
ఉపాధిహామీ మేట్పై చర్యలు తీసుకోవాలి
పెద్దకొడప్గల్(జుక్కల్): ఉపాధి హామీ పని కల్పించడంపై ఉపాధి హామీ మేట్ రాందాస్ నిర్లక్ష్యం వహిస్తున్నాడని కాటేపల్లి గ్రామస్తులు ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం కార్యాలయంలో వారు వినతిపత్రం అందజేశారు. మండలంలో కాటేపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు ఏప్రిల్ 24 నుంచి 30 వరకు పని కల్పించాలని మేట్కు రాసి ఇచ్చారు. అందులో కొందరికి మాత్రమే పని కల్పించి మిగితా వారికి పని కల్పించలేదని మస్టర్లలో పేర్లు రాని వారు వాపోయారు. పని అందరికీ ఉండాలని, లేకుంటే మొత్తం బంద్ చేయాలని వారు మేట్ రాందాస్ను ప్రశ్నించారు. గురు,శుక్రవారాలు ఉపాధి పని చేసినా, మస్టర్లో పేరు రాలేదని, ఆన్లైన్లో హాజరు వేయకపోతే ప్రభుత్వం కూలి డబ్బులు వేయదన్నారు. ఈవిషయమై ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేశారు.మార్చి నెలలో కొందరు కూలీలతో వ్యక్తిగత వ్యవసాయ పనులు చేయించుకొని హాజరు వేశారని, ఉపాధి పని చేయని వారికి హాజరు వేస్తున్నట్లు కూలీలు ఆరోపించారు. మేట్ రాందాస్పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.