
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వరంగల్ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని కలెక్టర్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా అటవీశాఖ అధికారి అనూజ్ అగర్వాల్ మాట్లాడుతూ.. రోజువారీ జీవితంలో సింగిల్యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలన్నారు. ఈసందర్భంగా ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించండి’ అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలు జ్ఞాపికలతో కలెక్టర్ సత్యశారద సన్మానించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఉమ్మడి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సునీత, ఎన్ఐటీ ప్రొఫెసర్ వేణు, వినోద్, డాక్టర్ శ్రీనివాస్, గణేశ్ ఈకో కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.