
రైతుల హక్కులు భద్రం..
కందుకూరు: భూ భారతి చట్టంతో రైతుల హక్కులు భద్రంగా ఉంటాయని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో కందుకూరులోని టంకరి రాంరెడ్డి ఫంక్షన్ హాల్లో సోమవారం భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచే రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా ఈ చట్టాన్ని రూపొందించారని తెలిపారు. వ్యవసాయ పొలాలతో పాటు వ్యవసాయేతర భూములకు సంబంధించిన ప్రతీ సర్వే నంబర్ ఇందులో రికార్డు అవుతుందని స్పష్టంచేశారు. ఈ చట్టం ద్వారా పేద, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా అందుతుందని వివరించారు. రంగారెడ్డి జిల్లాలోనే భూ సమస్యలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఇందులో కందుకూరు మండలం కూడా ఒకటని స్పష్టంచేశారు. టీయూడీఐఎఫ్సీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ధరణితో రైతులు అనేక అవస్థలు పడ్డారని, భూ భారతితో అవన్నీ తీరనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, వైస్ చైర్మన్ యాదయ్య, నాయబ్ తహసీల్దార్ శేఖర్, ఏఓ లావణ్య, ఏంపీఓ గీతారెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు.