సాక్షి, బెంగళూరు: రాష్ట్ర విధానసభ ఎన్నికల్లో ముఖ్యమైన నామినేషన్ల ఘట్టం గురువారం సాయంత్రంతో సమాప్తమైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్, చిన్నపార్టీలైన ఆప్, ఎస్డీపీఐ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎంల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. పెద్ద పార్టీల అభ్యర్థుల ఊరేగింపుల సందడి మిన్నంటింది. హుబ్లీ–ధార్వాడ, కలబురిగి, కోలారు, బెళగావిలో ర్యాలీగా ఉధృతంగా సాగాయి. బెళగావిలో మరాఠా పార్టీ అభ్యర్థి ఊరేగింపులో చక్రవర్తి శివాజీ వేషధారి ఆకట్టుకున్నారు.
నేడు పరిశీలన, ప్రకటన
శుక్రవారం ఉదయం నుంచి ఎన్నికల అధికారుల కార్యాలయంలో నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఆమోదించినవి, తిరస్కరించిన నామినేషన్ల వివరాలను ప్రకటిస్తారు. నామినేషన్ పత్రాల్లో తప్పులు ఉంటే ఇబ్బంది అని అనేకమంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. కాగా ఉపసంహరణకు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. కొద్దిమంది రెబెల్స్గా మారి నామినేషన్లను వేశారు. అయితే వీరిని బుజ్జగించి నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేసేందుకు ఆయా రాజకీయ పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. శుక్రవారం నుంచి పార్టీల ప్రచారం ఊపందుకోనుంది. బీజేపీ, కాంగ్రెస్లకు ఢిల్లీ నుంచి అగ్రనేతలు రానున్నారు.