పాతకక్షతోనే ఆర్టీసీ డ్రైవరు హత్య | Sakshi
Sakshi News home page

పాతకక్షతోనే ఆర్టీసీ డ్రైవరు హత్య

Published Thu, Nov 16 2023 12:50 AM

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు  - Sakshi

కలికిరి : పాతకక్ష మనసులో పెట్టుకుని పక్కా పథకం ప్రకారం ఆర్టీసీ డ్రైవరు సాలి రవి(52)ని హత్య చేశారని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని గుట్టపాళెం గ్రామం నల్లగుట్ట హరిజనవాడకు చెందిన ఎస్‌.రవి పీలేరు ఆర్టీసీ డిపోలో డ్రైవరుగా విధులు నిర్వహిస్తున్నాడు.సోమవారం ఉదయం యధావిధిగా డ్యూటీకి బయల్దేరాడు. అతను వెళ్లే దారిలో కాపుకాచిన గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. దారిలో రక్తపు మరకలను బుధవారం గుర్తించిన స్థానికులు మృతుని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక సర్పంచ్‌ వెంకటరెడ్డి, కుటుంబ సభ్యులు మృతుని చెప్పుల ఆధారంగా హత్య జరిగినట్లు గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు కదిరి రైల్వే సీఐ నాగరాజ, వాల్మీకిపురం, పీలేరు సీఐలు సురేష్‌, మోహన్‌రెడ్డి, కలికిరి ఎస్‌ఐ రహీముల్లా, రైల్వే హెచ్‌సీ మహబూబ్‌బాషా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆనవాళ్లను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలికిరి నుంచి తిరుపతి రుయాకు తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల సమాచారం మేరకు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతుడు సౌమ్యుడు, మంచి వ్యక్తిగా గుర్తింపు ఉండటంతో స్థానికులు విచారం వ్యక్తం చేశారు. గ్రామం సమీపంలోనే హత్యకు పాల్పడ్డ గుర్తుతెలియని వ్యక్తులు ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement