
ఇక ‘కృత్రిమ’ పాఠాలు!
విద్యారణ్యపురి: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్ల సాయంతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) ద్వారా పాఠాలు బోధించనుంది. ఇప్పటికే ఆరు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం అమలు చేయనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దీన్ని అమలు చేయనున్నారు. సంబంధిత ఎంఈఓ, కాంప్లెక్స్ హెడ్మాస్టర్, ఉపాధ్యాయులకు హైదరాబాద్లో ఒకరోజు శిక్షణ ఇచ్చారు.
పాఠశాలలివే..
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపెల్లి, ముల్కనూరు ప్రాథమిక పాఠశాల, ధర్మసాగర్ మండలం దేవనూరు ప్రాథమిక పాఠశాల, హనుమకొండ మండలం కుమార్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, హసన్పర్తి మండలం దేవన్నపేట, నాగారం, మడిపల్లి ప్రాథమిక పాఠశాలలు, ఐనవోలు మండలం కక్కిరాలపల్లి ప్రాథమిక పాఠశాల, పరకాల మండలం నాగారం ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ ద్వారా బోధనను ప్రారంభించనున్నారు. కలెక్టర్ ప్రావీణ్య, డీఈఓ వాసంతి కలిసి ఐనవోలు మండలం కక్కిరాలపల్లి ప్రాథమిక పాఠశాలలో నేటి (శనివారం) నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే 9 పాఠశాలల్లో 404 మంది విద్యార్థులుండగా.. అభ్యసన సామర్థ్యాల్లో బాగా.. వెనుకబాటులో ఉన్న సీగ్రేడ్ విద్యార్థులైన 109 మందికి ఈకృత్రిమ మేధ ద్వారా పాఠాలు అందించేలా ఏర్పాట్లు చేశారు. కృత్రిమ మేధను అనుసరించి ఏక స్టెప్ ఫౌండేషన్ రూపొందించిన కంప్యూటర్ ఆధారిత కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. ఒక్కో హైస్కూల్లోని విద్యార్థుల కోసం ఐదు కంప్యూటర్లు ఇప్పటికే అందించారు.
వివిధ సబ్జెక్టుల్లో బోధన
విద్యార్థులకు తెలుగు, ఆంగ్లానికి సంబంధించి ప్రమాణాలు నేర్పుతారు. గణితంలో సంఖ్యా భావనలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు, ఆరోహణ, అవరోహణ సామర్థ్యాలు నేర్పిస్తారు. ఇందుకు సంబంధించి హనుమకొండ జిల్లాలోని 10 పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు 5 కంప్యూటర్లు చొప్పున అందించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా విద్యార్థికి దృశ్య, శ్రవణ జ్ఞానం చేకూరుతుంది. సామర్థ్యాలు పెరుగుతాయి.
వరంగల్ జిల్లాలో 11 ప్రభుత్వ పాఠశాలలు..
కాళోజీ సెంటర్: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు)తో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద వరంగల్ జిల్లాలో 11 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయగా.. విద్యార్థులకు ఏఐ సహకారంతో వర్చువల్ రియాల్టీ విధానంలో పాఠాలు చెప్పేలా కసరత్తు జరుగుతోంది. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచే లక్ష్యంగా శనివారం నుంచి ఏఐ బోధన ప్రారంభించనుంది. ఎఫ్ఎల్ఎన్కు సాంకేతికత జోడించి ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్జీటీలకు శిక్షణ ఇచ్చారు.
విద్యార్థులకు ఏఐతో బోధన
అభ్యసన సమర్థ్యాల సాధన కోసం అమలు
నేడు అధికారికంగా ప్రారంభం
జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక
పాఠశాలలు ఎంపిక