
మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య
బాన్సువాడ: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాన్సువాడలో చోటు చేసుకుంది. సీఐ అశోక్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ పట్టణానికి చెందిన రాంపురం నారాయణ(65) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తితో స్థానిక ఎల్లయ్య చెరువు కట్ట సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి
సిరికొండ: మండలంలోని పోత్నూర్ గ్రామానికి చెందిన పెరిక సాగర్(40) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై ఎల్ రామ్ తెలిపారు. సాగర్ గురువారం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని ఎస్సై తెలిపారు. శుక్రవారం చిన్నవాల్గోట్ శివారులోని వ్యవసాయ బావిలో సాగర్ మృదేహం లభ్యమైంది. కాలకృత్యాలకు వెళ్లి కాలు జారి బావిలో పడి మృతి చెందాడని మృతుడి భార్య స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఎలుగుబంటి దాడిలో మహిళకు గాయాలు
మోర్తాడ్: భీమ్గల్ మండలం రహత్నగర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం తునికి ఆకు సేకరణకు వెళ్లిన ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంజుల అనే మహిళ తునికి ఆకు కోస్తుండగా ఎలుగుబంటి వెనుక నుంచి వచ్చి దాడి చేసింది. ఆమె అరుపులు వేయడంతో పరిసరాల్లో ఉన్న ఆకు తెంపేవారు రావడంతో ఎలుగుబంటి పారిపోయింది. ఆమెను మెరుగైన వైద్యం కోసం ఆర్మూర్ ఆస్పత్రికి అంబులెన్స్లో తరలించారు.
వృద్ధురాలిని గాయపరిచి బంగారం చోరీ
నవీపేట: మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ముగ్గురు దొంగలు బీభత్సం సృష్టించారు. మండలంలోని నారాయణ్పూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు రాచర్ల కిష్టాబాయి మహారాష్ట్రలోని యాతాలం గ్రామంలో జరిగిన శుభకార్యానికి వెళ్లింది. సొంత గ్రామానికి వెళ్లేందుకు నవీపేట బస్టాండుకు వచ్చింది. మల విసర్జనకు టాయిలెట్కు వెళ్లగా ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఆమెను బలవంతంగా బయటకు పిలిచారు. బయటకు రాగానే ఆమైపె దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలను లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
రుద్రూర్: పొతంగల్ మండలం తిర్మలాపూర్ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హంగర్గ ఫారం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం, పొతంగల్ వైపు వస్తున్న ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఆర్ఎంపీ క్లినిక్ సీజ్
నిజామాబాద్ నాగారం: నగరంలోని న్యాల్కల్రోడ్లో ఉన్న ఆర్ఎంపీ క్లినిక్ను డీఎంహెచ్వో రాజశ్రీ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోగులకు కుట్లు వేయడం, ఇంజక్షన్లు ఇవ్వడం చూసి సదరు ఆర్ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్లినిక్ను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో సంబంధిత అధికారులు రాత్రి 9:40 ప్రాంతంలో క్లినిక్ను సీజ్ చేశారు.

మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య