సాక్షి మనీ మంత్ర: లాభాల్లో కొనసాగుతున్న దేశీయ సూచీలు
Published
Mon, Nov 6 2023 8:46 AM
Today Stock Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ప్రారంభం నుంచి లాభాల బాట పట్టాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 306.22 పాయింట్ల భారీ లాభంతో 64670.00 వద్ద, నిఫ్టీ 89.35 పాయింట్ల లాభంతో 19319.95 వద్ద ముందుకు సాగుతున్నాయి. ఈ రోజు ప్రారంభం నుంచి నిఫ్టీ, సెన్సెక్స్ లాభాలతో దూసుకెళుతున్నాయి.
గ్లోబల్గా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపునకు విరామం ఇవ్వడంతో స్టాక్మార్కెట్లు పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గతవారం అంతర్జాతీయ సూచీలన్నీ రాణించాయి. ఈ వారమూ అదే జోరు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్రైమాసిక ఫలితాలతో షేరు ఆధారిత కదలికలు కొనసాగొచ్చని తెలిపారు. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయాన్ని ప్రకటించనుంది. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ చమురు ధర స్వల్పంగా పెరిగి 85.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.12.43 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.402.69 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్, యాక్సిస్ బ్యాంక్, లార్సెన్ అండ్ టబ్రో (Larsen & Toubro) ఉన్నాయి. టైటాన్ కంపెనీ, ఎస్బీఐ, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) వంటివి నష్టాల జాబితాలో కొనసాగుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)