మంత్రి విశ్వరూప్
అమలాపురం రూరల్: ప్రతి ఒక్కరు ఉన్నత విద్యను చదివితే అభివృద్ధి అనేది సాధ్యపడుతుందని, ఆ దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యావ్యాప్తికి ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. శుక్రవారం సవరప్పాలెం, వన్నె చింతలపూడి గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత సవరప్పాలెంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి ప్రారంభిం చారు. అనంతరం వన్నె చింతలపూడి గ్రామంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులైన రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన ,జగనన్న వసతి దీవెన, అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, బైజుస్ ట్యాబ్ల పంపిణీ వంటి విప్లవాత్మకమైన సంస్కరణలను విద్యారంగంలో తీసుకువచ్చిందన్నారు. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగపరుచుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దంగేటి డోలమణి, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామ్గోపాల్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కరేళ్ల రమేష్, సర్పంచులు సత్తి నాగేశ్వరమ్మ, నక్క కృష్ణవేణి, ఎంపీటీసీ సభ్యులు పరమట నాగమణి, ఉడుం రామకృష్ణ, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బొంతు గోవింద్ శెట్టి, జిల్లా కార్యదర్శి జంపన రమేష్రాజు పాల్గొన్నారు.