మదనపల్లె : టమాటా మార్కెట్లో బుధవారం వేలంపాటలు నిలిచిపోయాయి. మదనపల్లె లారీ అసోసియేషన్ సభ్యులు టమాటా లోడింగ్కు వచ్చిన ఇతర ప్రాంతాల లారీలను మార్కెట్ లోపలకు రాకుండా అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. దీంతో వ్యాపారులు వేలంపాటల్లో పాల్గొనలేదు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కావాల్సిన వేలం పాటలు మధ్యాహ్నం.2.45 గంటల వరకు ప్రారంభం కాలేదు. వేలం పూర్తి చేస్తే స్వగ్రామాలకు వెళ్లేందుకు వేచిచూస్తున్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు, పంట దిగుబడులు లేక నష్టాల్లో కూరుకుపోయిన తమను ఇబ్బందులకు గురిచేయడమేంటని ఆగ్రహించి టమాటాలు రోడ్డుపై పారవేసి నిరసన తెలిపారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... మదనపల్లె టమాటా మార్కెట్లో యూనియన్, అసోసియేషన్ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ల ఆధిపత్యంలోనే నడుస్తూ, రైతులను నిలువునా దోపిడీకి గురిచేస్తున్నారని వాపోయారు. ఇతర ప్రాంతాల లారీలు రాకూడదని ,చెప్పేందుకు వారికి ఏం సంబంధం ఉందని నిలదీశారు. మార్కెట్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్న లారీ అసోసియేషన్ నాయకులు, మండీ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు.మార్కెట్కమిటీ సెక్రటరీ అభిలాష్ వివరణ ఇస్తూ... లారీ అసోసియేషన్ సభ్యులు, మండీ యజమానులతో చర్చలు జరిపి ఎట్టకేలకు సమస్య పరిష్కారానికి కృషి చేశామన్నారు.
కొనుగోళ్లు నిలిపివేసిన వ్యాపారులు