
వరంగల్ నగరంలో మరో విద్యార్థి
మృతుడు నెక్కొండ వాసి
హసన్పర్తి: స్నేహితులతో ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని రెడ్డిపురం చెరువు వద్ద శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం టేకులకుంట తండాకు చెందిన తేజావత్ గణేశ్ నగరంలోని అతిథి హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే హాస్టల్లో ఉంటున్న మాలోతు కార్తీక్, రాకేశ్, సాయి కిరణ్తో కలిసి గణేశ్ శనివారం రెడ్డిపురం సమీపంలోని చెరువులోకి ఈతకు వెళ్లాడు. నలుగురు చెరువులోకి దిగి ఈతకొట్టడం ప్రారంభించారు. గణేష్ ఈత కొడుతూ ముందుకు వెళ్లి మునిగిపోయాడు. గణేశ్ మునిగినట్లు గ్రహించిన స్నేహితులు ఈ విషయాన్ని బంధువులు, మిత్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. చెరువులోనుంచి గణేశ్ మృతదేహాన్ని వెలికి తీశారు. పంచనామా చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడి తండ్రి తేజావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.