అత్తింటి వేధింపులకు వివాహిత బలి | Sakshi
Sakshi News home page

అత్తింటి వేధింపులకు వివాహిత బలి

Published Fri, Nov 10 2023 4:52 AM

పేడాడ శ్రీనివాసరావు కుటుంబసభ్యులు - Sakshi

ఆమదాలవలస రూరల్‌: వరకట్న పిశాచి మరో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. అదనపు కట్నం వేధింపులకు మరో వివాహిత బలైపోయింది. ఆమెతో పాటు ఇద్దరు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అక్కులపేట గ్రామానికి చెందిన పేడాడ సుజాత (33) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బిడ్డలు కూడా పురుగు మందు తాగేయడంతో వారు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

అక్కులపేట గ్రామానికి చెందిన పేడాడ శ్రీనివాసరావు, ఆమదాలవలస మున్సిపాలిటీ జగ్గుశాస్త్రులపేట గ్రామానికి చెందిన సుజాతకు 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మౌనిక (14), మహేశ్వరి (12) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మౌనిక 9వ తరగతి, చిన్న కుమార్తె మహేశ్వరి 7వ తరగతి స్వగ్రామం అక్కులపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. సుజాతకు వివాహం జరిగినప్పటి నుంచి సంతోషంగా ఉన్నా.. ఆ తర్వాత ఆస్తి గొడవలు ప్రారంభమయ్యాయి. అదనపు క ట్నం తీసుకురావాలని సుజాతను భర్త శ్రీనివాసరావుతో పాటు కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు. కన్నవారి ఇంటి నుంచి అదనపు కట్నం కింద భూమి తీసుకురావాలని ప్రతి రోజూ వేధించేవారు. దీంతో గత ఆదివారం రాత్రి సుజాత తాను పురుగు మందు తాగేయడమే కాకుండా ఆమె కుమార్తెల చేత కూడా తాగించారు. కుటుంబ సభ్యులు దీన్ని గమనించి వారిని శ్రీకా కుళం రిమ్స్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నందున ఐసీయూలో చికిత్స పొందుతున్న సుజాత బుధవారం మృతిచెందడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న కుమార్తెలు ఇద్దరి పరిస్థితి ప్రస్తుతానికి విషమంగా ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

అదనపు కట్నం కోసం నిత్యం శ్రీనివాసరావు వేధింపులు గురి చేస్తూ సుజాతను చిత్రహింసలకు గురిచేసేవాడని సుజాత తల్లి సత్యవతి ఆరోపిస్తున్నారు. భర్త, వారి కుటుంబసభ్యుల వేధింపులు తట్టుకోలేకే సుజాత ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై రిమ్స్‌ అవుట్‌ పోస్టులో కేసు నమోదు చేయగా ఆమదాలవలస పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. దీనికి కారకులైన సుజాత భర్త శ్రీనివాసరావు, మామ వెంకటరావు, మరిది శ్యామలరావుని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ రఘునాధ్‌ తెలిపారు.

పురుగు మందు సేవించిన తల్లీకూతుళ్లు

చికిత్స పొందుతూ తల్లి సుజాత మృతి, కూతుళ్ల పరిస్థితి విషమం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

1/1

Advertisement
Advertisement