
యజమాని అంటూ మెసేజ్..
వరంగల్ క్రైం : యజమాని పేరుతో ఫేక్ మెసేజ్ చేసి కోట్లు కాజేసిన సైబర్ నేరస్తుడిని అరెస్టు చేసినట్లు వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ఏసీపీ సీహెచ్.ఆర్.వి. ఫణీందర్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రతాప్ఘడ్ జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్.. హనుమకొండలోని ప్రముఖ హచరీస్ సంస్థలో పనిచేస్తున్న గుమాస్తాకు మార్చి 19వ తేదీన ఓ నంబర్ నుంచి ఫోన్ చేసి ‘నేను మీ యజమానిని.. ఇది నా కొత్త ఫోన్ నంబర్ అని, ఈ నంబర్ సేవ్ చేసుకొమ్మని’ సదరు సంస్థ గుమాస్తాకు వాట్సాప్లో మెసేజ్ పంపించాడు. దీంతో తన యజమాని నంబర్ అని భ్రమపడి సంస్థ గుమాస్తా తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. మరుసటి రోజు గుమాస్తా తాను సేవ్ చేసుకున్న నంబర్కు ఫోన్ చేయగా నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత చేస్తానని సైబర్ నేరగాడు సమాధానం చెప్పాడు. అనంతరం నిందితుడు గుమాస్తాకు ఫోన్ చేయడంతో యజమానే ఫోన్ చేస్తున్నాడని ఫోన్ తీయడంతో ఎక్కడ ఉన్నావని అడిగి తన బ్యాంక్ లావాదేవీలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి తాను చెప్పిన అకౌంటుకు డబ్బును ట్రాన్స్ఫర్ చేయమనడంతో గుమాస్తా నిందితుడు చెప్పిన బ్యాంక్ ఖాతాకు రెండు దఫాలుగా మొత్తం రూ.1.68 కోట్లు బదిలీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మరోమారు నిందితుడు ఫోన్ చేయడంతో నిందితుడి మాటతీరును తప్పుపట్టి గుమాస్తా అనుమానంతో తన సంస్థ యజమానికి సంబంధించిన వ్యక్తిగత నంబర్కు ఫోన్ చేశాడు. దీంతో అసలు విషయం బయటకు వచ్చి యజమాని, తమ గుమాస్తా సైబర్ నేరగాడి చేతిలో మోసపోయినట్లుగా గుర్తించి వెంటనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగంలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్న టెక్నాలజీతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ యాసిన్, ఎస్సైలు చరణ్, శివ, కానిస్టేబుల్లు శివ, జహూర్ను ఏసీపీ అభినందించారు.
రూ.1.68 కోట్లు కాజేసిన
సైబర్ నేరస్తుడి అరెస్ట్