-
హై అలర్ట్.. శంషాబాద్ ఎయిర్పోర్టులోకి చిరుత
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత కలకలం రేగింది. గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత ఎయిర్పోర్టు లోపలికి వచ్చింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్టు ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్లో అలారం మోగింది.దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత కదలికలు కనిపించాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు ఎయిర్పోర్టు సెక్యూరిటీ అధికారులు సమాచారమిచ్చారు. సమాచారమందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. చిరుతను పట్టుకునేందుట్రాప్లు, బోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. -
ఆ 106 ఎకరాలు అటవీ శాఖవే.. ప్రైవేట్ వ్యక్తిది కాదన్న సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ/భూపాలపల్లి: అటవీశాఖకు ఓ వ్యక్తికి మధ్య చోటు చేసుకున్న భూ వివాదానికి 40 ఏళ్ల తర్వాత తెరపడింది. వరంగల్ జిల్లాలోని 106.34 ఎకరాల అటవీ భూమి ప్రైవేట్ భూమి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.అత్యంత విలువైన ఆ భూమి అటవీశాఖకు చెందినదేనంటూ గురువారం తీర్పునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరే‹Ù, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీం ధర్మాస నం గురువారం కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తికి చెరో రూ.5 లక్షలు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని జాతీయ న్యాయసేవల సంస్థ (నల్సా)కు రెండు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది. వరంగల్ జిల్లా కొంపల్లిలోని సర్వే నంబర్ 171/3 నుంచి 171/7 వరకు ఉన్న 106.34 ఎకరాలు తమవేనని అబ్దుల్ఖాసీం తదితరులు ప్రకటించుకున్నారు. ఈ మేరకు 1981లో జాయింట్ కలెక్టర్ను ఆశ్రయించారు. జాయింట్ కలెక్టర్ నిరాకరించడంతో 1984లో ఆ భూమిని డీ నోటిఫై చేయాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీంతోపాటు వరంగల్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు. అక్కడ అనుకూలంగా ఆదేశాలు వచ్చినప్పటికీ ఉమ్మడి హైకోర్టు ఆ ఆదేశాలను కొట్టివేసింది. అనంతరం ఆ వ్యక్తి రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. తెలంగాణ హైకోర్టు ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సుందరేష్ ధర్మాసనం గురువారం ఆదేశాలు వెలువరించింది. భూమి తమదని చెప్పుకోవటానికి ఆ వ్యక్తులకు ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్ సమయంలో తెలంగాణ హైకోర్టు, రెవెన్యూ అధికారులు సదరు వ్యక్తులకు అనుకూలంగా నివేదికలు ఇవ్వడం.. సుప్రీంకోర్టులోనూ అనుకూలంగా రిజాయిండర్ దాఖలు చేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వాద, ప్రతివాదులకు జరిమానా విధిస్తూ అడవుల ప్రాముఖ్యత తెలుసుకోవాలని సూచించింది. అడవుల ప్రాధాన్యతను గుర్తించడంలో మనుషులకు ‘మతిమరుపు’ ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అడవులు నిస్వార్థంగా మాతృసేవ అందిస్తున్నప్పటికీ ప్రజలు నాశనం చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అడవులను పరిరక్షించడం మనుషుల బాధ్యత అని వాటి క్షీణత వల్ల తామే నష్టపోతామన్న విషయాన్ని గుర్తెరగాలని సూచించింది. పర్యావరణ కేంద్రీకృత విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలని తెలిపింది. అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులపై చర్యలు: డీఎఫ్ఓ ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్లను దాఖలు చేసిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు డీఎఫ్ఓ వసంత తెలిపారు. ఈ కేసులో అటవీశాఖ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, ఏఓఆర్ శ్రావణ్కుమార్ వాదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన సందర్భంగా అటవీశాఖ ఆ భూములు తమ శాఖకే చెందుతాయని వాదించగా, రెవెన్యూ శాఖ మాత్రం ఆ భూమిపై ప్రైవేట్ వ్యక్తికే హక్కులున్నాయని అఫిడవిట్లు దాఖలు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రం నుంచి రెండు ప్రభుత్వ శాఖలు విభిన్న వాదనలు వినిపించగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకే వాదనను దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని గత అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశించినట్లు డీఎఫ్ఓ తెలిపారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ దాఖలు చేసిన అఫిడవిట్లో సదరు 106.34 ఎకరాలను అటవీ భూమిగా స్పష్టంచేశారు. ఈ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించి దాన్ని అటవీ భూమిగా గుర్తిస్తూ తీర్పు వెలువరించినట్లు వసంత తెలిపారు. ఆ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుంది. -
అగ్గి రాజుకుంటోంది
సాక్షి, హైదరాబాద్ : అడవుల్లో ‘అగ్గి’ రాజుకుంటోంది. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అడవుల్లో అగ్నిప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే 1,500లకు పైగా అగ్నిప్రమాదాలు రిపోర్ట్ కాగా నల్లమల, ములుగు, ఇతర ప్రాంతాల్లోని 6 వేల హెక్లార్లలో అటవీభూమికి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ♦ రాష్ట్రంలోని మూడోవంతు దాకా అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు /ప్రమాదాలు పొంచి ఉన్నాయని, అడవులకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో (ఫారెస్ట్ ఫ్రింజ్ ఏరియా) మూడో వంతు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి అగ్ని ప్రమాదా లకు సంబంధించి పదిహేను ఏళ్లుగా సేకరించిన సమాచారం, డేటా ఆధారంగా చేసిన విశ్లేషణల్లో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. ♦ తెలంగాణవ్యాప్తంగా మూడువేలకు పైగా ఫారెస్ట్ బీట్లు ఉన్నాయి. ప్రతీ ఫారెస్ట్ బీట్లో ఫైర్బ్లోయర్లు, రేక్స్, పారలు, ఫైర్ బీటర్స్, సిబ్బందికి అగ్నినిరోధక దుస్తులు, బూట్లు, హెల్మెట్లు వంటివి అందుబాటులో ఉండాలి. అయితే ప్రస్తుతం 550 ఫైర్బ్లోయర్లు ఉండగా వాటిలో పదిశాతం వరకు మరమ్మతులు చేయాల్సి ఉందని సమచారం. ♦ వేసవిలో అగ్నిప్రమాదాలు అధికంగా జరిగే అవకాశమున్న రోజులలో (పీక్ సీజన్లో) కేవలం 95 ‘క్విక్ రెస్పాన్స్ టీమ్స్’ క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్నట్టుగా వెల్లడైంది. దీనిని బట్టి అడవుల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు సంబంధించి అధికా రులు పూర్తిస్థాయిలో సన్నద్ధమై లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ వాదనను అటవీశాఖ అధికారులు ఏకీభవించడం లేదు. ♦ ములుగు, అమ్రాబాద్, ఇతర అటవీ ప్రాంతాల్లో కావాలనే అగ్ని ప్రమాదాలకు పాల్పడుతున్న వారిని గురించి వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద కేసులు పెట్టామని, ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి వాటికి పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు అత్యధికంగా మానవ తప్పిదాలతోనే ఈ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అయితే ఇవి చిన్న చిన్నవే కావడంతో ఎక్కువ నష్టం జరగకుండా ఆర్పేస్తున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటవీశాఖ ‘ఫారెస్ట్ఫైర్స్’ చాలా దగ్గరగా పర్యవేక్షిస్తోందని, ఈ మంటల అదుపునకు వెంటనే చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 21,739 కి.మీ పరిధిలో ఫైర్లైన్స్ వేయడంతో పాటు, అడవులకు ఆనుకుని 11వేల కి.మీలలో ‘పెరిఫెరల్ ట్రెంచెస్’ తవ్వి మంటల అదుపునకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అరణ్యభవన్లో రాష్ట్రస్థాయిలో ఫైర్ మానిటరింగ్, కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షిస్తూ ,ఫైర్ అలర్ట్స్ కోసం టోల్ఫ్రీ నంబరు, వాట్సాప్నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. అగ్గి ప్రమాదాలకు అవకాశం ఇలా.. ♦ రాష్ట్రంలో మొత్తం 53 అటవీ డివజన్లు ఉండగా, వాటిలో 23 దాకా హై–ఫైర్ ప్రోన్గా గుర్తించారు ♦ 1,208 ఫారెస్ట్ రేంజ్లకు గాను 45 రేంజ్లలో హై–ప్రోన్ రేంజేస్గా ఉన్నాయి ♦ పదివేల ఫారెస్ట్ కంపార్ట్ మెంట్లు (ఒక్కోటి 250 నుంచి 500 హెక్టార్లు కవర్ చేస్తుంది) ఉన్నాయి ♦ వీటిలో 1,120 కంపార్ట్మెంట్ల (హై–ఫైర్ ప్రోన్) దాకా పెద్ద అగ్నిప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు ♦ 1,700లదాకా మధ్యంతరంగా (మీడియం–ఫైర్ప్రోన్) అగ్నిప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు ♦ 4,260 దాకా అటవీ సమీప గ్రామాల్లో అగ్నిప్రమాదాలకు అవకాశం ♦ వీటిలో 1,250లకుపైగానివాస ప్రాంతాల్లో అత్యధికంగా ప్రమాదాలు జరిగే చాన్స్. -
