సాక్షి, హైదరాబాద్: వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశిం చారు. శుక్రవారం తన చాంబర్లో మేయర్ బొంతు రామ్మోహన్తో కలసి జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం నగరంలో కురిసిన భారీ వర్షాలకు ఎదురైన పరిస్థితులు, వాటిని ఎదుర్కొన్న తీరును అధికారులు మంత్రికి వివరించారు.
నాలాల్లో ఉన్న అడ్డంకులు, పూడికను తొలగించాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నాలా అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం నిధులను కేటాయించిందన్నారు. నాలా ఆక్రమణల్లో ఉన్నవారి సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుని, వారికి ఆర్థిక సాయంతో పాటు అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తామన్నారు. నాలాల మరమ్మతులకు గుర్తించిన పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.
రోడ్ల నిర్వహణపై శ్రద్ధ పెట్టండి
వర్షాకాలంలో నీళ్లు నిలిచే ప్రాంతాలు, రోడ్ల నిర్వహణపై శ్రద్ధ చూపాలన్నారు. ట్రాఫిక్, పోలీసు, జీహెచ్ఎంసీ యంత్రాంగం గుర్తించిన నీళ్లు నిలిచే ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. రోడ్డు కట్టింగ్ పునరుద్ధరణ పనులు, పాట్ హోళ్ల నిర్వహణతోపాటు రోడ్లపై బీటీ లేయింగ్, వాటి పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు.