ధర్పల్లి: సకాలంలో జీవాలకు నట్టల మందులు, టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు (జేడీ) జగన్నాథచారి జీవాల పెంపకందారులకు సూచించారు. మండల కేంద్రంతో పాటు బెలియా తండాలో బుధవారం పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు పీపీఆర్(పారుడు రోగము) టీకాలు వేశారు. కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి, మాట్లాడారు. గొర్రెలలో యాజమాన్య పద్ధతులు పాటించి, పుట్టిన పిల్లలను చనిపోకుండా చూసుకోవాలని పెంపకందారులకు సూచించారు. మండల పశు వైద్యాధికారి గంగాప్రసాద్, సిబ్బంది శివకుమార్, సర్దార్, రంజిత్, వెంకన్న పాల్గొన్నారు.
ఫీజుల పెంపు ఆలోచనను విరమించుకోవాలి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ, పీజీ పరీక్ష ఫీజుల పెంపు ఆలోచనను విరమించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు బుధవారం తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట నిరసన చేపట్టారు. పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోగల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, డిగ్రీ, పీజీ కళాశాలలకు సంబంధించి పరీక్ష రుసుములను పెంచవద్దన్నారు. రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి అందుబాటులో లేకపోవడంతో, వారు ఫోన్లో సంప్రదించగా పరీక్ష ఫీజులను పెంచబోమని హామీ ఇచ్చారు. నాయకులు అశూర్, అజయ్, నిఖిల్, రాజేష్, రాకేష్ పాల్గొన్నారు.
హాస్టల్ డిపాజిట్లను తగ్గించాలి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్స్ డిపాజిట్లను ఒకేసారి పెంచడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతారని, వెంటనే వాటిని తగ్గించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు విగ్నేష్ పేర్కొన్నారు. ఈమేరకు బుధవా రం ఎస్ఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో తెయూ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ మహేందర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో ఉన్న విధంగానే హాస్టల్స్ ఫీజులు వసూలు చేయాలని డిపాజిట్ పెంపు విషయంలో పునరాలోచించాలని కోరారు. ఈ విషయాన్ని వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ ల దృష్టికి తీసుకెళతానని వార్డెన్ హామీ ఇచ్చారు. నాయకులు దినేష్, వెంకటరమణ, చరణ్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
మోపాల్(నిజామాబాద్రూరల్): నగరంలోని కాలనీల్లో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తానని నుడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి పేర్కొన్నారు. నగర శివారులోని బోర్గాం(పి)లోగల తన నివాసంలో బుధవారం ఆర్యనగర్ కాలనీకి చెందిన యువకులు ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ హబ్ల ద్వారా యువత, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ అభివృద్ధి ప్రదాత బాజిరెడ్డి గోవర్ధన్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాయకులు ఈగ శ్రీనివాస్రెడ్డి, సయ్యద్ నబీ, గాదారి శ్యాంసుందర్రెడ్డి, హరీష్కుమార్, కీర్తివర్ధన్రెడ్డి, నితిన్గౌడ్, విశాల్, మంగల్, లోకేష్, నిఖిల్, నర్సింహా, సాయి ఈశ్వర్, ఉదయ్, సాయిరాం, నందకుమార్రెడ్డి పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
నిజామాబాద్నాగారం: నగరంలోని పలు డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు, కార్యకర్తలు బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి, బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నగరంలో జరిగిన అభివృద్ధి వివరించారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకి ఓటు వేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.