హసన్పర్తి: మరోఐదు రోజుల్లో పెళ్లి. ఇంతలోనే వరుడు అదృశ్యమయ్యాడు. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన అతడి బైక్ పలివేల్పుల ఎస్సారెస్పీ కాల్వ కట్ట వద్ద లభ్యమైంది. ఈ మేరకు బాధితుడి తల్లి శకుంతల సోమవారం కేయూ పీఎస్లో ఫిర్యాదు చేశారు. నగరంలోని గోకులనగర్కు చెందిన భూక్యా కృష్ణ తేజ వివాహం ఈనెల 16న నర్సంపేటకు చెందిన ఓ యువతితో నిశ్చమైంది.
ఈ క్రమంలో పెళ్లి పత్రికలు పంచడానికి ఈనెల 10వ తేదీన వెళ్లిన కృష్ణ తేజ.. తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు ఆందోళనకు గురై బంధువులు, మిత్రుల ఇళ్లల్లో గాలించారు. ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా, ఎస్సారెస్పీ కాల్వ కట్ట వద్ద రెండు రోజుల నుంచి ఓ బైక్ పార్క్ చేసి ఉందనే సమాచారం మేరకు ఎస్సై రాజ్కుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. బైక్ను పరిశీలించగా అందులో పెళ్లి పత్రికలు లభ్యమయ్యారు. వెంటనే బాధితుడి కుటుంబీకులు సమాచారం అందించారు. కృష్ణ తేజ.. బైక్ పార్క్ చేసి ఎస్సారెస్పీ కాల్వలో కొట్టుకుపోయాడా? లేక పెళ్లి ఇష్టం లేక బైక్ పార్క్ చేసి పరారయ్యాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.