యాక్షన్ తో... ప్రేక్షకులకు ట్రిపుల్ ధమాకా!
దీపికా పదుకొణె... పుట్టింది డెన్మార్క్లో... పెరిగింది బెంగుళూరులో! మన దక్షిణాది అమ్మాయేనండీ! హీరోయిన్గా బాలీవుడ్లో అడుగుపెట్టి ఓ దుమ్ము దులిపేశారు. ఇప్పుడు యాక్షన్ సినిమా ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’తో హాలీవుడ్లో అడుగు పెడుతున్నారు. ఈ సినిమాతో యాక్షన్ ప్రియులకు, అభిమానులకు సినిమా పేరుకు తగ్గట్లే ట్రిపుల్ ధమాకా ఇస్తానంటున్నారు.
► ఈతరం భారతీయ కథానాయికల్లో దీపికా పదుకొణెది ఒక ప్రత్యేక స్థానం. పలు అద్భుతమైన పాత్రలతో బాలీవుడ్లో హీరోయిన్ గా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడామె హాలీవుడ్లో అడుగు పెడుతున్నారు. దీపిక నటించిన మొదటి హాలీవుడ్ సినిమా ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’. సూపర్హిట్ ఫ్రాంచైజీ ‘ట్రిపుల్ ఎక్స్’ సిరీస్లో వస్తున్న ఈ మూడో సినిమాలో విన్ డీజిల్ హీరో. దీపికా పదుకొణె హీరోయిన్ . ఈ సినిమాలోని సెరెనా పాత్రలో దీపిక నటన, ఆహార్యం ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ట్రైలర్లో స్పష్టంగా కనిపించింది. అందులోని దీపిక యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో అంతకు మించి యాక్షన్ ఉంటుందని దీపిక తెలిపారు.
► యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీన్స్లో దీపిక అదరగొట్టారట! ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవడం ఆమెకు హెల్ప్ అయిందట! ఈ విషయమై దీపికా పదుకొణె మాట్లాడుతూ – ‘‘ట్రిపుల్ ఎక్స్ సిరీస్ అంటేనే యాక్షన్ అడ్వెంచర్స్కు పెట్టింది పేరు. ఆ సిరీస్లో మూడో పార్ట్గా వస్తోన్న ఈ సినిమాలోనూ యాక్షన్ సీన్స్ కళ్ళు చెదిరే స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా... నా పాత్ర కోసం నేనెంతో కష్టపడి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నా. ఆ ట్రైనింగ్, రిహార్సల్స్, షూటింగ్... ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ ఫేజ్నూ ఎంజాయ్ చేశా’’ అన్నారు.
► ‘పారమౌంట్ పిక్చర్స్, రివల్యూన్స్ స్టూడియోస్’ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను ఇండియాలో ‘వయా కం 18’ సంస్థ విడుదల చేస్తోంది. ప్రపంచ దేశాలన్నింటి కన్నా ముందుగా ఈ చిత్రం ఇండియాలో విడుదల కావడం విశేషం. ఈనెల 14న ఇండియాలో, 20న ప్రపంచవ్యాప్తంగా ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ విడుదల కానుంది.