ఏనుగు దాడిలో మరో రైతు మృతి
పెంచికల్పేట్ (సిర్పూర్): మహారాష్ట్ర మీదుగా ప్రాణహిత నది దాటి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి అడుగుపెట్టిన ఏనుగు మరో రైతు ను బలితీసుకుంది. చింతలమానెపల్లి మండలం బూరెపల్లి గ్రామ శి వారు మిరప చేనులో పని చేసుకుంటున్న రైతు అల్లూరి శంకర్ను బుధవారం పొట్టన పెట్టుకోగా.. గురువారం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తున్న పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన కారు పోశన్న(60)పై దాడి చేసి చంపేసింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం వేకువజామున పంటకు నీళ్లు పెట్టేందుకు రైతు పోశన్న పొలానికి వెళ్లగా, రహదారికి సమీపంలోని పొలం వద్ద ఉన్న ఏనుగు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఏనుగు రోడ్డుపైకి రావడంతో అక్కడే వాకింగ్ చేస్తున్న యువకులు గమనించి పరుగులు తీసి ఫోన్ ద్వారా గ్రామస్తులకు విషయం తెలియజేశారు. మృతుడికి భార్య సుశీల, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలాన్ని అదనపు కలెక్టర్ వేణు, కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, అటవీ అధి కారులు పరిశీలించారు. ఏనుగు దాడి నేపథ్యంలో దహెగాం, చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల్లో 144 సెక్షన్ విధించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీశాఖ అధికారులతో వాగ్వాదం బుధవారమే ఓ రైతు ఏనుగు దాడిలో మృతిచెందినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అందువల్లే గురువారం పోశన్న ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో అటవీ వర్గాలపై దాడికి యత్నించడంతో అక్కడే ఉన్న డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామస్తులను అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్గ్రేషియా, ఐదెకరాల వ్యవసాయ భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అటవీశాఖలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశమిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. లోడుపల్లి అడవుల్లోకి గజరాజు గురువారం రైతును చంపిన ఏనుగు మళ్లీ రాత్రి 8 గంటల కు కొండపల్లి టర్నింగ్ వద్ద కనిపించింది. అటు నుంచి లోడుపల్లి అడవుల్లోకి వెళ్లినట్టు గుర్తించారు. పెంచికల్పేట్– సలుగుపల్లి రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. ఏనుగుకు హాని తలపెట్టొద్దు.. బెజ్జూర్: కుమురంభీం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుకు ప్రజలు ఎలాంటి హానీ తలపెట్టొద్దని రాష్ట్ర వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ పర్గేన్ సూచించారు. బెజ్జూర్ రేంజ్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. కాగజ్నగర్ డివిజన్ ప్రాంతంలో దాని ముఖ్య ఆహారం చెరుకు దొరకకపోవడంతో తిరిగి చత్తీస్గఢ్కు వెళ్లే అవకాశం ఉందన్నారు. అటవీశాఖ అప్రమత్తం సాక్షి, హైదరాబాద్: ఏనుగు సంచరిస్తున్న ప్రదేశాలలో అటవీశాఖ అధికారులు.. సమీప గ్రామాలలోని ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతీ ఒక్క నివాసాన్ని సందర్శించి వారిని బయటికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. హుల్లా పార్టీ (సంప్రదాయ పద్ధతిలో వెలిగించిన మషాల్, డప్పులు కొట్టడం ద్వారా ఏనుగును తరిమికొట్టడానికి ఉపయోగించే ప్రొఫెషనల్) మహారాష్ట్రలోని సమీప అటవీ ప్రాంతాల నుండి కూడా రప్పించి ఏనుగును జనావాసం నుంచి అటవీ ప్రాంతంలోకి మళ్లించే యత్నం చేస్తున్నారు. -
పోలీసులు X గిరిజనులు
సత్తుపల్లి: గిరిజన వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన సత్తుపల్లి పోలీసులపై గిరిజనులు దాడికి దిగారు. ఘటన పూర్వాపరాలిలా.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు శివారు చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలోని 400 హెక్టార్లలో కొంతకాలంగా స్థానిక గిరిజనులు, స్థానికేతర గిరిజనుల మధ్య పోడు వివాదం నడుస్తోంది. గిరిజనులకు నేతృత్వం వహిస్తున్న కూరం మహేంద్రను అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు శనివారం సత్తుపల్లి పోలీస్స్టేషన్కు సీఐ టి.కిరణ్ పిలిపించి విచారించి పంపించారు. ఈక్రమంలో చంద్రాయపాలెంకు చెందిన గిరిజనులు ఆదివారం ఉదయం డయల్ 100కు ఫోన్ చేసి స్థానికేతర గిరిజనులు తమ భూముల్లోకి వస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో తొలుత ఎస్సై రాజు, ముగ్గురు పోలీసు సిబ్బంది వెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న సమాచారంతో సీఐ టి.కిరణ్ మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి చేరుకున్నారు. సీఐ కిరణ్పై మెరుపుదాడి.. అదే సమయంలో గిరిజన నేత కూరం మహేంద్ర ఫోన్లో మాట్లాడుతుండగా, ‘నిన్ననే కదా నీతో మాట్లాడి పంపించింది.. మళ్లీ గొడవ ఏమిటి’ అంటూ సీఐ కిరణ్ ఆయన ఫోన్ స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఇంతలో ఒక్కసారిగా గిరిజన మహిళలు కోపోద్రిక్తులై సీఐ కిరణ్ను చుట్టుముట్టి పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో ఉన్న కానిస్టేబుళ్లు పి.నర్సింహారావు, ఇమ్రాన్, సత్యనారాయణ, నరేష్ కలిసి సీఐ కిరణ్ను కాపాడుకునే ప్రయత్నంలో చుట్టూ రక్షణ కవచంలా నిలిచి పోలీస్ వ్యాన్ వైపు తీసుకొస్తుండగా గిరిజనులు కర్రలతో వెంబడించి దాడి చేశారు. అతి కష్టంమీద అక్కడి నుంచి సీఐ కిరణ్ను పోలీసులు తీసుకొని బయ టపడ్డారు. ఈ ఘటనలో సీఐ కిరణ్ చొక్కా చిరిగిపోయింది. పోలీస్ పికెట్ ఏర్పాటు విషయం తెలుసుకుని కల్లూరు ఏసీపీ రఘు, రూరల్ సీఐ వెంకటేశం, డివిజన్లోని ఎస్సైలు, పెద్ద సంఖ్యలో సిబ్బంది చంద్రాయపాలెం బయలుదేరారు. మార్గమధ్యలో బుగ్గపాడు శివారులో పోలీసులపై దాడి చేసిన గిరిజనులు గుంపులుగా వస్తుండగా పోలీసులు వారిని చుట్టుముట్టారు. గిరిజనులు ప్రతిఘటించటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి కూరం మహేంద్రతో సహా గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
అడవి ఒడికి పులి కూనలు
