● జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ● ఘనంగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు
గుంటూరువెస్ట్: మహనీయుల ఆశయ సాధన కోసం నేటి యువతరం శ్రమించాలని కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి అన్నారు. దేశ తొలి విద్యా శాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు శనివారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి కలెక్టర్, జేసీ, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి రోజే జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీల సంక్షేమ దినోత్సవంగా జరుపుకోవడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, డీఆర్వో చంద్రశేఖరరావు, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మండేపూడి పురుషోత్తం, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, తెనాలి మున్సిపల్ మాజీ చైర్మన్ ఖలీదా నసీం, వక్ఫ్బోర్డ్ అధ్యక్షుడు జిలాని, ఆర్అండ్బీ డైరెక్టర్ పిల్లి మేరి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి జమీర్ బాషా, డీఆర్డీడీఏ పీడీ హరిహరనాఽథ్ తదితరులు పాల్గొన్నారు.