
అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్
కేయూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ ఇవ్వనున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. పలు అకాడమిక్ సిలబస్ల మార్పు, పరీక్షలు, దూరవిద్యలో సర్టిఫికెట్ డిప్లొమా కోర్సులు, తదితర అంశాలపై చర్చించి ఆమోదించారు. ఒక క్లస్టర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల పరిధిలోకి వచ్చే అధ్యాపకులు ఆ క్లస్టర్ డిగ్రీ కళాశాల నుంచే పీహెచ్డీ గైడ్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎంతమందికి గైడ్షిప్ ఇవ్వనున్నది కొద్దిరోజుల్లో తేలనుంది. అదేవిధంగా కేయూ పరిధిలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, లా విద్య (నాన్ ప్రొఫెషనల్, ప్రొఫెషనల్) కోర్సుల్లో కొన్ని సంత్సరాలుగా ఫెయిల్ అయి బ్యాక్లాగ్ సబ్జెక్టులు కలిగిన విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. 2025–2026 విద్యా సంవత్సరంలో రెగ్యులర్ కోర్సుల సెమిస్టర్ల పరీక్షలతో వారు రాసుకునే అవకాశం కల్పిస్తారు. దూరవిద్యలోని ఇయర్వైజ్ స్కీం విద్యార్థులు కూడా బ్యాక్లాగ్ సబ్జెక్టులు రాసుకోవచ్చు. కేయూ దూరవిద్యలో 16వివిధ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టాలని, ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులో సిలబస్ మార్పునకు ఆమోదించారు. సమావేశంలో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, వివిధ విభాగాల డీన్లు, పలువురు పాలక మండలి సభ్యులు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.