కొత్తగా.. సరికొత్తగా.. చూస్తే ఆశ్చర్యపోతారు! | Artificial Intelligence Made Changes In Sports Live Programmes | Sakshi
Sakshi News home page

కొత్తగా.. సరికొత్తగా.. చూస్తే ఆశ్చర్యపోతారు! యాడ్స్‌లో కొత్త పోకడ

Oct 8 2021 4:17 PM | Updated on Oct 8 2021 6:56 PM

Artificial Intelligence Made Changes In Sports Live Programmes - Sakshi

అడ్వర్‌టైజింగ్‌ రంగంలో ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ వేదికగా సరికొత్తగా యాడ్స్‌ను ప్రజెంట్‌ చేస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి ఏజెన్సీలు.

వేల కోట్ల రూపాయలు
నవంబరులో జరగబోయే 20 ట్వంటీ వరల్డ్‌ కప్‌ డిజిటల్‌ మీడియా హక్కులు సుమారు రూ.800 కోట్ల రూపాయలని ఇండస్ట్రీ వర్గాల అంచనా. ఇదే సమయంలో టెలివిజన్‌ ప్రసార హక్కులైతే ఏకంగా వేల కోట్ల రూపాయల్లోనే పలుకుతున్నాయి. ఇలా కోట్లాది రూపాయల డబ్బులు చెల్లించి స్పోర్ట్స్‌ ఈవెంట్‌ ప్రసార హక్కులు దక్కించుకున్న టీవీ ఛానల్స్‌, డిజిటల్‌ ప్లాట్‌ఫార్మ్స్‌ తమ పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవడంతో పాటు అధిక లాభాలు పొందేందుకు నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. 

తగ్గని డిమాండ్‌
క్రికెట్‌ మ్యాచ్‌లు వస్తుంటే ప్రతీ ఓవర్‌ మధ్యలో, వికెట్‌ పడ్డప్పుడు యాడ్స్‌ వస్తూనే ఉంటాయి. ఈ టైంలో పది సెకన్ల పాటు ఒక యాడ్‌ ప్రసారం చేసేందుకు పది లక్షల రూపాయల వరకు ఛార్జ్‌ చేస్తుంటారు. అయినా సరే క్రేజ్‌ ఉన్న స్పోర్ట్స్‌, గేమ్స్‌ విషయంలో ఎంతైనా చెల్లించడానికి కార్పొరేట్‌ కంపెనీలు పోటీ పడుతుంటా​యి. కోట్ల రూపాయల డబ్బులు వచ్చి పడుతున్నా.. సరే ఒకేసారి పలు రకాల యాడ్స్‌ ప్రసారం చేసే అవకాశం ఇప్పటి వరకు ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వేదిక అదే, గేమ్‌ అదే, అక్కడ ఆటగాళ్లు వాళ్లే కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించేది మాత్రం వేరే. 

వర్చువల్‌ రీప్లేస్‌మెంట్‌..
స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ ద్వారా అధిక ఆదాయం పొందేందుకు టెలివిజన్‌ కంపెనీలు, డిజిటల్‌ ప్లాట్‌ఫార్మ్స్‌ వర్చువల్‌ రీప్లేస్‌మెంట్‌ పెరిమీటర్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ఈ సరికొత్త  టెక్నాలజీని సపోర్ట్‌ చేసే కెమెరాలు ముందుగా ‘వర్చువల్‌ హెడ్‌’ (సాధారణంగా ఆటగాడు)ని గుర్తిస్తాయి. అతని కదలికలకు అనుగుణంగా బ్యాక్‌గ్రౌండ్‌లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు వీలుగా వీడియోను చిత్రీకరిస్తాయి. 


మార్చేస్తుంది
సింపుల్‌గా చెప్పాలంటే క్రికెట్‌ మ్యాచ్‌లో బాల్‌ బౌండరీ లైను దగ్గరికి వెళ్లినప్పుడు లైన్‌ అవతల మనకు వివిధ కంపెనీలు సైనుబోర్డులు, హోర్డింగులు కనపిస్తుంటాయి. ఇప్పటి వరకు ఉన్న పద్దతి ప్రకారం ఏ దేశంలో ఆ ఫుటేజీ ప్రసారమైనా బౌండరీ లైను ఆవల ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ ఒక్కటే. కానీ వర్చువల్‌ రీప్లేస్‌మెంట్‌ పెరిమీటర్‌ టెక్నాలజీలో వివిధ ప్రాంతాలను, అక్కడ కుదుర్చుకున్న ప్రసార ఒప్పందాలను బట్టి బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్‌ ఛేంజ్‌ అవుతుంది. 


ఎక్కడిదక్కడే
ఉదాహరణకి ఇండియా - ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌ జరిగితే గతంలో బౌండరీ లైను దగ్గర ఎక్స్‌ అనే కంపెనీకి చెందిన బోర్డు ఉంటే ఇటు ఇండియా అటు ఆస్ట్రేలియాలలో టీవీలో ప్రసారమయ్యే మ్యాచ్‌లో ఎక్స్‌ కంపెనీ బోర్డు మాత్రమే కనిపించేది. కానీ కొత్తగా వచ్చిన టెక్నాలజీ పుణ్యమా అని ఆస్ట్రేలియాలో ఒక రకమైన బోర్డు కనిపిస్తే, ఇండియాలో మరో రకం కంపెనీ బోర్డు కనిపిస్తుంది. 

ఆగేది లేదు
వేర్వేరు దేశాల్లో ఆయా క్రీడలకు ఉండే డిమాండ్‌, అక్కడి మార్కెట్‌ తదితర అంశాలను బేరీజు వేసుకుని యాడ్‌ స్లాట్‌ రేట్లలో హెచ్చు తగ్గులు చేసేందుకు వీలుగా యాడ్‌ ఏజెన్సీలు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం స్పోర్ట్స్‌లో ఫుట్‌బాల్‌లో ఈ టెక్నాలజీ ఎక్కువగా వాడుతున్నారు. త్వరలోనే క్రికెట్‌ ప్రసారాల్లో కూడా తేనున్నారు. ఆ తర్వాత ఈ టెక్నాలజీని త్వరలో సినిమా ఫంక‌్షన్లు, ఆథ్యాత్మిక కార్యక్రమాలు, లాంఛింగ్‌ ఈవెంట్స్‌ కూడా విస్తరించే పనిలో ఉన్నాయి యాడ్‌ ఏజెన్సీలు.

చదవండి : థియేటర్స్‌ Vs హోమ్‌ థియేటర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement