లో ఊరేగింపుగా కోనేటి వరకు తోడ్కొని వచ్చారు. ఉభయ దేవేరులతో స్వామి తెప్పను అధిరోహించిన అనంతరం అర్చకుల పూజలు అందుకుని తెప్పపై విహరించారు. వేదపండితులు, వేద విద్యార్థులు, పీఠాధిపతి శిష్యులు.. నారసింహ స్వామి కీర్తనలు భక్తి పారవశ్యంతో ఆలపిస్తుండగా, చల్లని వేళ భక్తుల నుంచి హారతులు అందుకుంటూ ప్రహ్లాదవరదస్వామి ఉభయ దేవేరులతో తెప్పపై ఊరేగారు. కోనేటి చుట్టు భక్తులు చేరుకుని కార్యక్రమాన్ని వీక్షించి ఆశీస్సులు అందుకున్నారు.
ఆళ్లగడ్డ: దాసుడిగా.. సఖుడిగా.. ఆసనంగా.. ఆవాసంగా.. వాహనంగా.. ధ్వజంగా.. పలు విధాలా మహావిష్ణువుకు నిత్య వాహనమైన గరుత్మంతుడిపై ప్రహ్లాదవరదుడు బుధవారం తెల్లవారుజాము వరకు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అహోబిలేశుడి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం గరుడ వాహన సేవ మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు వైభవోపేతంగా నిర్వహించారు. భక్త జనసందోహంతో దిగువ అహోబిలం కిటకిటలాడింది. ఉదయం ఉత్సవమూర్తులను కోనేరు వద్దకు తోడ్కొని వెళ్లి తీర్థవారి చక్రస్నానం, సాయంత్రం ద్వాదశారాధనం, రాత్రి పుష్పయాగం నిర్వహించి అర్ధరాత్రి అనంతరం ప్రహ్లాదవరదుడు వజ్రవైడూర్యాలు, బంగారు ఆభరణాలు ధరించి గరుడవాహనం అధిష్టించి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వేడుకల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.
గోవింద నామస్మరణతో పులకించిన దిగువ అహోబిల క్షేత్రం