పెద్దదోర్నాల: తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్లో ఆశ్రయం పొందుతున్న పులి పిల్లలు అతి త్వరలో నల్లమల అభయారణ్యంలో అడుగిడనున్నాయి. తల్లినుంచి తప్పిపోయి జనారణ్యంలో దొరికిన పులి కూనలకు నల్లమల అభయారణ్యంలోని ఇతర జంతువులను వేటాడటం నేర్పించేందుకు భారీ టైగర్ ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సుమారు 14 నెలల క్రితం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో నాలుగు ఆడ పులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి దిక్కుతోచని స్థితిలో ప్రజల కంటపడిన విషయం విదితమే. తల్లి జాడ లేకపోవటంతో పులి పిల్లలను అటవీ శాఖ సిబ్బంది తిరుపతిలోని వెంకటేశ్వర జూ పార్కుకు తరలించి సంరక్షిస్తున్నారు. ఆరోగ్యం విషమించి ఓ పులిపిల్ల మృతి చెందగా.. మిగిలిన పులి పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా నామకరణం చేశారు. మూడు పిల్లలు పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని అటవీ వాతావరణంలో వదిలి పెట్టేందుకు అటవీ శాఖ నిర్ణయం తీసుకోవటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి ప్రయోగం తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా పులి పిల్లల సంరక్షణ కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా కొర్రప్రోలు రేంజి పరిధిలోని పెద్దపెంటలో ఏర్పాటు చేశారు. తిరుపతి జూలో పెరుగుతున్న పెద్దపులులు సహజసిద్ధంగా వాటి ఆహారాన్ని అవి వేటాడగలిగేలా చేయటంతోపాటు అనాథలైన, తీవ్ర గాయాల పాలైన పెద్దపులులను ఇక్కడి నర్సరీ ఎన్క్లోజర్లలో పెట్టి సంరక్షిస్తారు. పులుల సంరక్షణకు అక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో 15 హెక్టార్లలో ప్రత్యేకమైన ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ పులులను సంరక్షించేందుకు ఎల్లవేళలా వెటర్నరీ వైద్యులు ఎన్క్లోజర్ల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుపతి జూ పార్కులో ఉన్న పులి పిల్లలు వేటాడే సహజసిద్ధ గుణాన్ని మరిచిపోయి జూ అధికారులు అందజేసే ఆహారంతోనే జీవిస్తున్నాయి. వాటిని జూ పార్కు నుంచి తరలించి నేరుగా అభయారణ్యంలో వదిలి పెడితే అవి ప్రమాదాల బారినపడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వాటిని ఎన్క్లోజర్లలో ఉంచుతారు. స్వతహాగా కొన్ని వన్యప్రాణులను వేటాడి ఆహారాన్ని అవి సేకరించుకోగలిగేలా చూస్తారు. పులి పిల్లలు వేట నేర్చుకోవటం కోసం కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్స్ జూ పార్కు నుంచి ప్రత్యేకంగా 37 చారల దుప్పులను నల్లమలకు తరలించి వాటిని ఎన్క్లోజర్లలో సంరక్షిస్తున్నారు. కొద్దిరోజుల అనంతరం వీటిని పులుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లలో వదలటం ద్వారా పులులకు వేటాడటాన్ని అలవాటు చేస్తారు. అవి వ్యక్తిగతంగా 50 వన్యప్రాణులను వేటాడిన తరువాత వాటి శక్తి యుక్తులను గుర్తించి తదుపరి చర్యలను తీసుకుంటారు. చారల దుప్పుల కోసం ప్రత్యేక ఎన్క్లోజర్ కాకినాడ నుంచి ప్రత్యేకంగా రప్పించిన చారల దుప్పుల కోసం కొర్రప్రోలు రేంజి పరిధిలోని పెద్దపెంటలో 20 మీటర్ల పొడవు, వెడల్పుతో ప్రత్యేకంగా ఓ ఎన్క్లోజర్ను ఏర్పాటు చేశారు. వీటికోసం ఎన్క్లోజర్ బయట రూ.2.50 లక్షలతో సోలార్ బోరు అమర్చారు. దానినుంచి ఎన్క్లోజర్లోకి ప్రత్యేకంగా పైప్లైన్ను ఏర్పాటు చేసి నీటిని విడుదల చేస్తున్నారు. వీటి అవసరాలను తీర్చేందుకు సాసర్పిట్లు, నీటి గుంతలను ఏర్పాటు చేశారు. వేసవిని తట్టుకునేలా ఎన్క్లోజర్ చలువ పందిళ్లు వేసి నీటిని వెదజల్లేలా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. వీటి ఆహారం కోసం వినుకొండ, మార్కాపురం ప్రాంతాల నుంచి సుబాబుల్, బుల్ ఫీడ్ను రప్పించి ఆహారంగా వేస్తున్నారు. చారల దుప్పులు సంతానోత్పత్తి చేసేలా పెద్దదోర్నాల రేంజి పరిధిలోని తుమ్మలబైలు వద్ద ఒక ఎన్క్లోజర్, నెక్కంటి రేంజి పరిధిలో మరో రెండు ఎన్క్లోజర్లను సిద్ధం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన ఎన్క్లోజర్ల ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన టైగర్ ఎన్క్లోజర్లను సిద్ధం చేస్తున్నాం. కాకినాడ నుంచి ఇక్కడకు రప్పించిన చారల దుప్పుల కోసం కూడా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి సోలార్ బోర్ ద్వారా నీరు, ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. పులి పిల్లలకు వేటాడటంలో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – ప్రసన్నజ్యోతి, ఫారెస్ట్ రేంజి అధికారి, కొర్రప్రోలు -
అడవిలో అమృతధార
బుట్టాయగూడెం: వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలంలో నీటి కోసం వన్య ప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో కుక్కల బారిన, వాహనాల కింద పడి మృతి చెందిన ఘటనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు రెండేళ్లుగా వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెల్ని ఏర్పాటు చేసి వాటి దాహార్తి తీర్చేవిధంగా కృషి చేస్తున్నారు. ఈ చర్యలు విజయవంతం కావడంతో అటవీ శాఖ ఈ ఏడాది కూడా వేసవి ప్రణాళిక రూపొందించారు. పాపికొండల్లో 60 నీటికుంటలు పాపికొండలు అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేవిధంగా ఈ వేసవిలో 60 నీటి తొట్టెల్ని ఏర్పాటు చేశారు. వీటితోపాటు అటవీ ప్రాంతంలోని కాలువల్లో 20 చెలమల్ని తవ్వి వన్య ప్రాణులకు నీటి సౌకర్యం లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. అవికాకుండా 25 చెక్డ్యామ్స్ ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి తొట్టెల్లో ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా బేస్క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. వాటి పక్కన ఉప్పు ముద్దలను పెడుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు దాహార్తి తీర్చుకుని ఉప్పు ముద్ద నాకుతాయని, తద్వారా వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక కృషి పాపికొండలు అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటితొట్టెల్ని వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.1.50 లక్షలు వెచ్చిస్తోంది. – దావీదురాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం -
మొక్కలతో 'భారత్ మాత' అని రాసి గిన్నిస్ రికార్డు!
మహారాష్ట్రలోని చంద్రాపూర్లో తడోబా ఫెస్టివల్ 2024 సందర్భంగా మహారాష్ట్ర అటవీ శాఖ వేలాది మొక్కలను ఉపయోగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. హిందీలో 'భారత్ మాత' అనే పదాన్ని రాసేందుకు దాదాపు 65,724 మొక్కలను ఉపయోగించి ఈ రికార్డును సొంతం చేసుకుంది అటవీ శాఖ. చంద్రాపూర్లో జరగనున్న మూడు రోజులు తడోబా ఉత్సవం సందర్భంగా అటవీ శాఖ ఈ వినూత్న ప్రయోగానికి నాంది పలికి తొలి ప్రయత్నంలోనే ప్రపంచ రికార్డును సాధించిందని గిన్నిస్ వరల్డ్ రికార్డు పరిశీలకుడు స్వప్నిల్ దాంగ్రికర్ తెలిపారు. అలాగే 'భారత్ మాత' అనే దేశభక్తి పదంలో మొక్కల అమరికను ప్రదర్శించిన చిత్రాలను అటవీ శాక మంత్రి తడోబా అంధారి టైగర్ రిజర్వ్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ..తడోభా ఫెస్టివల్ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ 'భారత్ మాత' అనే పదాన్ని సృష్టించింది. సుమారు 26 రకాల జాతులకు చెందిన 65,724 మొక్కలతో గిన్నిస్ రికార్డు నెలకొల్పింది అని పోస్ట్లో పేర్కొన్నారు. The Maharashtra Forest Department, Government of Maharashtra, India has achieved a remarkable feat while paying a tribute to the nation, at Chandrapur.#WWD2024#TadobaFestival#ConnectingPeopleAndPlanet#DigitalInnovation#WildlifeConservation#SaveTigerMission#SaveTheTiger pic.twitter.com/tK2oMY0T78 — Tadoba-Andhari Tiger Reserve (@mytadoba) March 3, 2024 అటవీ శాఖ చేసిన ఈ సాహసాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ ఎంతగానో ప్రశంసించారు. ఇలాంటి ప్రయత్నాలు సిబ్బందిలో మనోధైర్యాన్ని పెంచుతాయని అన్నారు. అలాగే ఈ మొక్కలు వృక్షాలుగా పెరిగిన తర్వాత, డ్రోన్ సహాయంతో ఏరియల్ ఫోటోగ్రఫీ చేసినప్పుడు 'భారత్ మాత' అని వ్రాసి ఉన్న మొక్కలను చూడొచ్చని ముంగంటివార్ చెప్పారు. ఇక తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ (TATR) వన్యప్రాణుల సంరక్షణ, స్థిరమైన పర్యాటకం. మహారాష్ట్ర వారసత్వాన్ని పరిరక్షించడం లక్ష్యంగా ఈ తడోబా ఉత్సవాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తుంది. चंद्रपुरच्या ‘भारतमाता’ शब्दाची गिनेस बुक ऑफ वर्ल्ड रेकॉर्डमध्ये नोंद..!@narendramodi @GWR @mytadoba @MahaForest #TadobaFestival2024 #GuinnessWorldRecord #SMUpdate #Chandrapur #GreenBharatmata pic.twitter.com/6y2koiqeT0 — Sudhir Mungantiwar (@SMungantiwar) March 3, 2024 (చదవండి: కళ్లు చెదిరే అందంతో రంగులీనుతుంది ఆ ఎడారి..అడుగుపెట్టారో అంటే..!) -
