
ఏదడిగినా కేసీఆర్ కాదనలేదు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అభివృద్ధి పనుల విషయంలో ఏదడిగినా కేసీఆర్ కాదనలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ప్రశాంత్రెడ్డి పలు విషయాలను గుర్తుచేసుకున్నారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..
మోతెలో తీర్మానం.. ముడుపు కట్టిన కేసీఆర్..
తీవ్రమైన కరువు సమస్యను ఎదుర్కొంటున్న వేల్పూర్ మండలంలోని మోతె గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కారం కావాలంటే స్వరాష్ట్రం సాధించుకోవాల్సిందేనని నిశ్చయించుకున్నారు. 2001లో కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశాక ఏకగ్రీవ తీర్మానం చేసి కేసీఆర్ వైపు నిలబడ్డారు. ఇదే స్ఫూర్తితో మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామస్తులు తీర్మానం చేసుకుని బీఆర్ఎస్కు జైకొట్టారు. తరువాత రాష్ట్రవ్యాప్తంగా వరుసగా అనేక గ్రామాల్లో బీఆర్ఎస్కు మద్దతు పెరిగింది. మోతె గ్రామానికి 2001 మే 5న కేసీఆర్ వచ్చి ఇక్కడి మట్టితో ముడుపు కట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో పాసయ్యాక 2014 మార్చి 28న కేసీఆర్ గ్రామానికి వచ్చి ముడుపు విప్పారు. తరువాత మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో 2015 జూలై 6 న ఇక్కడికి వచ్చి గ్రామంపై వరాలు కురిపించారు. గ్రామంలో చెరువు, మాటు కాలువ, పాఠశాల, ప్రత్యేకంగా పీహెచ్సీ, కొత్త గ్రామపంచాయతీ, రూ.2 కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణమయ్యాయి. అప్పుడు వేల్పూర్లోని మా పెంకుటిల్లులోనే కేసీఆర్ బస చేశారు.
తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నా..
స్వరాష్ట్రం వస్తేనే అనుకున్న విధంగా అభివృద్ధి సాధ్యమని, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలంటే చిన్ననీటి వనరులను పెపొందించుకోవాలని మా తండ్రి వేముల సురేందర్రెడ్డి చెప్పేవారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నా.
ఇక్కడ మొదలుపెట్టి..
చెక్డ్యాముల నుంచి మొదలు అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి ప్రయోగం ఇక్కడే చేశాం. ఇక్కడ సక్సెస్ చేశాక కేసీఆర్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అమలు చేశారు. ఎస్సారెస్పీ వరద కాలువకు కింది లెవెల్లో 16 తూములు ఏర్పాటు చేయడంతో 45 చెరువు లు నిండుతున్నాయి. కాళేశ్వరం ద్వారా ప్రతి రెండున్నర ఎకరాలకు ఒక అవుట్లెట్ పాయింట్ ఏర్పాటు చేశాం.
జగన్మోహన్రెడ్డికి పైలట్గా..
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వచ్చినప్పుడు ఆయనను రిసీవ్ చేసుకుని పైలట్గా వ్యవహరించే బాధ్యతను కేసీఆర్ నాకు అప్పగించారు. దీన్ని ఎప్పటికీ మరిచిపోలేను.
నీటిపారుదల విషయంలో ప్రతి ప్రయోగం ఇక్కడి నుంచే మొదలు
మోతె గ్రామస్తుల ఉద్యమ స్ఫూర్తి
అజరామరం
స్వరాష్ట్రం సిద్ధించాక సీఎం హోదాలో
మోతె వచ్చిన కేసీఆర్
రజతోత్సవ సభ నేపథ్యంలో
‘సాక్షి’తో వేముల ప్రశాంత్రెడ్డి

ఏదడిగినా కేసీఆర్ కాదనలేదు..