మంగళగిరి: ఓటింగ్ 100 శాతం సాధించడమే లక్ష్యంగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు హోలి సందర్భంగా కలర్ఫుల్ ఎలక్షన్–2024 కార్యక్రమం నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించినట్లు నియోజవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి తెలిపారు. పట్టణంలోని మిద్దె సెంటర్లో ఉన్న సీకే జూనియర్ కళాశాల ఆవరణలో సోమవారం హోలిని పురస్కరించుకుని కలర్ ఫుల్ ఎలక్షన్ –2024 నిర్వహించారు. రాజకుమారి మాట్లాడుతూ నియోజకవర్గంలో 300 పోలింగ్ బూత్లు 2,89,940 మంది ఓటర్లు ఉన్నారన్నారు. గత ఎన్నికలలో సీకే కళాశాలలోని 180 పోలింగ్ కేంద్రంలో అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదైందని, కేంద్రం పరిధిలోని ఓటర్లకు అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఓటు విలువను తెలియజేస్తూ మహిళలు వేసిన ముగ్గులు ఆలోచింపచేశాయని, ఓటరుగా నమోదైనందుకు గర్వపడుతున్నాను ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుంటాను, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతాను అనే నినాదంతో ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఓటరుగా నమోదు అయినందుకు గర్వపడుతున్నాను అనే నినాదాలతో కుర్చీలాట(మ్యుజికల్ చైర్), ముగ్గులు, పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది ఓటర్లతో కలిసి హోలి సంబరాలలో పాల్గొన్నారు. జేసీ హోలి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్కుమార్, అడిషనల్ కమిషనర్ ఎన్ ప్రకాశరావు, అసిస్టెంట్ కమిషనర్ బి శివారెడ్డి, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ రాజకుమారి కలర్ ఫుల్ ఎలక్షన్–2024పై అవగాహన ఓటర్లకు పలు రకాల పోటీలు విజేతలకు బహుమతులు పంపిణీ