ఏపీపీఎస్సీ.. మరో ఐదు
సాక్షి, అమరావతి: నిరుద్యోగ యువతకు శుభవార్త! ఇప్పటికే గ్రూప్– 1, 2 పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన ఏపీపీఎస్సీ త్వరలో అటవీ శాఖలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో ఈమేరకు వివిధ కేటగిరీల్లో 861 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టింది. ఒకవైపు గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు అటవీశాఖ ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైంది. మరో వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సమాచారం. వీటిలో 37 ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లు, 70 ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు, 175 ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, 375 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, 10 తానాదార్లు, 12 టెక్నికల్ అసిస్టెంట్లు, మరో 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కలిపి 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఇవి కాకుండా ఎఫ్ఎస్ఓ, బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ లాంటి మరో 172 క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కలిపి మొత్తం 861 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్తో పాటు పరీక్షల షెడ్యూల్ను కమిషన్ త్వరలో ప్రకటించనుంది. ఇవే కాకుండా విద్యుత్తు శాఖలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, మత్స్యశాఖలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, జైళ్ల శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టు, ఏపీ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ విభాగంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. గ్రూప్–2 హాల్ టికెట్ల విడుదల గ్రూప్–2 ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్ట్) పరీక్షకు సంబంధించి హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఒక్క రోజులోనే 2 లక్షల మందికిపైగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఈనెల 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏపీపీఎస్సీ 24 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేసింది. గ్రూప్–2లో మొత్తం 899 పోస్టులకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
జనారణ్యంలోకి ఎలుగుబంటి
మానకొండూర్ రూరల్: జనారణ్యంలోకి చొరబడిన ఎలుగుబంటి ఎనిమిది గంటలు హైరానా చేసి ఎట్టకేలకు బోనులో చిక్కింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్లోని చెరువుకట్ట సమీపంలో కరీంనగర్–వరంగల్ రహదారి పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూరేందుకు యత్నించింది. కుక్కలు అరవడంతో ఇంటి పక్కనున్న వేపచెట్టు ఎక్కింది. ఇంటి యజమాని ఉదయం ఎలుగుబంటి అరుపులు విని, భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఎలుగుబంటి ఉన్న ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెటర్నరీ వైద్యుడు మత్తు ఇంజక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. గ్రామస్తుల సందడితో ఎలుగుబంటి చెట్టుదిగి చెరువు పక్కనున్న పొదల్లోకి దూరింది. పొదల్లో ఎలుగుబంటి కనిపించడంతో టపాసులు పేల్చి బయటకు రప్పించారు. అక్కడి నుంచి అది పంటపొలాల వెంట పరుగెత్తి సమీప ముంజంపల్లి గ్రామం వైపు వెళ్లింది. అటవీ అధికారులు మత్తు ఇంజక్షన్ను ఫైర్ చేయడంతో కిలోమీటర్ దూరం పరుగెత్తి పొలాల్లో సొమ్మసిల్లి పడిపోయింది. స్పృహ తప్పిన ఎలుగుబంటిని వలలో బంధించి వ్యాన్లో ఎక్కించి వరంగల్కు తరలించారు. -
పచ్చదనం పెంపు నిరంతర ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అటవీ రక్షణ, పచ్చదనం పెంపు నిరంతర ప్రక్రియ అని, పచ్చదనం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హరితహారంపై ఇప్పటివరకు జరిగిన పురోగతి, రానున్న సీజన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఆమె సచివాలయంలో సమీక్షించారు. అటవీ, గ్రామీణ అభివృద్ధి, మున్సిపల్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హార్టికల్చర్ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటుతున్న మొక్కలు, వాటి ఎదుగుదల, అలాగే చనిపోయిన మొక్కలను మార్చే విధానంపై వివరాలన్నీ వీలైనంత త్వరగా ఆన్లైన్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటడం, నర్సరీలు, అటవీ సంబంధిత కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంతవరకు తగ్గించాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఇంటి అవసరాలకు ఉపయోగకరమైన, అలాగే కనీస ఆదాయాన్నిచ్చే మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పూలు, పండ్ల జాతుల మొక్కల పంపిణీతో పాటు, స్వచ్ఛందంగా పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తమ ఇంటి ఆవరణలో చెట్లు నాటుకున్న వాళ్లకు కనీస ఆదాయం వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. చింత, సీతాఫల్, ఉసిరి, జామ, నిమ్మ, సపోటా, మునగ, కరివేపాకు లాంటి మొక్కలను పంపిణీ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోరారు. హరితహారం కార్యక్రమం పారదర్శకంగా, పూర్తి జవాబుదారీతనంతో ఉండాలని సూచించారు. గతంలో జరిగిన తప్పులను సవరించుకోవాలని మంత్రి అన్నారు. ఫారెస్టు అధికారులపై దాడులు చేస్తే కఠినచర్యలు భద్రాద్రి జిల్లా ఇల్లెందు ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్టు అధికారులపై దాడులు చేయడాన్ని మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. మంగళవారం జరిగిన దాడిపై విచారణకు ఆదేశించారు. అటవీ ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మాఫియాను అడ్డుకున్న ఫారెస్టు అధికారులపై ట్రాక్టర్ను ఎక్కించి చంపడానికి దుండగులు చేసిన ప్రయత్నంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా రు. దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు. -
ఒక్క దరఖాస్తు.. అధికారి చొరవ..
నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన’వల్ల సుదీర్ఘకాలంగా ఉన్న తమ ఊరి సమస్య పరిష్కారమవుతోందని నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామం కవ్వాల్ అభయారణ్య ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ దాదాపు 2,500 జనాభా ఉండగా.. ఈ ఊరికి అటవీ ప్రాంతం నుంచి వచ్చే వాగు ఉంది. ఈ వాగుపై ఎప్పుడో కట్టిన చెక్డ్యామ్ 30–40 ఏళ్ల కిందటే కొట్టుకుపోయింది. గతంలో చెక్డ్యామ్ నుంచి వచ్చే కాలువతో సమీపంలోని చెరువులు నింపేవారు. అయితే చెక్డ్యామ్, కాలువ దెబ్బతినడంతో సాగునీటికి గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉడుంపూర్ కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉండటంతో కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడానికి అటవీశాఖ అనుమతులివ్వడం లేదు. ఏళ్లుగా గ్రామస్తులు మొర పెట్టుకుంటున్నా.. ఎవరూ పరిష్కారం కోసం ప్రయత్నం చేయలేదు. కదిలిన అధికారి.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈనెల 3న ఉడుంపూర్లో నిర్వహించారు. కడెం మండల ఇన్చార్జిగా ఉన్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీవో) విజయలక్ష్మి ఆరోజు ఉడుంపూర్లో కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ‘ఆరు గ్యారంటీ’ల దరఖాస్తులతోపాటు తమ ఊరి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలంటూ గ్రామస్తులు డీఆర్డీవో విజయలక్ష్మికి దరఖాస్తును అందించారు. వెంటనే స్పందించిన ఆమె సభ కాగానే, గ్రామస్తులతో కలసి మోటార్బైక్పై కొంతదూరం, ఆపై కాలినడకన అటవీ ప్రాంతంలో ఉన్న చెక్డ్యామ్ వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆమె ఉడుంపూర్ నీటి సమస్యను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జుతో చర్చించారు. వారి సూచనల మేరకు వెంటనే రూ.9 లక్షల అంచనాలతో పనులకు ప్రణాళికలు రూపొందించారు. అటవీ ప్రాంతంలో చెట్లకు ఇబ్బంది కలగకుండా కాలువ తవ్వకానికి పథకం సిద్ధం చేశారు. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చేతుల మీదుగా శనివారం చెక్ డ్యామ్ ప్రాంతం నుంచి కాలువ తవ్వకం పనులు ప్రారంభించారు. ప్రజాపాలనతో తమ ఊరి దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించడంతో ఉడుంపూర్వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డికి, ఎమ్మెల్యే బొజ్జు, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
తిరుమల నడకదారి భక్తుల రక్షణకు ప్రత్యేక చర్యలు
సాక్షి, అమరావతి: తిరుమల నడక దారిలో భక్తుల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ, అటవీ శాఖ, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎల్ఐఐ) అధికారులంతా కలిసి సంయుక్తంగా నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే డబ్లుŠఎల్ఐఐ సమర్పించిన ప్రణాళికల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని టీటీడీని ఆదేశించింది. భక్తుల రక్షణ కోసం తీసుకునే దీర్ఘకాలిక చర్యలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని టీటీడీని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వన్యప్రాణుల సంచారం భక్తులకు ప్రమాదంగా మారుతున్న నేపథ్యంలో అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారి వెంట ఇనుప కంచె ఏర్పాటు చేసేలా టీటీడీ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తిరుపతికి చెందిన బీజేపీ నేత గుడిపల్లి భానుప్రకాశ్రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా అటవీశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది ఖాసిం సాహెబ్ స్పందిస్తూ నడక మార్గంలో భక్తుల రక్షణకు ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై వైల్ట్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని నిపుణుల కమిటీ సమర్పించిన ప్రణాళికలను మెమో రూపంలో కోర్టు ముందుంచామన్నారు. ఆ నివేదికను పరిశీలించాలని కోరారు. ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం, వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేందుకు ఎక్కెడక్కడ అండర్ పాస్లు నిర్మించాలి, భక్తుల కోసం ఎక్కడ ఓవర్ పాస్లు నిర్మించాలి, ఎక్కడెక్కడ ఫెన్సింగ్ వేయాలన్న విషయంలో డబ్లుŠఎల్ఐఐ నివేదికలో స్పష్టత లేదని తెలిపింది. ప్రణాళికల్లో స్పష్టత లేనప్పుడు వాటిని అమలు చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. టీటీడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ, డబ్లుŠఎల్ఐఐ నివేదిక అమలుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని చెప్పారు. చిరుత దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి టీటీడీ తరఫున రూ.10 లక్షలు, ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు అందజేసినట్టు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం, తిరుమల నడకదారిలో వన్యప్రాణుల స్వేచ్చా విహారానికి, భక్తుల రాకపోకలకు వీలుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఎక్కడెక్కడ వాటిని అమలు చేయాలన్న విషయంపై సంయుక్త సమావేశం నిర్వహించాలని టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 14కి వాయిదా వేసింది. -
మళ్లీ పులి భయం
పులి భయం మళ్లీ మొదలైంది. కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలం నందిగూడ అటవీ ప్రాంత శివారులో రెండురోజుల కిందట పశువును చంపేసి.. పశువుల కాపరి గులాబ్పై దాడి చేసిన ఘటన దరిమిలా ఆ ప్రాంత సమీప ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ ఘటనలో గులాబ్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడగా, చేతికి గాయాలయ్యాయి. ప్రతీ ఏడాది పత్తి తీసే ఇదే సీజన్లోనే పులుల సంచారం పెరుగుతోంది. దీంతో పత్తి చేన్లకు వెళ్లాలన్నా, జీవాలను మేతకు తీసుకెళ్లాలన్నా కాపర్లు జంకుతున్నారు. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల మూడేళ్లుగా మనుషులపై దాడులు గత మూడేళ్లుగా నవంబర్ నుంచి జనవరి మధ్యే పులుల దాడులు అధికంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా 2020 నవంబర్ 11న ఏ2 అనే పులి కుమురంభీం జిల్లా దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్(21) పత్తి చేనుకు వెళ్తుండగా దాడి చేసి చంపేసింది. అదే నెల 29న పెంచికల్పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల(18)ను పొట్టన పెట్టుకుంది. కేవలం మూడు వారాల వ్యవ«ధిలోనే ఇద్దరి మృతితో స్థానికుల నుంచి నిరసనలు వచ్చాయి. దాంతో అటవీ శాఖ సీరియస్గా తీసుకుని ఆ పులిని బంధించే ప్రయత్నం చేసినా.. సాధ్యపడలేదు. ఆ తర్వాత పులి మహారాష్ట్ర వైపు వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ గతేడాది నవంబర్లోనే కుమురంభీం జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్కు చెందిన రైతు సిడాం భీము(69)ను పత్తి చేనులో ఉండగా దాడి చేసి చంపేసింది. తాజాగా పశువుల కాపరిపై దాడి జరిగింది. బఫర్ జోన్లోనే సంచారం ఉమ్మడి ఆదిలాబాద్ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు.. పులుల రాకపోకలకు ప్రధాన కారిడార్గా ఉంది. ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్, మంచిర్యాల వరకు పులుల సంచారం ఉంటోంది. పెన్గంగా, ప్రాణహిత తీరాలు దాటి తిప్పేశ్వర్, తడోబా టైగర్ రిజర్వ్ పులుల అభయారణ్యాల నుంచి వలస వస్తుంటాయి. ఎనిమిదేళ్ల క్రితం పాల్గుణ అనే ఆడపులి కాగజ్నగర్లోనే స్థిర నివాసం ఉండటంతో సంతతి పెరిగింది. ఇలా అనేక పులులు ఒక్కొక్కటిగా తెలంగాణ భూభాగంలో ఆవాసం, తోడు వెతుక్కుంటూ అడుగుపెడుతున్నాయి. టైగర్ రిజర్వు పరిధి కోర్ ఏరియా మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ కవ్వాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క పులి కూడా స్థిరంగా ఉండలేదు. కేవలం బఫర్ ప్రాంతాల్లోనే పులులు సంచరించడంతో సమస్య మొదలవుతోంది. ఆ ప్రాంతాల్లోనే పత్తి చేన్లు, మానవ సంచారం ఉండడంతో ఎదురుపడిన సందర్భంలో దాడి చేస్తున్నాయి. నిత్యం ఆదిలాబాద్ డివిజన్లో తాంసి, భీంపూర్, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లో దహెగాం, పెంచికల్పేట, బెజ్జూరు, బెల్లంపల్లి, చెన్నూరు డివిజన్ల వరకు పులులు తిరుగుతుంటాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు పిప్పల్కోట్, కాగజ్నగర్ డివిజన్ అడవుల్లో అనేకసార్లు స్థానికులకు పులులు ఎదురుపడ్డాయి. అడవిలో వన్యప్రాణుల కంటే సులువుగా దొరికే మేతకు వెళ్లిన పశువులు, మేకలు, గొర్రెల పైనే దాడి చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నాయి. అలా పశువులు నష్టపోయిన రైతులకు పరిహారం కూడా అటవీ శాఖ చెల్లిస్తోంది. అయితే ఇప్పుడు మనుషులపై దాడి చేయడమే ఆందోళన కలిగిస్తోంది. జత కట్టే సమయంలో? పులులు జత కట్టే సమయం నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యే కావడం, తోడు, ఆవాసం కోసం తోటి పులుల మధ్య ఆధిపత్య పోరు, వాగులు, నదులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్న చోట సంచరిస్తూ అనుకోకుండా మనుషులు ఎదురుపడితే దాడులకు ప్ర«ధాన కారణమవుతున్నాయని అటవీశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
క్యాచ్ ద ట్రాప్..!
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల వేట నిరోధానికి స్పెషల్ డ్రైవ్ ‘క్యాచ్ ద ట్రాప్’కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీ శాఖ ప్రారంభించింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు, విషపదార్ధాలు, పేలుడు పదార్ధాలు వంటివి ఉపయోగించకుండా కార్యాచరణను శుక్రవారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల పరిశీలన ద్వారా వేటగాళ్ల గుర్తింపు, పరికరాల స్వాదీనం, గత రికార్డులు, కేసుల ప్రకారం సోదాల నిర్వహణ వంటివి అమలు చేస్తోంది. వివిధ రకాల వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు ఉపయోగించి అటవీ జంతువులను చంపడం/వేటాడటాన్ని గతంలోనే నిషేధించడం తెలిసిందే. వేటకు అడ్డుకట్ట..: అడవి జంతువుల నుంచి వ్యవసాయ పంటల నష్ట నివారణకు కొందరు, అటవీ జంతువుల మాంసం వినియోగం, వ్యాపారానికి మరికొందరు సాగిస్తున్న జంతువుల వేటకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ప్రత్యేక డ్రైవ్ లో అధికారులు వీలైనన్ని అటవీ ప్రాంతాలను పరిశీలించి వేటగాళ్లను గుర్తించడంతో పాటు వారు వాడే పరికరాలను స్వాదీనం చేసుకోవటం వంటి చర్యలను చేపడుతున్నారు. గత రికార్డులు, కేసులను పరిశీలించి అనుమానితులను సోదా చేసి వేటకు ఉపయోగించే పరికరాలను స్వాదీనం చేసుకుంటున్నారు. ముందుగా అడవిని ఆనుకుని ఉండే వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాలు, ప్రాంతాలను క్షేత్ర సా్థయిలో పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్వాదీనం చేసుకున్న అన్ని వేటలకు ఉపయోగించే మెటీరియల్/పరికరాలు సరిగ్గా రికార్డ్ చేయటంతో పాటు, సురక్షితమైన కస్టడీ కోసం వాటిని హైదరాబాద్కు రవాణా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రోత్సాహం అందించనున్నారు. వేట సమాచారం ఇస్తే రివార్డులు..: వేటకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చే ఇన్ఫార్మర్లకు తగిన రివార్డులు అందజేయనున్నారు. అయితే వారి గుర్తింపును రహస్యంగా ఉంచనున్నారు. చట్టవిరుద్ధమైన వేట, అందుకోసం ఉపయోగించే వస్తువుల సమాచారం తెలిస్తే సంబంధిత జిల్లా అటవీ అధికారికి లేదా 9803338666 నంబర్కు, లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు తెలియజేయవచ్చునని అటవీ శాఖ సూచించింది.. -
అదేపనిగా అసత్యాల ‘ఎత్తిపోతలు’
సాక్షి, అమరావతి: పల్నాడు ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతోంది. ఆరు దశాబ్దాలకు పైగా ఆశగానే మిగిలిన వరికపూడిశెల ప్రాజెక్టుకు రూట్ క్లియర్ అయ్యింది. సాగు, తాగు నీటి ఎద్దడి తీరుతుందని ప్రజలంతా సంతోషిస్తున్నారు. కానీ, పెత్తందారుల పైత్యాన్ని ప్రదర్శించే ‘ఈనాడు’కు ఇది మింగుడు పడటంలేదు. అందుకే ‘వరికపూడిశెల’పై అసత్యాల ఎత్తిపోతలు మొదలెట్టింది. ఐదేళ్లూ అధికారం అనుభవించి ప్రాజెక్టును కాగితాలకే పరిమితం చేసిన చంద్రబాబును పల్లెత్తి మాట అనలేదు. ప్రజలకు నీటి కష్టం ఉందని చెప్పేందుకూ మనసు రాలేదు. ఇప్పుడు వరికపూడిశెల కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంటే వక్రీకరణల డైవర్షన్ మొదలెట్టింది. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ బాబు! వాస్తవానికి ప్రజలను మోసగించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఆ మోసాన్ని గొప్పగా చిత్రీకరించడంలో రామోజీరావు పెన్ను తిరిగిన వ్యక్తి. ఈ దొంగల ద్వయం ఎన్నికల ముందు హడావుడి చేసి ఓట్లు ఎత్తిపోసుకోవాలనే కుట్రతోనే ఆనాడు అంటే.. 2019 ఫిబ్రవరి 6న వరికపూడిశెల ప్రాజెక్టుకు పరిపాలన ఆమోదం ఇస్తున్నట్టు నాటకం ఆడారు. అసలు వరికపుడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు రిజర్వ్ ఫారెస్టులో పైప్ లైన్ పనులు చేయాలని అప్పటి ప్రభుత్వ పెద్దలకు తెలీదా? అందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాలి కదా! ఇవి లేకుండా పనులు ఎలా ప్రారంభిస్తారన్నది అసలు ప్రశ్న. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి నాయకులకు ఉంటే ఇవన్నీ ఆలోచించేవారు. చంద్రబాబు మాత్రం ఓట్ల కోసమే ప్రజలను దగా చేశారు. గత ఎన్నికల నోటిఫికేషన్కు సరిగ్గా నెల ముందు పరిపాలనా ఆమోదం ఇస్తూ టెండర్లు పిలిచినట్టు పెద్ద షో చేశారు. దీని ఆధారంగానే ‘ఈనాడు’ ప్రాజెక్టు అంతా బాబు హయాంలోనే రూపుదిద్దుకున్నట్టు మంగళవారం వక్రభాష్యం పలికింది. వాస్తవానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే వరికపూడిశెల ఎత్తిపోతలకు అంకురార్పణ చేశారు. ప్రాజెక్టు నిర్మించే ప్రాంతం పులుల అభయారణ్యంలో ఉండటంతో కేంద్రం అనుమతులు తప్పనిసరి అయ్యాయి. చిత్తశుద్ధి ఎక్కడ బాబు! రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు అధికారం అనుభవించిన చంద్రబాబు... ఈ ఎత్తిపోతలకు అత్యంత కీలకమైన వన్యప్రాణి, పర్యావరణ అనుమతులు కూడా సాధించకపోవడం ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఇచ్చి న మాట ప్రకారం పల్నాడు వాసుల వరికపూడిశెల కలను సాకారం చేస్తున్నారు. పలు దఫాలు కేంద్రంతో చర్చించి అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి తీసుకునే భూమికి బదులు వేరొక చోట భూమిని సమకూర్చి ప్రాజెక్టుకు ఆటంకం లేకుండా చేశారు. -
పట్టణాలకు పచ్చదనం అందాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదం, వినోదం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న నగర వనాలు త్వరలో మరో 100 అందుబాటులోకి రానున్నాయి. భూమి లభ్యతను బట్టి ప్రతి జిల్లాలో కనీసం 2 నుంచి 4 నగర వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో నగర వనాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి, పేరేచర్ల, దివాన్చెరువు (రాజమహేంద్రవరం),కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలో ఒక్కోటి చొప్పున, కర్నూలు, చిత్తూరులో 2 చొప్పున నగర వనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 30కి పైగా నగర వనాలను డిసెంబర్లోపు, మిగిలిన వాటిని మార్చి నెలాఖరులోపు సిద్ధం చేయడానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో 2, 3 ఏర్పాటుకు సన్నాహాలు కొన్ని పట్టణాల్లో భూమి దొరక్కపోవడంతో నగర వనాల ప్రణాళిక ఆలస్యమైంది. భూమి అందుబాటులో ఉన్న చోట 2, 3 నగర వనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు వద్ద అటవీ ప్రాంతం ఎక్కువ ఉండటంతో అక్కడ 2 నగర వనాలను తీర్చిదిద్దారు. అనంతపురం టౌన్ దగ్గర్లో ఎక్కడా అటవీ భూమి లేదు. దీంతో అక్కడ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో భూమి కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి చోట్ల కొద్దిగా ఆలస్యమైనా మిగిలిన ప్రాంతాల్లో త్వరితగతిన నగర వనాలు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల భూమి లేకపోయినప్పుడు అక్కడ అందుబాటులో ఉండే పెద్ద సంస్థలు, పెద్ద కాలేజీలు, క్యాంపస్లలో ఎక్కువ భూమి ఉంటే అలాంటిచోట్ల నగర వనాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేషన్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఆయా ప్రాంతాల్లోని కార్పొరేట్ సంస్థలు, కంపెనీలను సంప్రదిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల ప్రజలను వీటి ఏర్పాటులో భాగస్వాముల్ని చేస్తున్నారు. వాకర్స్ క్లబ్లు, స్థానిక ప్రముఖులను కూడా కలిసి వీటి గురించి వివరించి నిధులు సమకూర్చి, వారి ద్వారానే వాటిని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా.. పచ్చదనంతో కూడిన స్వచ్చమైన పరిసరాలు నగర వనాల్లో ఉండేలా చూస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు అక్కడకు వచ్చి ఆహ్లాదంగా గడిపేందుకు నగర వనాలను తీర్చిదిద్దుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పలు రకాల క్రీడా సౌకర్యాలు, వాకింగ్ ట్రాక్, యోగా, వెల్నెస్ సెంటర్, అరుదైన చెట్ల పెంపకం వంటివన్నీ అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి అందాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదు ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. వారి నివాసాలకు సమీపంలోనే ప్రకృతి సహజసిద్ధ ప్రాంతాలున్నాయి. వాటిని నగర వనాలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 నగర వనాలున్నాయి. మరో 100 వనాలను ఏర్పాటు చేస్తున్నాం. – ఎన్ మధుసూదన్రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ -
ఉద్దానంలో పెద్దపులి
కంచిలి/కవిటి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో పెద్దపులి మంగళవారం రాత్రి పశువులపై పంజా విసిరింది. కవిటి మండలం సహలాల పుట్టుగలో ఓ ఆవుపై దాడిచేసి చంపేసింది. అదే మండలంలోని కొండిపుట్టుగలో ఓ గేదె దూడను హతమార్చింది. గుజ్జుపుట్టుగలో ఓ ఆవు దూడ తలపై దాడిచేసి గాయపరిచింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కవిటి–నెలవంక మార్గంలో శీమూరు–నెలవంక గ్రామాల మధ్య రోడ్డు దాటుతూ బస్సు ప్రయాణికులకు కనిపించింది. ఈ ఘటనలతో ఉద్దానం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కంచిలి మండలం మండపల్లిలో ఆవుపై దాడిచేసిన పులి, కవిటి మండలంలో కనిపించిన పులి ఒక్కటేనా.. వేర్వేరా అనే విషయం తెలియడం లేదు. అటవీ శాఖ అధికారులు ఒక పులి మాత్రమే తిరుగుతోందంటున్నారు. పులికి ఒక రోజులో గరిష్టంగా 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఘటనపై పలాస ఆర్డీవో భరత్నాయక్ మాట్లాడుతూ.. పులి సంచారంపై రెవెన్యూ, పోలీస్, అటవీ, పంచాయతీ అధికారులతో ఇప్పటికే సమీక్షించామన్నారు. పులి సంచరిస్తున్న గ్రామాలతోపాటు సమీప గ్రామాల ప్రజలు రాత్రిపూట బయట తిరగొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తోడు లేకుండా బయటకు రావొద్దన్నారు. ఒడిశా నుంచి రాక! పెద్దపులి ఒడిశాలోని గజపతి జిల్లా గండాహతి అటవీ ప్రాంతం నుంచి అక్టోబర్ 21న శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరు వరి పొలాల్లో సంచరించినట్టు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తరువాత పలాస మండలం టబ్బుగాం, మందస మండలం కొండలోగాం, పట్టులోగాం గ్రామాల్లో తిరిగిందని తెలిపారు. 27న రాత్రి కంచిలి మండలం మండపల్లి పంచాయతీ పరిధి అమ్మవారిపుట్టుగ వచ్చిన పులిని 28న గ్రామస్తులు గుర్తించారు. అక్కడి నుంచి ఆందోళన మొదలైంది. నవంబర్ 1న కంచిలి మండలం మండపల్లి పరిసరాలు, సోంపేట కొబ్బరితోటల్లో సంచరించిందని స్థానికులు చెప్పడంతో అటవీ అధికారులు పరిశీలించారు. -
‘కొయ్య బొమ్మ’కు ప్రాణం పోసేదెప్పుడు?
