నేడు వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్
● విజయం భారత్దే అంటున్న అభిమానులు ● పరాజయం ఎరగని జట్టు కప్ సాధిస్తుందని ధీమా
ఖమ్మంస్పోర్ట్స్: ఈ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ల్లో భారత జట్టు అప్రతిహతంగా విజయ పరంపర కొనసాగిస్తోంది. ఆడిన పది మ్యాచ్ల్లోనూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించి విజయాలు కై వసం చేసుకుంది. సెమీఫైనల్లోనూ సత్తా చాటడంపై అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా బ్యాట్స్మెన్లతో పాటు బౌలర్లు కూడా ప్రతిభకు తగిన విధంగా రాణిస్తుండడంతో భారత్కు ఇప్పటివరకు ఎదురులేకుండా పోయింది. అయితే, ఆదివారం ఫైనల్స్ జరగనుండడం, ప్రత్యర్థి ఆస్ట్రేలియా కావడంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ భారత జట్టులో ఏడో నంబర్ వరకు బ్యాట్మెన్ సత్తా చాటుతుండడం కలిసొస్తుందనే నమ్మకంతో ఉన్నారు. మరోపక్క షమి వంటి బౌలర్లు.. ఫీల్డింగ్లో చురుకుదనం కలగలిపి కప్ సాధించడం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్ – ఆస్ట్రేలియా నడుమ ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లలోనే మ్యాచ్ చూసేందుకు పలువురు సిద్ధమయ్యారు. మరికొందరు మాత్రం స్నేహితులతో కలిసి మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంకొందరు హోటళ్లలో గదులు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా వరల్డ్ కప్లో మొదటి నుంచి పరాజయం ఎరగకుండా దూసుకెళ్తున్న భారత జట్టు ఫైనల్స్లోనూ అదే స్థాయి సత్తా చాటి కప్ గెలుచుకోవాలని అభిమానులంతా ఆశిస్తున్నారు.