దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్న రైతులు వారు. ముక్కారు పంటలు పండే ఆ భూములపై వారికి ఎటువంటి హక్కులూ లేవు. ఆరోగ్యం దెబ్బతిన్నా, పిల్లలను చదివించాలన్నా, ఆడబిడ్డల పెళ్లి చేయాలన్నా ఆ రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పేది కాదు. ఆ రైతుల లంకంత కష్టాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పట్టాలు ఇచ్చి దూరం చేస్తోంది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: లంక భూముల రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. లంక భూములను దశాబ్దాలుగా సాగు చేసుకొంటున్న రైతులకు వాటిపై ఎలాంటి హక్కులూ లేవు. పట్టాదారు పాసుపుస్తకాలు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు లభించేవికావు. పట్టాలు ఇప్పించి ఆదుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికా రులకు లంక గ్రామాల రైతులు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం శూన్యం. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు పేర్ని నాని, ౖకైలే అనిల్కుమార్, సింహాద్రి రమేష్బాబు, మొండితోక జగన్మోహన్రావు, వసంత కృష్ణ ప్రసాద్ లంక రైతుల సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కృష్ణా జిల్లాలో 21 లంక గ్రామాల్లో ఉన్న 3,382 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 853 ఎకరాల భూములకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో కృష్ణా జిల్లాలో 5,888 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 1,333 మంది రైతులకు లబ్ధిచేకూరనుంది. నూజివీడులో శుక్రవారం జరగనున్న కార్యక్రమంలో లంకరైతులు పట్టాలు అందుకోనున్నారు. దీంతో ఈ రైతుల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పట్టాలు ఇవ్వనున్న లంక భూములు ఇవీ..
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో దక్షిణచిరువోలులంక, పులిగడ్డలోని మయపులంక, ఎడ్లంక లోని ఎరుకులలంక, వేకనూరులంక, చల్లపల్లి మండ లంలో వెలివోలులోని చీడేపూడిలంక, నడకుదురులోని ఆముదార్లంక, నిమ్మగడ్డలంక, మోపిదేవి మండలంలోని కె.కొత్తపాలెంలో లచ్చిగానిలంక, బొబ్బర్లంకలోని నామిడిలంక, పడకలంక, పామర్రు మండలంలో దేవరపల్లి, చాగంటిపాడు, రొయ్యూరు, తోట్లవల్లూరు లంక రైతులకు పట్టాలు అందనున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, జూపూడి, త్రిలోచనాపురం, మూలపాడు, కొటికలపూడి, నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల మండలంలో కొత్తపేట, గని ఆత్కూరు, చెవిటికల్లు, మున్నలూరు, కొనకనపాడు, ఎస్.అమరవరం లంక భూములకు పట్టాలు ఇవ్వనున్నారు.
పెరగనున్న లంక భూముల ధరలు
కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని భూముల్లో ఏటా మూడు పంటలు పండుతాయి. కొబ్బరి, మామిడి తోటలు, పసుపు, వరి, అరటి, కంద, మినుము, కూరగాయల పంటలు సాగుచేస్తారు. లంక భూములకు పట్టాలు లేకపోవడం వల్ల ప్రస్తుతం ఎకరా భూమి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకే ధర పలుకుతోంది. ఈ గ్రామాల్లో వేరేచోట్ల పంట భూముల ధర ఎకరాకు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంది. లంక భూములకు పట్టాలు ఇవ్వడంతో వీటికీ మంచి ధర వస్తుందని, అవసరమైతే బ్యాంకులు రుణాలు ఇస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
దశాబ్దాల సమస్యకు శాశ్వతపరిష్కారంతో రైతుల్లో హర్షాతిరేకాలు కృష్ణా జిల్లాలో 21 లంక గ్రామాల్లో 5,888 మంది రైతులకు లబ్ధి ఎన్టీఆర్ జిల్లాలో మరో 1,333 మంది లబ్ధిదారులకు మేలు నేడు నూజివీడులో లాంఛనంగా పట్టాలు ఇవ్వనున్న సీఎం వైఎస్ జగన్
కృష్ణా జిల్లా....
మండలం గ్రామాలు పట్టాలిచ్చే లబ్ధిదారుల
భూములు సంఖ్య
(ఎకరాల్లో)
అవనిగడ్డ 4 100.890 132
చల్లపల్లి 3 760.400 838
నాగాయలంక 2 74.00 102
మోపిదేవి 3 272.420 872
ఘంటసాల 1 432.299 754
కోడూరు 1 86.330 83
మచిలీపట్నం 2 208.510 116
తోట్లవల్లూరు 4 1,434.990 2,898
పమిడిముక్కల 1 12.740 93
మొత్తం 21 3382.579 5,888
ఎన్టీఆర్ జిల్లా
మండలం గ్రామాలు పట్టాలిచ్చే లబ్ధిదారుల
భూములు సంఖ్య
(ఎకరాల్లో)
ఇబ్రహీంపట్నం 5 765.07 1,209
కంచికచర్ల 6 88.56 120
మొత్తం 11 853.63 1,329
సంతోషంగా ఉంది
తోట్లవల్లూరు లంకలో 23 ఏళ్లుగా 50 సెంట్ల పొలం సాగు చేస్తున్నా. దానికి ఎలాంటి హక్కులూ లేవు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లంక భూములకు పట్టాలు ఇవ్వడంతో భూమిపై నాకు హక్కు వచ్చింది. అడంగల్లో భూమి నమోదవడంతో రైతు భరోసా, విత్తనాలు, ఎరువులు, బ్యాంకు రుణాలు, పంట నష్టపరిహారం పొందటానికి అవకాశం కలుగుతుంది. గత ప్రభుత్వాలు చేయలేని మేలు చేసి ఆదుకున్న జగనన్నకు లంక రైతులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు.
– పడమట హరిప్రసాద్, రైతు, తోట్లవల్లూరు
సీఎం జగన్కు రుణపడి ఉంటాం
మా నాన్న 1930వ సంవ త్సరం నుంచి లంక భూమి సాగు చేస్తూ 1942లో అప్పటి మద్రాస్ ప్రభుత్వం నుంచి లీజు అనుమతి పొందారు. నేను ఆ భూమిని 40 ఏళ్లుగా సాగుచేస్తున్నా. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారినా మాకు భూమిపై ఎటువంటి హక్కూ కల్పించలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో ఈ రోజు నా భూమిపై నాకు పూర్తి హక్కులు వచ్చాయి. మా ప్రాంతంలో 1300 మందికి మేలు చేకూరింది. సీఎం జగన్కు రుణపడి ఉంటాం.
– పీతా సీతారామయ్య, రైతు, ఇబ్రహీంపట్నం