తెలంగాణ కళలకు కాణాచి. చేతివృత్తులు, హస్తకళలకు పెట్టింది పేరు. అలాంటి కళల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిర్మల్ కొయ్యబొమ్మలు ఇప్పటికీ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. దాదాపు 450ఏళ్లుగా నకాషీ కుటుంబాలు ఈ కళను నమ్ముకొని బతుకుతున్నాయి. కాలక్రమంలో పాలకుల పట్టింపు లేక ఈ కళ కనుమరుగయ్యే దశకు చేరుకుంటోంది. కొయ్య బొమ్మ తయారయ్యే ‘పొనికి’ చెట్ల పెంపకాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వెరసి కర్రకు కరువు ఏర్పడడం వల్ల కళాకారులకు పని ఉండడం లేదు. ఈ క్రమంలో చాలావరకు నకాషీ కుటుంబాలు ఇతర రంగాల్లో ఉపాధి వెతుక్కుంటున్నారు. ఇలాగే సాగితే రానున్న తరంలో కళ అంతరించి పోతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మల్ కొయ్య బొమ్మల తయారీలో అసలైన ముడిపదార్థం పొనికి కర్ర. మృదువుగా ఉండే పొనిక చెట్టు కర్రతోనే ఈ బొమ్మలను చేయడం ప్రత్యేకత. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో పొనికి చెట్లు విపరీతంగా ఉండేవి. కాలక్రమంలో అడవులతోపాటు పొనికి చెట్లు కూడా అంతరించి పోతున్నాయి. బొమ్మల తయారీకి కావాల్సిన కర్రను కళాకారులు అటవీశాఖ కలప డిపోల నుంచి సేకరిస్తున్నారు. ఈ కర్రకు కొరత ఏర్పడడంతో బొమ్మలు చేసేవాళ్లకు పని ఉండడం లేదు. మూడునెలల క్రితం నిర్మల్ జిల్లా కలెక్టర్గా ఉన్న వరుణ్రెడ్డి, డీఆర్డీఓ విజయలక్ష్మి ప్రత్యేక చొరవ తీసుకుని పొనికి వనాన్ని ప్రారంభించారు. అందులో మొక్కల పెంపకం చేపట్టారు. కానీ అవి చేతికొచ్చి కొయ్యబొమ్మగా మారేందుకు సమయం పడుతుంది. కనీసం పింఛన్ లేదు.. నిర్మల్ జిల్లా కేంద్రంలో 1955లో కొయ్య బొమ్మల పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేశారు. కొయ్య బొమ్మను నమ్ముకొని ఒకప్పుడు రెండు వందల కుటుంబాల ఉండేవి. ఇప్పుడు 50లోపే కుటుంబాలు బొమ్మలను తయారు చేస్తున్నాయి. అందులోనూ నేటితరమంతా వివిధ రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలు చూసుకున్నారు. ఇప్పుడు పనిచేస్తున్న కళాకారులంతా ఎప్పుడో 25–30ఏళ్ల నుంచి చేస్తున్నవారే. వారికి కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహం, పింఛన్ లభించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించిన షెడ్డు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి సాయం అందడంలేదు. ‘మా చేతులతో చేసుకున్న బొమ్మలు పెట్టే అన్నం తప్ప.. ఇప్పటిదాకా ప్రత్యేకంగా రూపాయి అందడం లేదు..’ అని సీనియర్ కళాకారులు వాపోతున్నారు. తమ జీవితాల్లోనే ఎలాంటి ఎదుగుదల లేదని, ఇక అలాంటప్పుడు తమ పిల్లలు ఈ కళను ఎలా కొనసాగిస్తారని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. జీవితమంతా బొమ్మలతోనే.. 35ఏళ్లుగా కొయ్యబొమ్మల తయారీలోనే ఉన్నా. మా పూర్వికుల నుంచి ఇదే ఉపాధి. కానీ పొనికి కర్ర కొరతతో చాలామందికి పనిలేకుండా పోతోంది. సరైన ప్రోత్సాహం లేకపోవడంతో మా పిల్లలు ఇటువైపు రావడం లేదు. –పెంటయ్య, నకాషీ కళాకారుడు -
తీరానికి మరింత రక్షణ
సాక్షి, అమరావతి: మడ అడవుల విస్తీర్ణం రాష్ట్రంలో గణనీయంగా వృద్ధిచెందుతోంది. తీర ప్రాంతానికి రక్షణలో ఈ అడవులు కీలకపాత్ర వహిస్తాయి. తుపానులు వచ్చినప్పుడు రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. కోతను నివారిస్తాయి. గడచిన ఎనిమిదేళ్లలో 10శాతం మేర మడ అడవుల విస్తీర్ణం పెరిగినట్లు అటవీశాఖ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. 2014నాటికి రాష్ట్రంలో 31,888 హెక్టార్లలో ఇవి విస్తరించగా, ప్రస్తుతం ఈ విస్తీర్ణం 40,500 హెక్టార్లకు పెరిగింది. పశ్చిమ బెంగాల్, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల తర్వాత మన రాష్ట్రంలోనే మడ అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 2,114 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండగా, గుజరాత్లో 1,175 చదరపు కిలోమీటర్లు, అండమాన్ నికోబార్ దీవుల్లో 616 చదరపు కిలోమీటర్లలో ఉన్నాయి. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో ఎక్కువ మడ అడవులు ఉన్నాయి. గోదావరి తీరంలో కాకినాడ, బీఆర్ అంబేద్కర్ జిల్లాలు, కృష్ణా తీరంలో కృష్ణా, బాపట్ల జిల్లాల్లో ఇవి విస్తరించాయి. ఇవి కాకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ కొద్దిమేర మడ అడవులు ఉన్నాయి. ప్రధానంగా కాకినాడ జిల్లాలోని కోరింగ అభయారణ్యంలో ఉన్న మడ అడవులు ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ 187.81 చదరపు కిలోమీటర్ల మేర ఉండగా, ఆ తర్వాత కృష్ణా అభయారణ్యంలో 137.76 చదరపు కిలోమీటర్లలో ఈ అడవులు వ్యాపించి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మడ అడవులు తగ్గుతుండటంతో, రాష్ట్రంలో ఈ అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు అటవీశాఖ కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇందు కోసం ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటుచేసింది. అక్కడి నుంచి విత్తనాలు తీసుకెళ్లి సముద్ర ముఖద్వారాల్లో చల్లించింది. ఆయా ప్రాంతాలకు చెందిన స్థానికుల సహకారంతో సంరక్షణకు చర్యలు చేపట్టింది. ఈ మడ అడవుల ద్వారా తీర ప్రాంత రక్షణతోపాటు, అక్కడ నివసించే లక్షలాదిమంది జీవనోపాధి కూడా పొందుతున్నారు. -
అటవీ అమరవీరుల కుటుంబాలకు అండ
బహదూర్ఫురా: విధి నిర్వహణలో అశువులు బాసిన అటవీ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ హామీనిచ్చారు. అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందని భరోసానిచ్చారు. సోమవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్కు స్మారక చిహ్నం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులు, సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీర మరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలను వృథా కానివ్వకుండా వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం.డోబ్రియాల్, వన్యప్రాణుల ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్ జైశ్వాల్, వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జూపార్కు డైరెక్టర్ ప్రసాద్, క్యూరేటర్ సునీల్ హీరమత్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో శ్రద్ధాంజలి ఘటించారు. -
నడక మార్గంలో ఏం చర్యలు తీసుకుంటున్నారు?
