లోగిలి

లోగిలి


టూకీగా ప్రపంచ చరిత్ర

రచన: ఎం.వి.రమణారెడ్డి


 

ఒడిదుడుకుల నేపథ్యంలో మొదలైన ‘సీనోజోయిక్’ యుగం సుమారు ఏడున్నర కోట్ల సంవత్సరాల నాడు మొదలై ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. పూలు పూసే చెట్లూ, గడ్డిమేటలూ, పాలిచ్చే జంతువులూ దీని ప్రత్యేకత. అందుకే దీన్ని ‘ఏక్ ఆఫ్ మ్యామెల్స్’ అంటే ‘స్తన్యజీవుల యుగం’గా పిలుస్తారు.

 

సరీసృపాలకు స్తనాలు ఉండవు. వాటి సంతానోత్పత్తి జరిగేది గుడ్ల ద్వారా. స్తన్యజంతువు నేరుగా పిల్లలను ఈనుతుంది. అంటే, గుడ్లను గర్భాశయంలోనే పొదిగి, అవి పిల్లలుగా పరిపక్వమైన తరువాత భూమిమీదికి తీసుకొస్తుంది. ఈనిన తరువాత కొంతకాలం దాకా పాలిచ్చి పిల్లలను పోషిస్తుంది. సరీసృపాలతో స్తన్యజంతువును పోల్చేందుకు బొచ్చు పెరగడం, పొదుగు ఏర్పడడం వంటి భౌతిక పరిణామాలే కాకుండా, మనం ప్రధానంగా గమనించవలసిన అంశం సంతానం పట్ల స్తన్యజీవులు చూపించే శ్రద్ధ. సరీసృపాల్లో పిల్లలను ఈనే జంతువులుగూడా అరుదుగా కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని తెగల రక్తపింజెరు పాములు పిల్లలను ఈనుతాయి. ఈనిన వెంటనే వాటిని గాలికి వదిలేసి తమ దారిన తాము వెళ్ళిపోతాయి. పొదుగు జంతువులాగా ఆలనాపాలనా చూసుకోవు. నేలమీద పూడ్చిపెట్టిన గుడ్లు పొదిగిన తరువాత మొసలి తన పిల్లలను త్రవ్వితీసి, నీటితో పట్టుకుని నీటిలోకి చేరుస్తుంది. అంతే; ఆ తరువాత దానికి తన పిల్లలు గుర్తుండవు. పిల్లల పోషణభారం నిర్వహించే స్వభావంలో ఒక్క పక్షులు మాత్రమే స్తన్యజీవుల తరువాతి శ్రేణిలో నిలబడేవి. గుడ్లను స్వయంగా పొదగడం కాక, పక్షులు తమ పిల్లలను రెక్కలొచ్చేదాకా పోషిస్తాయి, అండగా నిలుస్తాయి. ప్రాణికోటిలో పిల్లలను పోషించుకునే స్వభావముండే ఈ రెండువర్గాల జీవులూ సీనోజోయిక్ యుగం కానుకలే. అందువల్ల, సీనోజోయిక్ యుగాన్ని మనం ‘బాధ్యతలెరిగిన’ యుగంగా గుర్తించడం సబబుగా ఉంటుంది.



 మరో కోణం నుండి చూస్తే, సరీసృపాల ప్రపంచం ‘నేను’ అనే పరిధిని దాటుకోలేదు. వాటి మెదడుకు సొంత ప్రయోజనాలను మించి ఆలోచించగల శక్తి సమకూరలేదు. స్తన్యజంతువుల్లో మేధోసంపత్తి పెరిగింది. దాని వల్ల అది కుటుంబజీవిగా ఎదిగింది. తల్లినుండి గ్రహించి, పిల్లలకు అందించే సంప్రదాయానికి పునాదులు వేసింది. కాబట్టి, సీనోజోయిక్ యుగం ‘సంప్రదాయ’మనే సామాజిక ప్రవర్తనకు ప్రాతినిధ్యం వహించింది. మీద మీద కలిగే అవసరం అలవాటును మరుపుతుంది. దీర్ఘకాలం కొనసాగే అలవాటు ఆచారంగా మారుతుంది. సామూహికంగా నిర్వహించే ఆచారం సంప్రదాయమవుతుంది. విస్తృతి పెరిగిన సంప్రదాయమే ‘సంస్కృతి’గా ప్రసిద్ధికెక్కుతుంది. ఎప్పుడో ఏడున్నరకోట్ల సంవత్సరాలనాడు తల్లి నుండి  గ్రహించడం, పిల్లలకు అందివ్వడం భౌతికావసర మాత్రంగా మొదలయ్యుండొచ్చు. ఆ అలవాటు మానవజాతిలో ముందుతరాల నుండి అనుభవాలను గ్రహించే సంప్రదాయంగానూ, ప్రపంచవ్యాప్త సంస్కృతిగానూ ఏర్పడివుండకపోతే ఈనాడు బడులూ కాలేజీలూ ఉండేవేగావు.



 బాధ్యతను గురించి మాట్లాడుకునే ఇదే సందర్భంగా, స్తన్యజీవుల జాబితాలో చేరిగూడా స్తనాలు ఏర్పడని రెండు జంతువులను మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బహుశా ఇవి మీసోజోయిక్ యుగం నుండి వస్తున్న జంతువులు అయ్యుండొచ్చు. ఆ తరహా జాతులన్నీ అంతరించిపోగా, ‘ఓర్నిథోరించెస్’, ‘ఎచిడ్నా’ అనే జీవులు ఇప్పటికీ నిలిచాయి. చర్మం మీద బొచ్చు పెరగడం వంటి లక్షణాలు ‘మ్యామెల్’కు లాగే ఉన్నా, ఇవి గుడ్లను పెట్టి పొదిగే జంతువులు. స్తనాలు ఏర్పడకపోయనా, పొట్టమీద చెల్లాచెదురుగా విస్తరించిన గ్రంధుల నుండి చెమ్మలాగా ఊరే పాలను నాకిస్తూ పిల్లలను పోషిస్తాయి.



 సీనోయిక్ యుగంలో ఖగోళ సంబంధంగా కూడా విశిష్టమైన మార్పులు కొన్ని చోటు చేసుకున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న వేగం క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్న కారణంగా, అదివరకటికంటే దినం పరిమాణం కాస్తా పెరిగింది. ఇప్పటిలాగా 24 గంటలంత నిడివి కాకపోయినా, ఏ 22గంటలకో చేరుకుంది. వేడి బాగా తగ్గి, మంచు కురిసే సందర్భాలు పెద్దగా పెరిగిపోయాయి. దీనికితోడు, సూర్యుని చుట్టూ తిరిగే వేగం కూడా తగ్గడమేగాక, వంకరలేని వృత్తాకారంగా ఉండిన కక్ష్య ఇతర గ్రహాల ఆకర్షణ శక్తికి పరిమితంగాలోనై, కోపులు సాగిన ఆకారం తీసుకునే క్రమంలో పడిపోయింది. అంటే, వాతావరణం రుతుచక్రంగా ఏర్పడే దిశగా పరిస్థితులు తోసుకుపోతున్నాయి.



 వసతి కోసం సీనోజోయిక్ యుగాన్ని రెండు ఘట్టాల కింద విభజించి చెప్పుకోవడం పరిపాటి. వాటిల్లో మొదటిది ‘టెర్షియరీ పిరియడ్.’  ఇది ఏడున్నర కోట్ల సంవత్సరాలప్పుడు మొదలై, కేవలం పదిలక్షల ఏళ్ళనాడు ముగిసింది. పదిలక్షల ఏళ్ళనాడు మొదలైన ‘క్వెటర్నరీ పిరియడ్’ ఇంకా ముగియలేదు. ఇప్పుడు మనం జీవిస్తున్నది ఈ యుగంలోనే. ఈ ఘట్టాలను ఇంకా విపులంగా చర్చించేందుకు చిన్న చిన్న శకాలుగా గూడా విభజించారు. అంత విస్తారమైన దర్యాప్తులో కూరుకుపోలేము కాబట్టి, అవసరాల మేరకు స్థూలంగా పరిశీలించే హద్దులకు మనం పరిమితమవుదాం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top