నా మాటలను బాబు వక్రీకరిస్తున్నారు
మంత్రి బొత్స సత్యనారాయణ
సాక్షి, అమరావతి : రాజధాని విషయంలో తన వ్యాఖ్యలను ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంతలా వక్రీకరిస్తారని అనుకోలేదని మంత్రి బొత్స సత్యనా రాయణ విస్మయం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో కలిసి చిట్చాట్గా మాట్లాడారు. రాజధానిలో వరదల గురించి తాను మాట్లాడితే.. విషయాన్ని వక్రీకరించి ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా రాసుకున్నారన్నారు. రాజధాని విషయంలో శివరామకృష్ణన్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోమని కేంద్రం చెబితే.. చంద్రబాబు మాత్రం మంత్రి నారాయణ నివేదికను పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు.
పదేళ్ల క్రితం పదకొండున్నర లక్షల క్యూసెక్కుల వరదతో అమరావతి ప్రాంతం అతలాకుతలమైందని మంత్రి బొత్స చెప్పారు. మొన్న ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే రాజధాని ప్రాంతమంతా మునిగిపోయిందన్నారు. అమరావతి చుట్టూ భూములు కొన్నది టీడీపీ నేతలు, చంద్రబాబు బినామీలేనని ఆరోపించారు. కాగా తరచుగా వరదలకు గురవుతున్న చెన్నై, ముంబైల గురించి ప్రస్తావిస్తూ.. ‘చెన్నై, ముంబైలు ఎప్పుడో కట్టిన రాజధానులు.. ముంపునకు గురవుతుందని తెలిస్తే చెన్నై, ముంబైలను మునిగిపోయే ప్రాంతంలో కట్టేవారు కాదు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలన్నదే తమలక్ష్యమన్నారు. వోక్స్ వేగన్ కేసులో తాను సాక్షిని మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు.
మరిన్ని వార్తలు