సాక్షి, అమరావతి: తిరుమల నడక మార్గంలో వన్యప్రాణుల నుంచి భక్తులను రక్షించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఏపీ హైకోర్టు అటవీ శాఖ, టీటీడీ అధికారులను బుధవారం ఆదేశించింది. అలిపిరి నుంచి తిరుమల వరకు నడక మార్గం వెంట ఇనుప కంచె ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలను కూడా తెలియజేయాలని కోరింది. వన్యప్రాణులు తిరిగే చోట మనమంతా తిరుగుతున్నామని, అందువల్ల వన్యప్రాణుల జీవనం, భక్తుల భద్రత మధ్య సమతుల్యత ఉండేలా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే వన్యప్రాణుల రాకపోకలకు వీలుగా తగిన రక్షిత మార్గాలను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలంది. ఇటీవల చిరుత పులి దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి చెల్లించిన రూ.15 లక్షల పరిహారాన్ని రూ.30 లక్షలకు పెంచాలని టీటీడీకి స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్, చిత్తూరు జిల్లా అటవీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వన్యప్రాణుల సంచారం భక్తులకు ప్రమాదంగా మారుతున్న నేపథ్యంలో అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారి వెంట ఇనుప కంచె ఏర్పాటు చేసేలా టీటీడీ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తిరుపతికి చెందిన బీజేపీ నేత గుడిపల్లి భానుప్రకాశ్రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున యలమంజుల బాలాజీ, అటవీ శాఖ తరఫున ఖాసిం సాహెబ్, టీటీడీ తరఫున అనూప్ వాదనలు వినిపించారు. -
కాకుల కొండ వద్ద చిరుత కళేబరం
మడకశిర రూరల్: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మెళవాయి సమీపంలోని కాకులకొండ వద్ద గురువారం మగ చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. బుధవారం ఆడ చిరుత కళేబరం కనిపించిన నేపథ్యంలో ఘటనా స్థలంలో ఆనవాళ్లు గుర్తించేందుకు గురువారం అటవీశాఖ అధికారులు కొండలోని గుంతలో పరిశీలించగా అక్కడ మగ చిరుత కళేబరాన్ని గుర్తించారు. విషయాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రారెడ్డి, పెనుకొండ అటవీశాఖ డివిజన్ అధికారి ఆనంద్, రేంజ్ అధికారి శ్రీనివాసరెడ్డి, పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమర్ ఘటనాస్థలికి చేరుకుని గుంతలో ఉన్న చిరుత కళేబరాన్ని పరిశీలించారు. ఆడ చిరుతలాగే తాజాగా లభించిన మగ చిరుత కూడా మృతి చెందిన సమయంలో మల, మూత్ర విసర్జన చేసింది. సమీపంలో ఏదో ద్రవ పదార్థం ఉందన్న అనుమానంతో నమూనాలను సేకరించారు. చిరుత కళేబరాన్ని మడకశిర అటవీశాఖ కార్యాలయానికి తీసుకువచ్చారు. వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ అమర్ బుధ, గురువారాల్లో లభించిన ఆడ, మగ చిరుతలకు పోస్టుమార్టం నిర్వహించి కళేబరాలను కాల్చి వేశారు. రవీంద్రారెడ్డి మాట్లాడుతూ..2 చిరుతలూ ఒకే రోజు మృతి చెంది ఉండవచ్చని చెప్పారు. వీటి వయసు రెండేళ్లు ఉంటుందన్నారు. ఈ చిరుతల తల్లి కూడా కొండ ప్రాంతంలో ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం ద్వారా సేకరించిన నమూనాలను తిరుపతి, విజయవాడ, బెంగళూరు ల్యాబ్లకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ రెండు చిరుతలకు ఎలాంటి గాయాలు లేవని, రెండూ ఒకే కారణంతో మృతి చెంది ఉంటాయని వెటర్నరీ ఏడీ తెలిపారు. విష ప్రయోగమా...? లేదా వ్యాధి సోకి మృతి చెందాయా..? అన్నది ల్యాబ్ రిపోర్టుల ద్వారా తెలుస్తుందన్నారు. -
భక్తుల రక్షణే ప్రధాన ధ్యేయం
తిరుపతి సిటీ: తిరుమల వచ్చే శ్రీవారి భక్తుల ప్రాణరక్షణే తమ ప్రధాన ధ్యేయమని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. చిరుత దాడిలో గతంలో కౌషిక్ గాయపడటం, ఇటీవల చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ అప్రమత్తమై అటవీ శాఖ అధికారులు, పోలీసులతో కలసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో 12 ఏళ్ల వయసులోపు పిల్లలతో వచ్చే భక్తులకు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. పెద్దలను మాత్రం రాత్రి 10 వరకు అనుమతిస్తామని తెలిపారు. నడక దారిలో వెళ్లే ప్రతి భక్తునికి సహకారం కోసం ఊత కర్ర అందిస్తామన్నారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. భక్తులను గుంపులుగా వెళ్లేందుకు అనుమతిస్తూ.. ముందు వెనుక అటవీశాఖ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తామన్నారు.. అటవీశాఖ అధికారులు నిపుణులైన భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని సూచించామని.. వారి వేతనాలు టీటీడీయే భరిస్తుందన్నారు. జంతువులకు ఆహారం అందించడం నిషేధం నడక దారిలో వెళ్లే భక్తులు సాధు జంతువులకు ఆహారం అందించడం నిషేదించామని, అలా అందించే వారిపై చర్యలు తప్పవని కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. నడక దారిలోని దుకాణదారులు, హాటళ్ల యజమానులు వ్యర్థాలను బయట వేయరాదని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి నుంచి తిరుమల వరకు నడకమార్గంలో సుమారు 500 కెమెరాలను అమర్చనున్నామని, అవసరమైతే డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు. వైల్డ్లైఫ్ అవుట్ పోస్టులు 24 గంటలు పనిచేస్తాయని, డాక్టర్లు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దారి పొడవునా సుమారు 30 అడుగుల వరకు వెలుతురు ఉండేలా ఫోకస్ లైట్లు అమర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు వద్ద 15వేల దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని, మధ్యలో వీటిని తనిఖీ చేయాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. టోకెన్లు పొందిన భక్తులు రోడ్డు మార్గాన సైతం వెళ్లేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఫెన్సింగ్ ఏర్పాటుపై అటవీ అధికారులతో చర్చించామని.. కేంద్ర అటవీశాఖ ఉన్నత స్థాయి కమిటీ వేసి అధ్యయం చేసిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. -
చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు తెలియాలి: డీఎఫ్ఓ శ్రీనివాసులు
సాక్షి, తిరుపతి: తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి చేసిన చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. కాగా, టీటీడీ ఫారెస్ట్ అధికారులు చిరుతను ఎస్వీ జూపార్క్కు తరలించారు. ఈ సందర్భంగా టీటీడీ డీఎఫ్ఓ శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాసులు మాట్లాడుతూ.. బాలికపై దాడిచేసిన చిరుత ఇదేనా.. కాదా అన్నది పరిశీలిస్తాం. చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు ఉన్నాయా? లేదా అన్నది తెలుసుకుంటాం. అనంతరం ఫారెస్ట్ అధికారుల నిర్ణయం మేరకు చిరుతను జూలో ఉంచాలా? లేక ఫారెస్ట్లో వదలాలా అన్నది నిర్ణయిస్తాం. బోనులో చిక్కిన చిరుత ఆడ చిరుత.. నాలుగేళ్లు ఉంటాయని తెలిపారు. మరోవైపు.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. లక్షిత చనిపోయిన ప్రాంతంలోనే నేడు చిరుత పట్టుబడింది. ఈ ప్రాంతంలో ఇంకా చిరుతల సంచారం ఉన్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. నడకదారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఫారెస్ట్ శాఖ చెప్పే వరకు నిబంధనలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో 15 ఏళ్లలోపు చిన్నారులకు అనుమతి లేదు. నడకమార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఇది కూడా చదవండి: వీడియో: చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement