సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం.. రాజకీయ ప్రసంగంలా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్రావు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉందని కేసీఆర్ ఒప్పుకున్నారని, అయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులు అవాస్తవాలేనా అని నిలదీశారు. హైదరాబాద్లో భూములు అమ్మిన గత ముఖ్యమంత్రులను వ్యతిరేకించిన కేసీఆర్.. ఇప్పుడు రాజధానిలోని భూములను ఎలా అమ్ముతారని దుయ్యబట్టారు. దేశంలో ఆర్థికరంగం తిరోగమనంలో ఉందని తెలిస్తే.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టేటప్పుడు గుర్తుకు లేదా అని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు ఏవైనా ఆగాయా? అలాంటిదే ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి నిధుల కేటాయింపులో ఎక్కడ కోత విధించిందో మీరు చూపిస్తే తాము సమాధానం చెప్తామన్నారు. ప్యారిస్ ఒప్పందం ప్రకారం ఎలక్ట్రానిక్ కార్లను భవిష్యత్లో వినియోగించాలని, అందుకే కార్ల అమ్మకాలు తగ్గాయన్నారు. అంతేగాని కేంద్రం ప్రభుత్వం వల్లనే కార్ల అమ్మకాలు తగ్గాయని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అవుతుందన్నారు. పొదుపు చేయాలని చెప్పి.. అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తున్నారని రఘునందరన్రావు విమర్శించారు.