ఎడపల్లి(బోధన్): మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆశ వర్కర్ మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలో ఉదయం 11గంటలకు ఆశ వర్కర్ అబ్బవ్వ(41) రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అబ్బవ్వ తలకు తీవ్రగాయాలుకాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు.
పరిస్థితి విషమించి వృద్ధురాలు..
నవీపేట: మండల కేంద్రానికి చెందిన శివరాశి చంద్రకళ(65) వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడగా, పరిస్థితి విషమించి గురువారం మృతి చెందినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు.
మండలంలోని నందిగామ నుంచి యంచకు వచ్చిన చంద్రకళ ఆటో దిగుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందిందన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.