
బాసరలో మకాం.. నిజామాబాద్లో చోరీలు
ఖలీల్వాడి: బాసరలో ఇల్లు అద్దెకు తీసుకుని నిజామాబాద్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చిలుకల వాడకు చెందిన షేక్ యామీన్ అలియాస్ సమీర్ అలియాస్ గోపి (40), ఆదిలాబాద్ జిల్లా తాటిగూడ రైల్వేస్టేషన్కు చెందిన సయ్యద్ ఫరూక్ (22), మహారాష్ట్రకు చెందిన సత్య నిర్మల్ జిల్లా బాసరలో ఇంటిని అద్దెకు తీసుకుని నిజామాబాద్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్నారు. యామీన్, సయ్యద్ ఫరూక్ 20 పైగా కేసుల్లో జైలుకి వెళ్లి వచ్చారు. శనివారం నిజామాబాద్ నగరంలోని రైల్వేస్టేషన్లో పార్క్ చేసిన బైక్ని దొంగతనం చేసి, అదే బైక్పై చోరీ కోసం వెళ్తుండగా పోలీసులు పట్టుకుని విచారించారు. నిందితులు ఎడపల్లి పీఎస్ పరిధిలోని ఓ ఇంటితోపాటు పాన్షాప్లో, నగరంలోని మూడో టౌన్ పీఎస్ పరిధిలోని తాళం వేసి ఉన్న ఇంట్లో, జక్రాన్పల్లి పీఎస్ పరిధిలోని బెల్ట్షాప్లో, రైళ్లలో తిరుగుతూ సెల్ఫోన్ల చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. నిందితుల్లో సత్య పరారీలో ఉండగా, పట్టుబడ్డ నిందితుల నుంచి రూ.5 వేల నగదు, ఐదు సెల్ఫోన్లు, ఒక టీవీ, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. నిందితుల నుంచి దొంగసొత్తును కొన్న హైదరాబాద్లోని కొంపెల్లికి చెందిన అరవింద్ ప్రసాద్పైన కూడా కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్కు తరలించామన్నారు.
ముగ్గరి అరెస్ట్.. పరారీలో ఒకరు