
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
గాంధారి(ఎల్లారెడ్డి): ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రానికి తెచ్చి ధాన్యం రాశులను, ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేయాలని, ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. వాతావరణంలో మార్పులు వచ్చిన కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వర్షం పడితే ధాన్యం తడువకుండా రైతులకు తగినన్ని టార్పాలిన్ కవర్లను అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు , జిల్లా సహకార అధికారి రామ్మోహన్, తహసీల్దార్ రేణుక చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్, సింగిల్ విండో చైర్మన్ సాయికుమార్, ఏఎంసీ చైర్మన్ పరమేశ్వర్, గాంధారి మాజీ సర్పంచ్ సంజీవ్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, రైతులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన
బిచ్కుంద: మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. అర్హులైన వారు కట్టుకుంటామని ముందుకు వచ్చిన ప్రతి లబ్దిదారు పేరు ఇందిరమ్మ జాబితాలో చేర్చాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షలతో సొంతింటి కళ సాకారం చేసుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ సూచించారు.