
ఆటో డ్రైవర్పై దాడి
మదనపల్లె రూరల్ : ఆటో డ్రైవర్పై నలుగురు వ్యక్తులు దాడి చేసిన సంఘటన గురువారం మదనపల్లెలో జరిగింది. మండలంలోని పోతబోలు పంచాయతీ గాండ్లపల్లికు చెందిన మహేష్(33) ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం పట్టణంలోని చిత్తూర్ బస్టాండ్ నుంచి ఆటోలో ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళుతుండగా, మార్గమధ్యంలోని సీటీఎం రోడ్డులో ప్రమాదవశాత్తు మరో ద్విచక్ర వాహనాన్ని స్వల్పంగా ఢీకొన్నాడు. ఆటో ఆపి ద్విచక్ర వాహనదారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుండగానే, ద్విచక్ర వాహనం లోని ఇద్దరు వ్యక్తులతో పాటు మరో వాహనంలోని ఇద్దరు వ్యక్తులు కలిసి మహేష్ పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. స్థానికుల సాయంతో మహేష్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందాడు. దాడి ఘటనపై టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రోడ్డు ప్రమాదంలో
కదిరి వాసికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో కదిరివాసి తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమించిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన బాలాజీ నాయక్ (35), కుటుంబ సభ్యులు మరికొందరితో కలిసి చౌడేపల్లి మండలం బోయకొండకు వచ్చారు. మొక్కుబడి తీర్చుకుని తిరిగి స్వగ్రామానికి పయనమయ్యారు. కుటుంబ సభ్యులను వ్యానులో ఎక్కించి, బాలాజీ నాయక్ ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. మార్గమధ్యంలోని వలసపల్లె వద్ద మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
జీపు– ఆటో ఢీకొని
ఇరువురికి తీవ్ర గాయాలు
లక్కిరెడ్డిపల్లి : రాయచోటి–వేంపల్లి మార్గమధ్యంలోని నెహ్రూ నగర్కు వెళ్లే సమీపంలో గురువారం ఆటో–జీపు ఢీ కొన్న సంఘటనలో జీపులో ప్రయాణిస్తున్న డ్రైవర్తోపాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆంజనేయులుతోపాటు జీప్ డ్రైవర్ బాబా అనే వ్యక్తిని 108 ద్వారా లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యంకోసం రాయచోటి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ మేరకు లక్కిరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆటో డ్రైవర్పై దాడి