అమలాపురం రూరల్: విద్యార్థి దశలో యువత మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు అవ్వకుండా ఉండాలని ఏఎస్పీ ఖాదర్ భాషా అన్నారు. మాదక ద్రవ్యాల రవాణా నిరోధం, మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే దుష్పరిణామాలపై అమలాపురం ఆర్టీసీ డిపోలో శుక్రవారం అవగాహన సదస్సు జరిగింది. వివిధ డిపోల నుంచిహాజరైన ఆర్టీసీ ఉద్యోగులు, లాగిస్టిక్స్ కౌంటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఏఎస్పీ ఖాదర్, డీఏస్పీ అంబికా ప్రసాద్ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా జరగకుండా నిరోధించడానికి సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. విద్యార్థి దశలో యువత మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు అవ్వకుండా ఉండాలని, వాటి వలన వచ్చే దుష్పరిణామాలను వివరించారు. ఏఆర్ డీఏస్పీ విజయ సారథి, ఎస్ఈబీ డీఏస్పీగంగాధర్, సీపీలు క్రాంతికుమార్, శివరామరాజు మాధవ్, ఎస్సై ప్రభాకరరావు, డీఎం చల్లా సత్యనారాయణమూర్తి, ట్రాఫిక్ సీఐ ప్రతిమాకుమార్, గ్యారేజ్ ఇన్చార్జి జీఆర్ఎల్ దేవిపాల్గొన్నారు.
గురుకులం పరిశీలన
అల్లవరం: గోడిలోని బాలుర గురుకులాన్ని గురుకుల పాఠశాలల స్టేట్ సెక్రటరీ ఆర్.మహేష్కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల, విద్యార్థుల డార్మెటరీ, మరగుదొడ్లను పరిశీలించారు. బాలురు గురుకులంలోని మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.84 లక్షలు ఇటీవల మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో గురుకులంలో చేపట్టిన పనుల ప్రగతిపై అధికారులతో మాట్లాడారు. గురుకులంలో ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే గుర్తించి ప్రతిపాదనలు చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. గడువు లోగా పనులు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట డీసీఓ రాజకుమారి, పీఆర్ ఈఈ చంటిబాబు, డీఈ రాజ్కుమార్, సోషల్ వెల్ఫేర్ డీఈ సుబ్బరాజు, ప్రిన్సిపాల్ శ్యామ్ప్రసాద్, జేఈ సంపన్, చైర్మన్ కోట హనుమంతరావు ఉన్నారు.
సామాజిక సేవలో రిలయన్స్కు పురస్కారం
తాళ్లరేవు: కోస్తా తీరంలో భారీ ముడిచమురు ఉత్పత్తి సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీ (గాడిమొగ) తన సామాజిక సేవకుగానూ రారష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. దశాబ్దకాలంగా రిలయన్స్ సంస్థ విద్య, ఆరోగ్యం విభాగాలలో ఎనలేని సేవలను అందించడం, గర్భిణులు, రోగులకు పౌష్ఠికాహారం అందించడం, జిల్లాలో హెచ్ఐవీ ఎయిడ్స్ నిర్మూలనకు చేసిన కృషి తదితర సేవలకు సంబంధించి ఈ పురస్కారాన్ని అందజేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని విజయవాడలో జరిగిన ఏపీఎస్ఏ సీఎస్ బీవీ రాజేంద్రకుమార్ చేతుల మీదుగా రిలయన్స్ సీఎస్ఆర్ ప్రతినిధి పోలాప్రగడ సుబ్రహ్మణ్యం అందుకున్నారు.