సాక్షి, చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్ తీవ్ర విషాదాన్ని నింపింది. వైరస్ బారినపడిన డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ (62) మృతి చెందారు. కరోనా సోకడంతో గతవారం ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన 63వ పుట్టినరోజు నాడే మరణించడం తీవ్ర విషాదకరం. చెన్నై చేపాక్కం –ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఈనెల రెండో తేదీన ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. పరీక్షించగా కరోనా నిర్ధారణ అయ్యింది. చెన్నైలోని క్రోంపేటలోని రేల ఇన్స్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రెండు రోజుల క్రితం ఐసీయూకు తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతిచెందారు. (వూహాన్ను అధిగమించిన ముంబై)
ఆయనకు ఇది వరకు బీపీ, కిడ్నీ సమస్యలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. అన్బళగన్ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా ఓ ఎమ్మెల్యే మృతి చెందడం ఇదే తొలిసారి. అన్బళగన్ మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, పార్టీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. (కరోనా ఎఫెక్ట్: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం)